నేతలకు అలర్ట్!: మరో ఐదు రోజుల్లో వైసీపీ డోర్లు క్లోజ్, వచ్చినా ఆ హామీ ఉండదా, కారణాలివేనా?
అమరావతి: సార్వత్రిక ఎన్నికలకు ముందు అధికార తెలుగుదేశం పార్టీకి పలువురు నేతలు షాకిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లికార్జున రెడ్డి, ఇటీవల చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్, గురువారం అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాస్ వైసీపీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డిని కలిసి ఆ పార్టీలో చేరారు. తాజాగా, శుక్రవారం మరో టీడీపీ కీలక నేత దాసరి జైరమేష్ వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు.
వైసీపీ డోర్లు క్లోజ్
తెలుగుదేశం పార్టీలో టిక్కెట్ రాక లేదా చంద్రబాబుపై అసంతృప్తితో వచ్చే నేతలకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ త్వరలో డోర్లు క్లోజ్ చేయనుందని ప్రచారం సాగుతోంది. ఇలా వరుసగా వలస పక్షుల కోసం వేచి చూస్తూ కూర్చోవద్దని పలువురు సీనియర్ నేతలు అధిష్టానానికి సూచించినట్లుగా తెలుస్తోంది. సార్వత్రిక ఎన్నికలు మరెంతో దూరంలో లేవు. మరో రెండు మూడు నెలల్లో ఎన్నికలు జరగనున్నాయి.
2019 ఎన్నికలు.. పైగా దశమి: జనసేన ఆఫీస్కు పెద్ద ఎత్తున ఆశావహుల క్యూ
అందుకే వైసీపీ వైపు నేతలు
ఈ నేపథ్యంలో టీడీపీ నుంచి వలసల జోరు ఎక్కువ అయినా ఆశ్చర్యం లేదని వైసీపీ నేతలు అంటున్నారు. దానికి పలు కారణాలు ఉన్నాయని అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో జగన్ ముఖ్యమంత్రి అవుతాడనే గట్టి విశ్వాసంతోనే టీడీపీ నేతలు తమ వైపుకు వస్తున్నారని చెబుతున్నారు. అయితే ఎన్నికల ముంగిట వరకు ఇతర పార్టీల నుంచి వచ్చే నేతల కోసం చూస్తూ కూర్చోవద్దని మాత్రం నిర్ణయించారని తెలుస్తోంది. ఇతర పార్టీల నుంచి వచ్చే వారికోసం అంతర్గతంగా ఓ తేదీని ఖరారు చేయాలని, ఆ డెడ్ లైన్ లోపు వస్తే తీసుకోవాలని చెబుతున్నారట.
మరో ఐదు రోజుల్లో తలుపులు వేస్తారు?
వైసీపీలోకి వచ్చే నాయకులకు ఈ నెల 20వ తేదీ డెడ్ లైన్ విధించినట్లుగా ప్రచారం సాగుతోంది. ప్రస్తుతం చర్చలు జరుపుతున్న నేతలకు ఈ డెడ్ లైన్ విధించినట్లుగా తెలుస్తోంది. అంతేకాదు, ఈ డెడ్ లైన్ దాటిన తర్వాత వచ్చే నేతలతో చర్చలు వద్దు, ఆహ్వానం వద్దని కూడా చెబుతున్నారట. ఈ మేరకు దాదాపు నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. జగన్ విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. ఆ లోపు చేరేవారు చేరుతారు. ఆ తర్వాత విదేశాల నుంచి వచ్చాక ఆయన అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ, ప్రచారం, ఎన్నికల వ్యూహాల పైనే దృష్టి సారించనున్నారు. దీంతో మరో ఐదు రోజుల్లో వైసీపీ డోర్లు మూతబడనున్నాయని ప్రచారం సాగుతోంది. కీలక నేతలు వస్తామని చెబితే ఆ డోర్లు తెరుచుకునే అవకాశాలు కొట్టి పారేయలేమని అంటున్నారు. మరో విషయం కూడా ఉంది. ఆ తర్వాత వచ్చే నేతలకు టిక్కెట్ హామీ ఉండకపోవచ్చునని చెబుతున్నారు.