దున్న వస్తున్నాడు... జగన్ను అంతమాట అంటారా?: టీడీపీపై బొత్స ఆగ్రహం
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత బొత్స సత్యనారాయణ గురువారం నిప్పులు చెరిగారు. చంద్రబాబు పాలనలో ఏపీ దివాళా తీసిందన్నారు. రాష్ట్ర ఆదాయం పెరగలేదు కానీ ఖర్చులు మాత్రం విపరీతంగా పెరిగాయన్నారు.
చంద్రబాబు... జగన్నామస్మరణ
రూ.2 లక్షల 50 వేల కోట్ల అప్పును రాష్ట్ర ప్రజల నెత్తిన పెట్టారని బొత్స తీవ్రంగా మండిపడ్డారు. లేచిన దగ్గర నుంచి చంద్రబాబు నిత్యం జగన్ నామస్మరణ చేస్తున్నారని ఎద్దేవా చేశారు. నాలుగేళ్ల పాటు కేంద్రంలో భాగస్వామిగా ఉండి రాష్ట్రానికి ఏం సాధించారన్నారు. ఢిల్లీలో దీక్ష కోసం తెలుగుదేశం ప్రభుత్వం రైల్వేకు కోటి 38 లక్షల రూపాయల ప్రజాధనం చెల్లించిందన్నారు.
కాపు రిజర్వేషన్లపై మోసపూరితం
చంద్రబాబు సర్కారు తీసుకొచ్చిన కాపు రిజర్వేషన్ల బిల్లు మోసపూరితంగా ఉందని బొత్స ఆరోపించారు. పేద అగ్రవర్ణాల రిజర్వేషన్ను ఒక కులానికి ఎలా ఇస్తారని ప్రశ్నించారు. కాపులకు అయుదు శాతం కాదు 10 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. వారం రోజుల పాటు జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో తనను తాను పొడుగుకోవడానికే చంద్రబాబు సమయం అంతా వెచ్చించారన్నారు. టీడీపీని వ్యతిరేకించే సభ్యులను బెదిరించడానికి అసెంబ్లీని వేదికగా వాడుకున్నారన్నారు. తన రాజకీయ జీవితంలో ఇంత పొగరుగా ప్రవర్తించే సీఎంను చూడలేదన్నారు.
ప్రతిపక్ష నేతను అంత మాటంటారా?
అసెంబ్లీ ఔన్నత్యాన్ని చంద్రబాబు దిగజార్చారని బొత్స మండిపడ్డారు. ఎన్నికలకు ముందు పార్లమెంట్ సమావేశాల్లో పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశ పెట్టరాదని చెప్పిన చంద్రబాబు మరి ఏపీలో ఎలా పూర్తి బడ్జెట్ ప్రవేశ పెట్టారని నిలదీశారు. చంద్రబాబు రాష్ట్రానికి పట్టిన చీడ, చెద పురుగు అన్నారు. అసెంబ్లీ సమావేశాలు చూస్తే చంద్రబాబు మోసం, దగా కనిపిస్తాయన్నారు. సభలో లేని వారి గురించి అవహేళనగా మాట్లాడుతున్నారని, ప్రతిపక్ష నేత జగన్ను ఉద్దేశించి దున్న వస్తున్నాడని అవహేళన చేశారన్నారు. ఇదేనా చంద్రబాబు సభ్యత, సంస్కారం అన్నారు. నరేంద్ర మోడీని ఇఫ్పుడు ప్రశ్నించడం ఏమిటన్నారు.