రాజధాని తీర్పుపై నాగబాబు హర్షం: రైతుల మొక్కవోని దీక్షకు నిదర్శనం..
అమరావతి రాజధానిపై ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై నేతలు స్పందిస్తున్నారు. ప్రభుత్వం మాత్రం పరిశీలిస్తామని చెబుతోంది. దీనిపై మెగాబ్రదర్ నాగబాబు కూడా రియాక్ట్ అయ్యారు. కోర్టు తీర్పుపై నాగబాబు హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్ర చరిత్రలో హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చిందని అన్నారు. సుమారు 800 రోజులకు పైగా మొక్కవోని దీక్ష చేస్తున్న అమరావతి రైతులు, మహిళలు, అందరి విజయంగా ఆయన అభివర్ణించారు.

అప్పుడు ఒప్పుకొని..
గతంలో అధికార టీడీపీ అమరావతిని రాజధానిగా ప్రతిపాదించగా, వైసీపీ కూడా ఒప్పుకుందని నాగబాబు గుర్తు చేశారు. అమరావతే రాజధాని అవుతుందని నమ్మి రైతులు తమ భూములు ఇచ్చారని చెప్పారు. అధికారంలోకి వచ్చాక అమరావతి రాజధానిని నిర్వీర్యం చేయాలని వైసీపీ ప్రయత్నించిందని నాగబాబు ఆరోపించారు. ప్రభుత్వం మూడు రాజధానుల ప్రతిపాదన తెరపైకి తెచ్చిందన్నారు.

అనరానీ మాటలు..
అమరావతి ఉద్యమాన్ని వైసీపీ మంత్రులు, నేతలు ఎన్నో మాటలు అన్నారని గుర్తుచేశారు. స్పాన్సర్డ్ ఉద్యమం, స్వార్థపరుల ఉద్యమం అని అన్నారు. ఇన్ని రోజుల పాటు చేసే ఉద్యమాలు కడుపు రగిలితేనే వస్తాయి తప్ప స్పాన్సర్లతో రావు. అమరావతి ఉద్యమానికి మా జనసేన పార్టీ చీఫ్ పవన్ కల్యాణ్, జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్, జనసేన నాయకులు, కార్యకర్తలు ఎంతో మద్దతిచ్చాం అని నాగబాబు అన్నారు.

సంతోషంగా ఉంది
హైకోర్టు తీర్పుతో మేం కూడా చాలా సంతోషిస్తున్నాం అని తెలిపారు. హైకోర్టు తీర్పునే అంతిమ తీర్పు అనుకోవాలని.. ఒకవేళ సుప్రీంకోర్టుకు వెళతారేమో... అక్కడా రాజధాని ప్రాంత రైతులకే అనుకూల తీర్పు రావడం ఖాయం అని నాగబాబు అన్నారు. వైసీపీ ప్రభుత్వం పంతాలకు పోకూడదని నాగబాబు హితవు పలికారు. ఏ ప్రభుత్వం అయినా ప్రజలతో శత్రుత్వం పెట్టుకుంటే నిలబడడం కష్టం అని చెప్పారు. ఎవరితోనైనా పెట్టుకోండి కానీ ప్రజల జోలికి వెళ్లొద్దన్నారు. వైసీపీ ప్రభుత్వం అలాంటి తప్పు చేసిందన్నారు. ఇకనైనా తప్పుదిద్దుకుని, హైకోర్టు తీర్పును గౌరవించి, అమరావతి రైతుల మనోవేదనను తగ్గించేలా ముందుకు వెళ్లాలని సూచించారు.

ప్రజల విజయం..
రాజధాని అనేది అమరావతి పరిసరాల్లో ప్రజలకు మాత్రమే చెందింది కాదని, రాష్ట్రం మొత్తానికి చెందిన రాజధాని అని నాగబాబు స్పష్టం చేశారు. ఇది ప్రజల విజయం అని అన్నారు. దేశంలో న్యాయవ్యవస్థలు ఇంకా పటిష్ఠంగా ఉన్నాయని చెప్పడానికి హైకోర్టు ఇచ్చిన తీర్పే నిదర్శనం అని నాగబాబు అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధానిపై హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. రాజధాని ప్రాంత ప్రాధికార సంస్థ (సీఆర్డీఏ) చట్టం ప్రకారమే రాష్ట్ర ప్రభుత్వం నడుచుకోవాలని ఆదేశించింది. 6 నెలల్లోగా మాస్టర్ ప్లాన్ ను పూర్తి చేయాలని ఆదేశాలిచ్చింది. ఈ మేరకు మూడు రాజధానుల ఏర్పాటు, రాజధాని ప్రాంత ప్రాధికార సంస్థ (సీఆర్డీఏ) రద్దుపై దాఖలైన 75 వ్యాజ్యాలపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం గురువారం తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే.

అసెంబ్లీకి లేదట..?
రాజధానిపై చట్టాలు చేసే అధికారం అసెంబ్లీకి లేదని, అమరావతినే రాజధానిగా అభివృద్ధి చేయాలని, అభివృద్ధి పనులపై ఎప్పటికప్పుడు నివేదిక సమర్పించాలని ఆదేశించింది. మాస్టర్ ప్లాన్ లో ఉన్నది ఉన్నట్టుగా అమలు చేయాలని తేల్చి చెప్పింది. అమరావతి నుంచి ఆఫీసులను తరలించకూడదని స్పష్టం చేసింది. భూములను ప్రభుత్వానికిచ్చిన రైతులు, వాటాదారులకు 3 నెలల్లోగా అన్ని సౌకర్యాలతో అభివృద్ధి చేసిన ప్లాట్లను అప్పగించాలని ప్రభుత్వానికి తేల్చి చెప్పింది.
రాజధాని అవసరాలకు తప్ప ఇతర అవసరాలకు ఆ భూములను తాకట్టు పెట్టరాదని న్యాయస్థానం స్పష్టం చేసింది. అమరావతి రాజధానిపై వ్యాజ్యాలు దాఖలు చేసిన పిటిషనర్లకు ఖర్చుల కింద రూ.50 వేల చొప్పున చెల్లించాల్సిందిగా సర్కారును ఆదేశించింది.












Click it and Unblock the Notifications