ఆనందయ్య నాటుమందు: క్షీణిస్తోన్న కోటయ్య ఆరోగ్యం, ఆస్పత్రిలో చేరిక.. ఉత్కంఠ
ఆనందయ్య నాటుమందుపై ప్రతీ ఇంట్లో చర్చించుకుంటున్నారు. అతని తయారుచేసిన మందు కరోనాకు పనిచేస్తుండటమే కారణం. అయితే మెడికల్ మాఫియా.. కార్పొరేట్ దుష్టశక్తులు రంగంలోకి దిగాయో తెలియదు కానీ.. అతని మందుపై అధ్యయనం.. ఐసీఎంఆర్ పరీక్షలు చేస్తోంది. వాస్తవానికి కృష్ణపట్నం వద్ద ఇసుకేస్తే రాలనంత జనం ఉన్నారు. ఆనందయ్య కరోనా మందుకు క్రేజీ తీసుకొచ్చింది రిటైర్డ్ హెడ్ మాస్టర్ కోటయ్యే.. తనకు మందు బాగా పనిచేసిందని తెలియజేశారు. అయితే అతని ఆరోగ్యం క్షీణించడంతో ఆనందయ్య మందుపై కాస్త సందేహాలు వస్తున్నాయి.
క్షీణించిన కోటయ్య ఆరోగ్యం
నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో ఆనందయ్య ఇచ్చే కరోనా మందు తీసుకున్న హెడ్ మాస్టర్ కోటయ్య ఆరోగ్యం మరోసారి క్షీణించింది. ఆనందయ్య మందుతో కోటయ్య ఆక్సిజన్ లెవల్స్ పెరిగాయని నిన్నటివరకు ప్రచారం జరిగింది. ఇవాళ కోటయ్య ఆక్సిజన్ లెవల్స్ పడిపోవడంతో కుటుంబసభ్యులు ఆయనను ఆసుపత్రికి తరలించారు. దీంతో ఆనందయ్య మందుపై సందేహాలు అలముకున్నాయి.
అధ్యయనం కొనసాగింపు
ఆనందయ్య పంపిణీ చేస్తున్న కరోనా ఔషధంపై ఆయుష్ శాఖ నిపుణుల అధ్యయనం కొనసాగుతోంది. ఆయుష్ కమిషనర్ రాములు కృష్ణపట్నంలో పర్యటించి మందు తయారీలో వాడుతున్న పదార్థాలను పరిశీలించారు. ఆనందయ్య వినియోగిస్తున్న పదార్థాలు శాస్త్రీయంగానే ఉన్నాయని రాములు అభిప్రాయపడ్డారు. ల్యాబ్ నుంచి కూడా పాజిటివ్ రిపోర్ట్ వచ్చిందని తెలిపారు.
టెన్షన్.. టెన్షన్...
పోలీసులు ఆనందయ్య కరోనా ఔషధం పంపిణీ చేస్తున్న కేంద్రాన్ని ఖాళీ చేయించారు. పంపిణీ సామగ్రిని తమ అధీనంలోకి తీసుకున్నారు. మందు పంపిణీ నిలిపివేయాలని నెల్లూరు జిల్లా కలెక్టర్ ఇప్పటికే ఆదేశాలు జారీ చేయడం తెలిసిందే. అయితే కోటయ్య ఆరోగ్యం క్షీణించండంతో కాస్త ఉత్కంఠ పరిస్థితి ఏర్పడింది. ఏం జరుగుతుందోననే సందేహాలు వస్తున్నాయి.
శాంపిల్స్ సేకరణ
రాష్ట్రంలో కరోనా కేసులు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. ఆస్పత్రుల్లో చికిత్స కూడా కష్టతరంగా మారింది. ఆక్సిజన్ అందక చాలామంది ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. నెల్లూరు జిల్లాలో ఇస్తున్న 'కృష్ణపట్నం ఆయుర్వేద మందు' కరోనాకు బాగా పనిచేస్తోందనే ప్రచారం జరిగింది. దీంతో వేల సంఖ్యలో జనం ఇక్కడకు తరలివస్తున్నారు. శాస్త్రీయంగా రుజువు కాలేదని రాష్ట్ర ప్రభుత్వం పంపిణీని నిలుపుదల చేసింది. పరీక్షల నిమిత్తం ఆయుష్ ల్యాబ్కు పంపింది. దీనిపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. ఈ క్రమంలో కోటయ్య ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో ఉత్కంఠ నెలకొంది.
Recommended Video