బాలయ్య చెప్పింది..చేశారుః బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రికి శంకుస్థాపన
అమరావతిః ప్రముఖ నటుడు, తెలుగుదేశం పార్టీ శాసన సభ్యుడు నందమూరి బాలకృష్ణ ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారు. రాజధాని అమరావతి ప్రాంతంలో బసవ తారకం ఇండో అమెరికన్ కేన్సర్ ఆసుపత్రిని నిర్మిస్తామని ఇదివరకే హామీ ఇచ్చిన ఆయన.. దాన్ని చేతల్లో చేసి చూపారు. బసవ తారకం ఇండో అమెరికన్ కేన్సర్ ఆసుపత్రి నిర్మాణానికి గురువారం శంకుస్థాపన చేశారు. రాజధాని ప్రాంతంలోని తుళ్లూరు సమీపంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్, బాలకృష్ణ సతీమణి వసుంధర పాల్గొన్నారు.
వైద్య శాఖకు చెందిన పలువురు ఉన్నతాధికారులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. శంకుస్థాపన సందర్భంగా యాగాన్ని నిర్వహించారు. రెండేళ్లలో ఈ ఆసుపత్రి నిర్మాణాన్ని పూర్తి చేస్తామని బాలకృష్ణ వెల్లడించారు. క్యాన్సర్ వ్యాధిగ్రస్తులకు నామమాత్రపు ఛార్జీలతో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో వైద్యాన్ని అందిస్తామని అన్నారు. తన తల్లి పేరు మీద ఉన్న ఈ ఆసుపత్రి నిర్మాణానికి అవసరమైన సహాయ, సహకారాలను అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని అన్నారు. అనంతరం మంత్రి లోకేష్ బాబు మాట్లాడుతూ, కేన్సర్ చికిత్స కోసం వ్యాధిగ్రస్తులు ఇక హైదరాబాద్ వరకు వెళ్లాల్సిన అవసరం ఉండదని అన్నారు.
ఈ ఆసుపత్రి నిర్మాణాన్ని పూర్తి చేస్తామని చెప్పారు. హైదరాబాద్ లో ఉన్న ఆసుపత్రి కంటే అత్యాధునిక సౌకర్యాలను ఈ ఆసుపత్రిలో కల్పిస్తామని అన్నారు. ఆసుపత్రి నిర్మాణానికి ప్రభుత్వం 15 ఎకరాల భూమిని కేటాయించింది. దీనికి సంబంధించిన జీవో ఇటీవలే జారీ అయింది. అధికారికంగా భూమి కేటాయింపు ప్రక్రియ పూర్తి కావడంతో ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.
కిందటి నెల 26వ తేదీ నాడే వెల్లడించిన బాలకృష్ణ
రాజధాని ప్రాంతంలో వచ్చే నెలలో బసవతారకం ఆసుపత్రికి శంకుస్థాపన చేస్తామని బాలకృష్ణ కిందటి నెల 26వ తేదీన ప్రకటించారు. హైదరాబాద్ లోని బసవ తారకం కేన్సర్ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఆయన ఈ విషయాన్ని ప్రస్తావించారు. అమరావతిలో ఆసుపత్రి నిర్మాణానికి అవసరమైన అన్ని అనుమతులను తీసుకుంటున్నామని చెప్పారు. ఈ ప్రక్రియ వేగవంతమైందని అన్నారు. తన తల్లి పేరు మీద ఏర్పాటైన బసవతారకం కేన్సర్ ఆసుపత్రికి బాలకృష్ణ ఛైర్మన్గా వ్యవహరిస్తున్నారు.