మమతా ర్యాలీకి వాళ్లిద్దరూ రాలేదు సరే...పవన్ సంగతేంటి..?
బీజేపీకి ప్రధాని నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా ఏర్పాటు కానున్న మహాకూటమి పై ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఏర్పాటు చేసిన ఈ మహార్యాలీకి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు పలువురు పార్టీ అధినేతలు, ముఖ్యమంత్రులు హాజరయ్యారు. మరి ఇప్పుడు మమతా ర్యాలీకి హాజరైన నేతలు చివరి వరకు ఉంటారా లేదా మధ్యలోనే మరో కూటమివైపు తిరుగుతారా అనే చర్చ రాజకీయవర్గాల్లో జరుగుతున్నాయి.
ఫెడరల్ ఫ్రంట్ ఒక బూటకపు ఫ్రంట్: చంద్రబాబు
మరికొన్ని నెలల సమయంలోనే దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. బలమైన బీజేపీని ఢీకొట్టేందుకు బీజేపీయేతర పార్టీలు ఒక్క తాటిపైకొచ్చాయి. ఇందులో భాగంగానే మమత బెనర్జీ ఏర్పాటు చేసిన మెగా ర్యాలీకి పలువురు ముఖ్యమంత్రులు, పార్టీ అధినేతలు హాజరయ్యారు. ఈ క్రమంలోనే ఏపీ నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. ఈ సందర్భంగా కేసీఆర్ జగన్ తప్ప అందరూ మెగా ర్యాలీకి హాజరు అవుతున్నారని చంద్రబాబు వ్యాఖ్యానించారు. కేసీఆర్ కూడా కాంగ్రెస్ బీజేపీయేతర ప్రభుత్వాల కోసం ఫెడరల్ ఫ్రంట్ పేరుతో తన ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే. కోల్కతాలో జరిగే మెగా ర్యాలీలో పాల్గొనాల్సిందిగా పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కేసీఆర్కు ఫోన్ చేయగా... తాను చంద్రబాబుతో వేదిక పంచుకోలేనని చెప్పినట్లు సమాచారం.
ర్యాలీకి హాజరుకానీ మాయావతి.. నవీన్ పట్నాయక్
ఇక కేసీఆర్ జగన్లు మోడీ మనుషులని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఫెడరల్ ఫ్రంట్ అనేది మోడీకి అనుకూలంగా వ్యవహరించే ఫ్రంట్ అని చంద్రబాబు విమర్శించారు. అయితే రాజకీయ విశ్లేషకులు మాత్రం చంద్రబాబు వ్యాఖ్యలను మరో కోణంలో చూస్తున్నారు. ఈ మెగా ర్యాలీకి పెద్ద పార్టీలైన సమాజ్ వాదీ పార్టీ, డీఎంకే పార్టీలు తప్ప పెద్ద పార్టీల నేతలు హాజరైనట్లు కనిపించడం లేదని అన్నారు. మాయావతిని తీసుకురావడంలో ఎందుకు విఫలమయ్యారని ప్రశ్నించారు. అంతేకాదు బిజూజనతాదళ్ నేత ఒడిషా సీఎం నవీన్ పట్నాయక్ కూడా విపక్షాల ఐక్యత కూటమి సభకు హాజరుకాలేదని విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు. బీజేపీతో పొత్తు ఉండదని ఇప్పటికే ప్రకటించిన అన్నాడీఎంకే పార్టీ కూడా హాజరు కాలేదని వారు చెప్పారు.
పవన్ కళ్యాణ్ను చంద్రబాబు ఎందుకు విస్మరించారు..?
కోల్కతాలో జరిగే మెగా ర్యాలీకి హాజరుకావాల్సిందిగా మమతా బెనర్జీ వైసీపీ అధ్యక్షుడు ఏపీ ప్రతిపక్షనేత జగన్ను ఆహ్వానించలేదు. అదే సమయంలో ఏపీకి చెందిన జనసేనా అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఈ మెగా ర్యాలీపై మౌనం వహించారు. అంతేకాదు బీజేపీకి వ్యతిరేకంగా ఉండే పార్టీలందరితోనూ చంద్రబాబు చర్చలు జరుపుతున్న క్రమంలో మెగా ర్యాలీకి హాజరుకావాల్సిందిగా పవన్ కళ్యాణ్ను ఎందుకు ఒప్పించలేకపోయారని ప్రశ్నిస్తున్నారు. పవన్ కళ్యాణ్ను చంద్రబాబు అండ్ మమతా టీమ్ ఎందుకు ఆహ్వానించలేదు.. ర్యాలీకి హాజరుకానీ పవన్ను చంద్రబాబు ఉద్దేశపూర్వకంగానే ఎందుకు విస్మరిస్తున్నారనేది ఇప్పుడు హాట్టాపిక్గా మారింది. గతంలో లక్నో వెళ్లిన పవన్ కళ్యాణ్ అక్కడ రాజకీయనేతలను కలిసి వచ్చారు. కానీ ఇప్పుడు జాతీయ పార్టీలకు దూరంగా ఉంటున్న పవన్... చంద్రబాబుకు మద్దతు ఇచ్చేది లేదని తేల్చి చెప్పారు. అయినా చంద్రబాబు పవన్ను మాత్రం ఎక్కడా ప్రశ్నించడం లేదు. ఇప్పుడు ఇదే విషయం ఏపీ పాలిటిక్స్లో వేడి పుట్టిస్తోంది.
కూటమి నిలబడుతుందా... లేదా..?
ఇక కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి మమతా ఆహ్వానం పంపలేదు. అయితే తన ప్రాబల్యం తగ్గకూడదన్న ఆలోచనతో రాహుల్ గాంధీ మెగా ర్యాలీ విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూనే... తమ పార్టీ నుంచి మల్లికార్జున ఖర్గేను కోల్కతాకు పంపారు. అంటే మమతా, రాహుల్ మధ్య విభేదాలు కనిపిస్తున్నాయనేది ఇక్కడ స్పష్టమవుతోందని విశ్లేషకులు భావిస్తున్నారు. విబేధాలు పక్కనబెట్టి కలిసి పనిచేస్తేనే సక్సెస్ అవుతుందని లేదంటే కూటమికి కష్టాలు తప్పవని వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు కొద్ది రోజుల క్రితం ఉత్తర్ ప్రదేశ్లో ఎస్పీ బీఎస్పీలు ఒక్కటయ్యాయి. బీజేపీ కాంగ్రెస్యేతర ప్రభుత్వాల కోసం తాము ఇద్దరం కలిసినట్లు అఖిలేష్ యాదవ్, మాయావతిలు ప్రకటించారు. కోల్కతాలో జరిగే మెగా ర్యాలీకి మాత్రం అఖిలేష్ హాజరయ్యారు. కానీ కాంగ్రెస్ ఉంటే వీరు కూటమికి మద్దతు ఇస్తారా అనే ప్రశ్న మరోవైపు తొలుస్తోంది. ఒకవేళ అఖిలేష్ కూటమికి మద్దతు ఇవ్వడం లేదని బాహాటంగా ప్రకటిస్తే కూటమికి బీటలు పడ్డట్టేనని భావించాల్సి ఉంటుందని పొలిటికల్ అనలిస్టులు విశ్లేషిస్తున్నారు.