జగన్ నియామకం చట్టవిరుద్దమే, సీపీఐ నారాయణ, మరీ కరుణానిధి ఎలా: సాయిరెడ్డి
ఇటీవల జరిగిన ప్లీనరీలో వైసీపీ శాశ్వత అధ్యక్షుడిగా వైఎస్ జగన్ నియామకం జరిగింది. అయితే దీనిపై దుమారం కొనసాగుతూనే ఉంది. విపక్షాలు సీఎం జగన్ను కౌంటర్ చేస్తున్నాయి. టీడీపీ, బీజేపీ వెంటనే రియాక్ట్ అయ్యాయి. ఇప్పుడు సీపీఐ వంతు వచ్చింది. సీపీఐ నారాయణ స్పందించారు. ఆయన కూడా సరికాదు అని కామెంట్ చేశారు. ఇదీ ముమ్మాటికీ చట్ట విరుద్దం అని అంటున్నారు.
చట్ట విరుద్దం
ఇది చట్ట విరుద్ధం అని సీపీఐ నారాయణ అన్నారు. ప్రజాప్రాతినిధ్య చట్టం 1951లోని సెక్షన్ 29ఏ ప్రకారం తీర్మానం చెల్లదని చెప్పారు. కేంద్ర ఎన్నికల సంఘం గుర్తింపు ఉన్న ఏ రాజకీయ పార్టీలో అయినా అంతర్గత ప్రజాస్వామ్యం చాలా అవసరం అని అభిప్రాయపడ్డారు. ఓటింగ్ ప్రక్రియ ద్వారా మాత్రమే అధ్యక్షుడిని కానీ, కార్యవర్గాన్ని కానీ ఎన్నుకోవాలని గుర్తుచేశారు. నిబంధనలు కూడా అదే చెబుతున్నాయని తెలిపారు. రెండు, మూడేళ్లకు ఒకసారి ఎన్నికలు నిర్వహించాలని సూచించారు. దీనిపై ఎన్నికల సంఘం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలని చెప్పారు. గతంలో కాంగ్రెస్ పార్టీ నిబంధనలను మార్చిన సమయంలో ఈసీ నోటీసులు ఇచ్చిందని తెలిపారు.
మరీ కరుణానిధి ఎలా..?
వైసీపీ నేత విజయసాయిరెడ్డి కౌంటర్ అటాక్ చేశారు. గతంలో డీఎంకే శాశ్వత అధ్యక్షుడిగా కరుణానిధి ఎన్నికయ్యారని గుర్తుచేశారు. అప్పుడు ఇదే మీడియా ఉదయించే సూర్యుడు అని ఆకాశానికెత్తిందని తెలిపారు. విలువలు పాతాళానికి పడిపోయిన సమయంలో పచ్చ మీడియాకు, ఇప్పుడు ఇది తప్పుగా కనిపిస్తోందని విమర్శించారు. విషపు రాతలు అంతే దిగజారాయని పేర్కొన్నారు. తన ట్వీట్కు ఆ పత్రికా కథనాన్ని జోడించారు.
ఒక్కొక్కరికి ఒకలా..?
గతంలో కరుణానిధిని పార్టీ శాశ్వత అధ్యక్షుడిగా డీఎంకే తీర్మానం చేసింది. అయితే దీనిని ఈసీ ఆమోదించింది. ఇదే విషయాన్ని వైసీపీ నేతలు చెబుతున్నారు. విజయసాయి రెడ్డి ఆ విషయాన్ని ప్రస్తావించారు. అప్పుడు లేని అభ్యంతరం ఇప్పుడు ఎందుకు అని అడిగారు. ఓ వ్యక్తి ఒకలా.. మరో వ్యక్తికి ఒకలా నియమ, నిబంధనలు ఉంటాయా అని అడిగారు.