ఫిబ్రవరి 1న ఏపి బంద్ : ఎన్నికల ముందు హోదా బరిలోకి పార్టీలు..!
ఎన్నికలు సమీపిస్తున్న వేళ..మరో సారి ఏపిలో ప్రత్యేక హోదా సెగలు మొదలవుతున్నాయి. ప్రత్యేక హోదా కోసం పవన్ - జగన్ డిమాండ్ చేసారు. టిడిపి ఇదే కారణంతో ఎన్డీఏ నుండి బయటకు వచ్చింది. ఇక, హోదా కోసం వామపక్ష పార్టీల మద్దతుతో ఏర్పడిన హోదా సాధన సమితి ఇప్పటికే ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఇందులో భాగం గా ఫిబ్రవరి 1న ఏపి బంద్ కు పిలుపునిచ్చింది.
ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్
ఏపికి పార్లమెంట్లో ఇచ్చిన హామీ మేరకు ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఫిబ్రవరి 1న ప్రత్యేక హోదా సాధనా సమితి ఆధ్వర్యంలో రాష్ట్ర బంద్ నిర్వహించాలని నిర్ణయించారు. ఇప్పటికే అనేక ఆందోళన కార్యక్రమాలు నిర్వహించిన తాము ఇక ఎన్నికల ముందు కేంద్ర ప్రభుత్వం పై ఒత్తిడి పెంచే క్రమంలో బాగంగా కార్యాచరణ అమలు చేస్తున్నట్లు నిర్వహకులు చెబుతున్నారు.
కేంద్ర బడ్జెట్ రోజున నిరసనగా..
కొద్ది రోజుల క్రితం ఢిల్లీలో ఇదే అంశం పై ఆందోళన చేసారు. ఆ సమయం లో ఢిల్లీ పోలీసులు వీరి పై లాఠీ చార్జ్ కూడా నిర్వహించారు. ప్రధాని మోదీ ఏపి పర్యటనకు వస్తే నిరసన తెలియచేయా లని భావించినా..ప్రధాని సభ వాయిదా పడింది. దీంతో..ఫిబ్రవరి 1న కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ రోజునే ఏపిలో బంద్ నిర్వ హణకు నిర్ణయం తీసుకున్నారు. ఈ బంద్ కు సహకరించాలని అన్ని పార్టీల నేతలను కోరుతున్నారు.
పార్టీలన్ని సహకరించాలి..
ఫిబ్రవరి 1న జరపతలపెట్టిన బంద్ కు అన్ని పార్టీలు సహకరించాలని ప్రత్యేక హోదా సాధనా సమితి నేతలు కోరా రు. ముఖ్యమంత్రిని కలిసిన బృందంలో ఇదే విజ్ఞప్తి చేసింది. అయితే, బంద్ చేస్తే మనకే ఇబ్బంది కదా అని పేర్కొ న్న ముఖ్యమంత్రి పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. అదే విధంగా..కాంగ్రెస్ పిసిసి చీఫ్ రఘువీరా తో పాటుగా వైసిపి అధినేత జగన్, జనసేన అధ్యక్షుడు పవన్ తోనూ ప్రత్యేక హోదా సాధనా సమితి నేతలు సమావేశం కానున్నారు. తాము పిలుపునిచ్చిన బంద్ కు మద్దతు ఇవ్వాలని కోరనున్నారు. గతంలో, ఇదే అంశం పై నిర్వహించిన బంద్ కు అన్ని పార్టీల మద్దతు లభించింది. ఇప్పుడు మరి ఎన్నికల వేళ..తిరిగి హోదా సెంటిమెంట్ రగులుతున్న ఈ సమయంలో పార్టీలు ఏ రకంగా స్పందిస్తాయో చూడాలి.