పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారంటే? గాజవాక-తూర్పు గోదావరిలపై ప్రత్యేక దృష్టి
అమరావతి: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రెండు రోజుల క్రితం తనకు ఎమ్మెల్యే టిక్కెట్ ఇవ్వాలని పార్టీ స్క్రీనింగ్ కమిటీకి దరఖాస్తు చేసుకున్న విషయం తెలిసిందే. వచ్చే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోకసభ ఎన్నికల్లో పోటీ చేయాలనుకున్న వారు తమ తమ దరఖాస్తులను స్క్రీనింగ్ కమిటీకి ఇవ్వాల్సి ఉంటుంది. ఇందులో భాగంగా మంగళవారం పవన్ తన దరఖాస్తును స్క్రీనింగ్ కమిటీకి ఇచ్చారు.
షరతుల్లేవు, పవన్ కళ్యాణ్ పిలవలేదు: జగన్తో ఆమంచి భేటీ, కుటుంబంతో సహా..
ప్రధానంగా కొన్ని స్థానాలు పరిశీలన
స్క్రీనింగ్ కమిటీ మెంబర్స్ అభ్యర్థుల దరఖాస్తును పరిశీలించి, ఎక్కడి నుంచి పోటీ చేస్తే మంచిది, ఎవరు పోటీ చేస్తే మంచిది, ఎవరు ఎక్కడి నుంచి పోటీ చేస్తే గెలిచే అవకాశాలు ఉంటాయనేది నిర్ణయిస్తారు. ఈ నేపథ్యంలో జనసేనాని ఇచ్చిన దరఖాస్తును స్క్రీనింగ్ కమిటీ పరిశీలించింది. పవన్ కళ్యాణ్ పోటీ చేసేందుకు కొన్ని స్థానాలను ప్రధానంగా పరిశీలిస్తున్నట్లుగా తెలుస్తోంది.
గాజువాక లేదా తూర్పు గోదావరి జిల్లా
విశాఖపట్నంలోని గాజువాక అసెంబ్లీ నియోజకవర్గం లేదా తూర్పు గోదావరి జిల్లాలోని ఏదో ఒక నియోజకవర్గం నుంచి పవన్ పోటీ చేస్తే బాగుంటుందని స్క్రీనింగ్ కమిటీ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. స్క్రీనింగ్ కమిటీ ప్రధానంగా గాజువాక నియోజకవర్గానికి అగ్ర ప్రాధాన్యం ఇస్తున్నట్లుగా తెలుస్తోంది. మొత్తానికి పవన్ ఉత్తరాంధ్ర నుంచి పోటీ చేస్తే బాగుంటుందని భావిస్తున్నారట. దీనిపై మరికొద్దిరోజుల్లో స్పష్టత రానుంది.
పవన్ పోటీపై జనసైనికుల్లో పోటీ
పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే అంశం అందరిలోను చర్చనీయాంశంగా మారింది. ఆయన తమ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలంటే తమ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని పలువురు అభిమానులు, జనసైనికులు కోరుకుంటున్నారు. ఆయన ఎక్కడకు వెళ్తే ఆయా నియోజకవర్గాల ప్రజలు అక్కడి నుంచి పోటీ చేయాలనికోరుతున్నారు. పవన్ మనసులో ఏముందో కూడా తెలియదు. ప్రధానంగా గోదావరి జిల్లాలు, ఉత్తరాంధ్ర నుంచి పోటీ చేసేలా కనిపిస్తోంది.