ఆంధ్రా ద్వేషం..రాళ్లేసినా లాలూచీ : టార్గెట్ జగన్ : బాబు సెంటిమెంట్ రాజకీయం పండుతుందా..!
టిఆర్యస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్..వైసిపి అధినేత జగన్ సమావేశం టిడిపి చేతికి కొత్త ఆయుధాన్ని ఇచ్చింది. ఈ సమావేశం ముగిసనప్పటి నుండి టిడిపి సెంటిమెంట్ రాజకీయం పండిస్తోంది. టిఆర్యస్ ఆంధ్రా ద్వేషి పార్టీ అని..అదే విధంగా..జగన్ తన పై రాళ్లేసిన వాళ్లతో లాలూచీ పడ్డారంటూ విమర్శిస్తున్నారు. దీంతో..అసలు ఇప్పుడు ఈ రాజకీయం ఏపిలో వర్కవుట్ అవుతుందా లేదా అనే చర్చ మొదలైంది..
టిఆర్యస్ నేతల ద్వేషాన్ని ప్రచారం చేయండి..
టిడిపి అధినేత చంద్రబాబు పార్టీ కేడర్ కు రాజకీయంగా కొత్త వ్యూహాలు సూచిస్తున్నారు. టీఆర్ఎస్ నేతల ఆంధ్రా ద్వేషాన్ని ప్రచారం చేయాలని నేతలను ఆదేశించారు. ఎలక్షన్ మిషన్ 2019పై సీఎం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. కేసీఆర్, కవిత, కేటీఆర్ , హరీష్ దుర్భాషలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. తృణమూల్ కాంగ్రెస్ అధ్యక్షురాలు, బెంగా ల్ ముఖ్యమంత్రి మమత నిర్వహిస్తున్న కోల్కతా ర్యాలీకి 20కి పైగా పార్టీల నాయకులు హాజరయ్యారని సీఎం చంద్ర బాబు తెలిపారు. జగన్, కేసీఆర్ తప్ప అందరూ కోల్కతా వచ్చారన్నారు. కోల్కతా వచ్చిన వాళ్లంతా మోదీ వ్యతిరేకులే అని దీంతో కేసీఆర్, జగన్ ఉన్నది మోదీ వెంటే అనేది సుస్పష్టమవుతోందని పేర్కొన్నారు. టిఆర్యస నేతలు చేసిన వ్యాఖ్యలను తిరిగి ఇప్పుడు ఏపి ప్రజలకు గుర్తు చేయటం ద్వారా టిఆర్యస్ పై ఏపి ప్రజల్లో లోలోపల ఉన్న ఆగ్రహా న్ని మరో సారి గుర్తు చేసి..పరోక్షంగా జగన్ ను లక్ష్యంగా చేసుకోవాలని నిర్ణయించారు.
టిఆర్యస్ పై తుపాకి పెట్టి..జగన్ లక్ష్యంగా..
కెటిఆర్ - జగన మీటింగ్ ద్వారా ఆ రెండు పార్టీలు కలిసాయనివ..ఏపికి ద్వేషం చూపించే టిఆర్యస్ నేతలతో జగన్ కలుసారనే ప్రచారం తీవ్ర తరం చేయాలని చంద్రబాబు పార్టీ కేడర్ కు సూచిస్తున్నారు. టిఆర్యస్ తో అంటకాగుతు న్న జగన్ వైఖరిని ఎండగట్టాలని తెలిపారు. వరంగల్లో తనపై రాళ్లేసిన వాళ్ళతో జగన్ లాలూచిపడ్డారని, కేసుల కోసమే మోదీతో జగన్ లాలూచి పడ్డారని విమర్శించారు. అలాగే అక్రమాస్తుల కోసం కేసీఆర్తో లాలూచి పడ్డారని అన్నారు. వైసీపీ లాలూచి రాజకీయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని చంద్రబాబు ఆదేశించారు. డబ్బులు పెట్టే అభ్యర్థు లను వైసీపీ వెదుకుతోందన్నారు. వైసీపీ అభ్యర్థులు ప్రజల్లో ఉండేవారు కాదని.. డబ్బుల్లో ఉండేవాళ్లని వ్యాఖ్యానించా రు. డబ్బుల కోసమే వైసీపీ రాజకీయం.. డబ్బులతోనే జగన్ రాజకీయమని అన్నారు. ఇదే సమయంలో బిజెపి - కేసీఆర్ - జగన్ ముగ్గురూ ఏపికి అన్యాయం చేస్తున్నారని..గద్దల్లా వాలుతున్నారంటూ సీయం పదే పదే విమర్శలు గుప్పించి వారు ఏపి అభివృద్దికి వ్యతిరేకులనే భావన కల్పించే ప్రయత్నం చేస్తున్నారు.
బాబు సెంటిమెంట్ పండుతుందా..!
ముఖ్యమంత్రి చంద్రబాబు ఏపిలో పండిస్తున్న సెంటిమెంట్ పండుతుందా లేదా అనే చర్చ మొదలైంది. తొలుత టిఆర్యస్ తో పొత్తుకు ప్రయత్నాలు చేసింది చంద్రబాబు అనే విషయాన్ని వైసిపి నేతలు ప్రచారం చేస్తున్నారు. తాము ఏపిలో ఎవరితో పొత్తు పెట్టుకోమనే విషయాన్ని స్పష్టం చేస్తున్నారు. అయితే, ముఖ్యమంత్రి మాత్రం తెలంగాణ ఎన్నికల సమయంలో కేసీఆర్..చంద్రబాబు ను బూచి గా చూపించి ఏ రకంగా అయితే సక్సెస్ అయ్యారో..అదే విధంగా ఏపిలో తన ప్రధాన ప్రత్యర్ధి వైసిపి ..కేసీఆర్ తో కలిసి ఏపికి అన్యాయం చేస్తున్నారనే విషయాన్ని టిడిపి నేతలు ప్రధా నాస్త్రంగా మలచుకుంటున్నారు. అయితే, తెలంగాణలో కెసిఆర్ ఉపయోగించిన సెంటిమెంట్ వర్కువుట్ అయింది. అయితే, ఏపిలో ఈ సెంటిమెంట్ పండుతుందా లేదా అనే చర్చ మొదలైంది. తెలంగాణలోని ఏపి సెటిలర్లు సైతం తాజాగా జరిగిన ఎన్నికల్లో టిఆర్యస్ కే మెజార్టీ ఓట్లు వేసారు. మరి..ఇప్పుడు ఏపిలో గతంలో జరిగిన అంశాలను తిరిగి లేవనెత్తటం ద్వారా చంద్రబాబు అనుకన్నట్లుగా రాజకీయంగా టిడిపికి కలిసి వస్తుందా అనేది చూడాల్సిందే. ఇక, వచ్చే నెలలో ఏపికి కేసీఆర్ వచ్చి ఏం చెబుతారు..ఏం చేస్తారు అనే దాని పై భవిష్యత్ రాజకీయాలు మలుపు తీసుకొనే అవకాశం ఉంది.