ఏపీలో ఆ సిట్టింగ్ లకు ఈ సారి మొండిచెయ్యే..! సీనియర్ల పట్ల బాబు కఠిన నిర్ణయాలు..!!
హైదరాబాద్ : ఆంద్ర ప్రదేశ్ రాజకీయాలు ఇప్పుడిప్పుడే రసకందాయంలో పడుతున్నాయి. తెలంగాణ ఎన్నికల ఫలితాలను విశ్లేషించుకున్న తెలుగుదేశం పార్టీ ఏపి రాజకీయాలపైన ద్రుష్టి కేంద్రీకరించింది. తెలంగాణ ముందస్తు ఎన్నికలు ఏపి రాష్ట్రానికి కొన్ని సవాళ్లను విసిరిన నేపథ్యంలో ఎన్నికలు ఉత్కంఠగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. అన్ని పార్టీలు సాధారణ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో పరిస్థితులు టెన్షన్ గా మారాయి. ఏ పార్టీకి చెందిన అధినేతలు ఆ పార్టీ గెలుపుకోసం ప్రణాళికలు రచిస్తుంటే అదికార టీడిపి కూడా క్షేత్ర స్థాయిలో సమూల మార్పులు చేసి ఎన్నికలకు పార్టీని సమాయత్తం చేసే ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. అందుకు టీడిపి జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కొన్ని కఠిన నిర్ణయాలకు కూడా వెనకాడడం లేదనే చర్చ జరుగుతోంది.
ఏపీలో ఎన్నికల వేడి..! పార్టీలను సమాయత్తం చేస్తున్న అధినేతలు..!
ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండడంతో ఆంధ్రప్రదేశ్లోని రాజకీయ పార్టీలన్నీ ప్రయత్నాలను ముమ్మరం చేసేశాయి. ఇందుకోసం అధికార తెలుగుదేశం పార్టీ, ప్రతిపక్షాలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ ఇప్పటి నుంచే సన్నద్ధం అవుతున్నాయి. ఎన్నికలను అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ఈ సారి రాజకీయం రసవత్తరంగా సాగుతోంది. వీటిలో ముఖ్యంగా 2014లో వచ్చిన ఫలితాలను 2019లో కూడా రిపీట్ చేయాలని భావిస్తోంది అధికార తెలుగుదేశం పార్టీ. అందుకోసం ఎన్నో వ్యూహాలు సిద్ధం చేస్తోంది ఆ పార్టీ అధిష్ఠానం.
పావులు కదుపుతున్న ప్రతిపక్షాలు..! సంస్థాగత బలోపేతాలపై కసరత్తు..!!
టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పార్టీని కూడా మరింత బలోపేతం చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఆయన ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. అభివృద్ధి పనులు, సంక్షేమ కార్యక్రమాలు క్షేత్ర స్థాయిలో అమలయ్యేలా చేసి ప్రజల్లో మంచి పేరు తెచ్చుకోడానికి ప్రయత్నాలు చేయాలని ఎమ్మెల్యేలకు సూచనలు చేస్తున్నారు. అలాగే వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోయే అభ్యర్థుల విషయంలో తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇప్పుడు దీని గురించే టీడీపీలో తారా స్థాయిలో చర్చ జరుగుతున్నట్టు తెలుస్తోంది.
టీడిపి లో వడపోత..! తేడా అనుకుంటే ఏరివేత..!!
గత ఎన్నికల్లో గెలిచిన టీడీపీ ఎమ్మెల్యేలలో దాదాపు 40 శాతం మందికి టికెట్లు ఇవ్వకూడదని చంద్రబాబు నిర్ణయించుకున్నట్టు ప్రచారం జురుగుతున్న నేపథ్యంలో టీడీపీలో కొత్త చర్చ తెరపైకి వచ్చిందని తెలిసింది. చంద్రబాబు ఇటీవల నిర్వహించిన ఓ రహస్య సర్వేలో కొంత మంది సిట్టంగ్ అభ్యర్థుల పట్ల ఫలితాలు ఏ మాత్రం ఆశాజనకంగా లేనట్టు తేలిందట. అయితే, కొన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల పనితీరుపై అసంతృప్తి శాతం అత్యధికంగా కనిపించినా సీఎం చంద్రబాబుపై సానుకూలత చెక్కు చెదరకపోవడాన్ని గుర్తించారని సమాచారం. ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్నా నియోజక వర్గాల్లో అంటీ ముట్టనట్టు వ్యవహరిస్తున్న కొందరు ఎమ్మెల్యేల తీరుపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తమవుతోంది.
ఈ సారి బాబు కఠిన నిర్ణయాలు..! సిట్టింగులను మార్చే ఆలోచన..!!
అందుకోసమే చాలా మంది సిట్టింగులకు టికెట్ ఇవ్వకూడదని చంద్రబాబు నిర్ణయించుకున్నారని ఆ పార్టీ వర్గాలే చెబుతున్నాయి. దీనిని టీడీపీలోని ఒక వర్గం సమర్ధిస్తుండగా, మరొక వర్గం మాత్రం వ్యతిరేకిస్తున్నట్లు తెలుస్తోంది. బలహీనంగా ఉన్నారని తెలిసీ టికెట్ ఇస్తే దానివల్ల ప్రత్యర్థులకే లాభం జరుగుతుందని ఇంకొందరు సీనియర్లు హెచ్చరిస్తున్నారు. అలాగే సిట్టింగులకు టికెట్లు ఇవ్వకపోతే వారి నుంచి వచ్చే పరిణామాలను ఎదుర్కొనే సమయం ఉండదని, దీనిపై పునరాలోచించాలని కొందరు సలహా ఇస్తున్నట్టు తెలుస్తోంది. చంద్రబాబు వ్యక్తి గతంగా ఎంత స్నేహ పూర్వకంగా ఉంటారో పని విషయంలో అంతే కఠినంగా ఉండే విషయాన్ని అందరూ గుర్తించుకోవాలని కొంత మంది సహచరులను హెచ్చరిస్తున్నట్టు తెలుస్తోంది. మరి చివరి నిమిషంలో ఎవరు టికెట్ దక్కించుకుంటారో, ఎవరు కోల్పోతారో చూడాల్సిందే..!