త్వరలో గుడ్ న్యూస్: పీఆర్సీపై కసరత్తు: సజ్జల రామకృష్ణారెడ్డి
ప్రభుత్వ ఉద్యోగులు త్వరలోనే శుభవార్త వింటారని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. పీఆర్సీ నివేదికపై కీలక ప్రకటన చేశారు. ప్రభుత్వ ఉద్యోగులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న పీఆర్సీపై కసరత్తు ముమ్మరంగా జరుగుతోందని వివరించారు. ఈ అంశంపై సీఎం జగన్ తో చర్చిస్తున్నామని ఆయన తెలిపారు. త్వరలో ఉద్యోగులు శుభవార్త అందుకుంటారని వెల్లడించారు.
ఇప్పటికే పీఆర్సీపై ప్రకటన చేయాలనుకున్నామని, కొన్ని కారణాల వల్ల చేయలేకపోయినట్లు వివరించారు. రాష్ట్రంలోని ఉద్యోగ సంఘాలు ఆందోళన చేయడం లేదని సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. సీఎస్ కోసం వెయిట్ చేస్తున్నట్లు చెప్పారు. ఉద్యోగ సంఘాలతో సామరస్యంగానే పరిష్కరించుకుంటామని వివరించారు. ఉద్యోగులకు ఎలాంటి ఆందోళన అవసరం లేదని సజ్జల రామకృష్ణారెడ్డి హామీ ఇచ్చారు.
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో సజ్జల చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. అంతకుముందు సచివాలయం నుంచి ఉద్యోగ సంఘాల నేతలు వెనుదిరిగారు. పీఆర్సీ నివేదిక కోసం 6 గంటల పాటు ఎదురు చూశారు. అయినా ప్రభుత్వం నుంచి స్పందన రాలేదు. దీంతో ప్రభుత్వ తీరుపై ఉద్యోగ సంఘాల నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు. పీఆర్సీ నివేదిక ఇవ్వక పోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఇరు జేఏసీల సమావేశం పెట్టుకుంటున్నామని, కార్యాచరణపై చర్చిస్తామని పేర్కొన్నారు. కానీ ఇంతలోనే సజ్జల ప్రకటన చేశారు.
వాస్తవానికి పీఆర్సీ కోసం ఉద్యోగులు ఎదురుచూస్తున్నారు. రకరకాల కారణాలతో వాయిదా పడుతూ వస్తోంది. బుధవారం ఉద్యోగ సంఘం నేతలు రాగా.. వెయిట్ చేయించారు. దాదాపు 6 గంటలకు పైగా వెయిట్ చేసి మరీ వెళ్లిపోయారు. ఆ తర్వాత సజ్జల ప్రకటన చేశారు. కసరత్తు జరుగుతుందని.. గుడ్ న్యూస్ వింటారని ఆయన చెప్పారు. ఇదీ కాస్త ఊరట కలిగించే అంశంగా మారింది.