సచివాలయానికి పంచాయితీ నోటీసులు .. అధికారుల్లో అలజడి..!
ఏపి పరిపాలనా కేంద్రానికి నోటీసులు. ఆ నోటీసులు ఇస్తోంది ఓ పంచాయితీ. ఇప్పుడు ఇది సచివాలయంలో హాట్ టాపిక్ గా మారింది. ఏపి నూతన రాజధాని పరిధిలో తాత్కాలిక సచివాలయం ఏర్పాటు చేసారు. ఈ సచివాలయం వెలగపూడి గ్రామ పంచాయితీ పరిధిలోకి వస్తుంది. అయితే, ఆ భవనాలకు సంబంధించి ఆస్తి పన్ను చెల్లించలేందంటూ స్థానికంగా ఉన్న గ్రామ పంచాయితీ అధికారులు సాధారణ పరిపాలనా శాఖ కు గుర్తు చేసారు. సచివాలయం విస్తీర్ణం..అందులో భవన నిర్మాణం జరిగిన ప్రాంత వివరాలకు అనుగుణంగా ఆస్తికి ఎంత విలువ ఉంటుందనే దాని పై కసరత్తు ప్రారంభించారు. దీని పై గ్రామ పంచాయితీ అధికారులు సమాచారం కోరగా..జిల్లా పంచాయతీ అధికారుల నుండి లేఖ వస్తే స్పందిస్తామని జిఏడి అధికారులు తేల్చి చెప్పారు.
ఏపిలో అధికార వ్యవస్థ సమర్దవంతంగా పని చేస్తే ఫలితాలు ఎలా ఉంటాయో తెలిసే ఘటన ఇది. ఏపి నూతన రాజధాని పరిధిలో ఏపి ప్రభుత్వం 2016లో వెలగపూడి గ్రామ పంచాయితీ పరిధిలో తాత్కాలిక సచివాలయం నిర్మించింది. అప్పటి నుండి గ్రామ పంచాయితీకి రావాల్సిన ఆస్తి పన్ను వసూలుకు సంబంధించి గ్రామ సచివాలయం మొదలు..పంచాయితీ రాజ్ ఉన్నతాధికారుల వరకు అనేక సార్లు మంతనాలు సాగించారు. చట్టం ప్రకారం గ్రామ పరిధిలో ప్రతీ ఆస్తికి ఇంటి పన్ను వసూలు తప్పనిసరి. ఈ మేరకు పన్ను నోటీసులు జారీ చేయాలని గుంటూరు పంచాయతీ అధికారి ఇటీవల వెలగ పూడి గ్రామ కార్యదర్శికి మౌఖిక ఆదేశాలు జారీ చేసారు.
దీంతో..గ్రామ పంచాయితీ అధికారులు ఇదే విషయం పై ఏపి జీఏడి అధికారులను కలిసి..నోటీసుల విషయం ప్రస్తావించారు. ఆస్తి విలువ ఆధారంగా పన్ను వసూలు చేయాల్సి ఉండ టంతో..సచివాలయ విస్తీర్ణం..భవన నిర్మాణం జరిగిన ప్రాంత వివరాలు ఇవ్వాలని లిఖిత పూర్వకంగా కోరారు. అయితే, ఈ తమకు కావాల్సిన సమాచారం పై జిల్లా పంచాయతీ అధికారుల నుండి లేఖ వస్తే స్పందిస్తామని ఉన్నతాధికారులు తేల్చి చెప్పేసారు.
అయితే, పంచాయితీ రాజ్ చట్టం ప్రకారం.. ప్రస్తుతం వెలగపూడిలో అమల్లో ఉన్న నిబంధనల ప్రకారం ప్రతీ వంద రూపాయాల ఆస్తికి 60 పైసల చొప్పున ఆస్తి పన్ను వసూలు చేస్తున్నారు. ప్రభుత్వ అధికారులు సచివాలయం ఎంత విలువ ఉంటుందో తేల్చి చెబితే..ఆ మేర పన్ను విధించటానికి గ్రామ పంచాయితీ అధికారులు సిద్దంగా ఉన్నారు. ఇక, ఈ వ్యవహారం ఇప్పుడు ప్రభుత్వ వర్గాల్లో అలజడికి కారణమైంది. దీని పై ప్రభుత్వ ఉన్నతాధికారులు అధికారికంగా స్పందించాల్సి ఉంది.