నారా లోకేశ్ పీఏ వేధింపులు..? ఫిర్యాదులు వచ్చాయి: సుచరిత
చట్టం ఎవరికీ చుట్టం కాదని ఏపీ హోం మంత్రి సుచరిత స్పష్టంచేశారు. తప్పు చేసిన వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. నేరం చేసిన వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తామని, ఏ ఒక్కరినీ వదలే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో నేరాలు జరగడం లేదని తాము చెప్పడం లేదని, అయితే నేరస్తుల పట్ల తమ ప్రభుత్వం ఎంత కఠినంగా వ్యవహరిస్తుందో చూడాలని చెప్పారు.
మహిళలు, బాలికలపై చేయి వేస్తే తమ ప్రభుత్వం ఉపేక్షించదని అన్నారు. గుంటూరు బాలిక వ్యభిచారం కేసులో ఇప్పటి వరకు 46 మందిని అరెస్ట్ చేశామని చెప్పారు. విజయవాడ టీడీపీ నేత వినోద్ జైన్పై కఠినంగా వ్యవహరిస్తామని తెలిపారు. ఎవరినీ వదిలిపెట్టబోమని స్పష్టంచేశారు. అలాగే టీడీపీ నేత నారా లోకేశ్ పీఏ మహిళలను వేధిస్తున్నాడనే ఆరోపణలు వచ్చాయని చెప్పారు. ఎలాంటి వారినైనా విచారించే అధికారాన్ని పోలీసులకు ఇచ్చామని తెలిపారు. దిశ యాప్ ప్రతి మహిళ సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఎవరూ తప్పు చేసిన శిక్షకు అర్హులేనని సుచరిత స్పష్టంచేశారు. వినోద్ జైన్ వేధించడంతో 9వ తరగతి విద్యార్థిని సూసైడ్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే నారా లోకేశ్ పీఏ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. అతనిని వదలిపెట్టబోమని సుచరిత స్పష్టంచేశారు.
విజయవాడలో విద్యార్థిని సూసైడ్ కేసు దుమారం రేపుతోంది. వేధింపులకు పాల్పడింది.. టీడీపీ నేత కావడంతో వైసీపీ శ్రేణులు, ఇతర పక్షాలు ముక్త కంఠంతో ఖండిస్తున్నాయి. ఆ విద్యార్థిని రాసిన సూసైడ్ నోట్ కలచివేస్తోంది. మరణం తప్ప గత్యంతరం లేదని ఆత్మహత్యకు పాల్పడిందన్నారు. ఈ విషయంలో టీడీపీ నాయకురాలు అనిత ఎలా స్పందిస్తారని, బాలకృష్ణ, లోకేష్, చంద్రబాబుతో క్షమాపణ చెప్పి బయటకు రావాలని వైసీపీ నేతలు డిమాండ్ చేశారు. టీడీపీకి నాయకుల మీద కంట్రోల్ లేదన్నారు. బాలిక కుటుంబానికి న్యాయం జరిగేలా చూస్తామని వైసీపీ నేతలు అంటున్నారు.