వ్యవసాయమంటే తెలుసా? పవన్, జగన్ పై సోమిరెడ్డి విసుర్లు
అమరావతి : విపక్ష నేతలపై భగ్గుమన్నారు మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. జగన్, పవన్ లకు వ్యవసాయం అంటే ఏంటో తెలుసా అంటూ చురకలు అంటించారు. వ్యవసాయం విషయంలో యావత్ దేశం ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తుంటే.. వీరిద్దరేమో తెలంగాణను చూసి నేర్చుకోవాలని చెబుతుండటమేంటని మండిపడ్డారు. అంతేకాదు ఒక అడుగు ముందుకేసి శ్వేతపత్రం విడుదల చేయడం విశేషం.
గత ఐదేళ్లలో వ్యవసాయానికి సంబంధించి తెలంగాణ కంటే ఏపీలోనే అధికంగా 17వేల కోట్లకు పైగా ఖర్చు చేసినట్లు వెల్లడించారు. ఏపీ ప్రభుత్వానికంటే ఏ రాష్ట్రం వ్యవసాయానికి పెద్దపీట వేస్తుందో జగన్, పవన్ లెక్కలు చెప్పగలరా అంటూ ప్రశ్నించారు. సీఎం కుర్చీ తప్ప వారిద్దరికీ మరేమీ కనిపించకపోవడం విడ్డూరంగా ఉందని వ్యాఖ్యానించారు.

వ్యవసాయానికి స్పెల్లింగ్.. సేద్యానికి మీనింగ్ తెలియనోళ్లు తమ ప్రభుత్వంపై ఆరోపణలు చేయడం తగదన్నారు సోమిరెడ్డి. వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని సూచించారు. బీజేపీ నేత జేవీఎల్ 6 నెలల పాటు వ్యవసాయం చేస్తే అన్నదాతల కష్టాలు తెలిసొస్తాయని ఎద్దేవా చేశారు. అసలు వైసీపీ రాజకీయ పార్టీయేనా అనే అనుమానం కలుగుతోందన్నారు. ముఖ్యమంత్రి అయితేనే జగన్ అసెంబ్లీకి వస్తారా.. లేదంటే రారా అని ప్రశ్నించారు. ఈ విషయాన్ని వైసీపీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టాలని డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications