దొనకొండ చుట్టూ అనకొండలా తిరుగుతున్న ఏపి రాజకీయం..! రివ్వుమంటున్న రియల్ ఎస్టేట్ వ్యాపారం..!!
అమవరావతి/హైదరాబాద్ : ఏపి రాజకీయాలు ఇప్పుడు దొనకొండ చుట్టూ అనకొండలా తిరుగుతున్నాయి. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి విదేశాలంలో ఉన్నప్పుడు ఏపి మంత్రి బొత్సా సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారాన్ని రేపుతున్నాయి. ఆయన చేసిన వ్యాఖ్యల వల్ల చెలరేగిన రాజకీయ చిచ్చు రోజురోజుకూ రగులుతూనే ఉంది. ఏపి ఇదే అంశం పై అదికార, ప్రతిపక్ష నేతల మద్య వాడి వేడి ఆరోపణలు, ప్రత్యారోపణలు జరుగుతున్నాయి. ఇదే క్రమంలో సందెట్లో సన్నాయి లాగా అటు దొనకొండలో భూముల ధరలు కొండెక్కి కూర్చున్నాయి. పంట భూములు కలిగి ఉన్న వ్యవసాయ దారులు లేదా భూ స్వాములు అమాంతం ధరలు ఊహకందని రీతిలో పెంచినట్టు తెగ ప్రచారం జరుగుతోంది.
రివ్వుమంటున్న రియల్ ఎస్టేట్..! దొనకొండలో దోమల్లా వాలిపోతున్న రియల్టర్లు..!!
ఏపీలో వైఎస్సార్ పీసి ప్రభుత్వం తాను ముందునుంచి చెప్పుకొస్తున్న మాటలకు కట్టుబడి ఉన్నట్టు తెలుస్తోంది. అంతే కాకుండా తన కలలు నెరవేర్చుకుంటున్నట్టు కూడా చర్చ జరుగుతోంది. 2014లోనే వైసీపి గెలుపు లాంఛనమనుకుని సుమారు 10 వేల ఎకరాలను వైసిపి నేతలు కొన్నట్టు ప్రచారం జరుగుతోంది. అయితే, అప్పుడు సీన్ రివర్స్ కావడంతో వారి డబ్బులన్నీ 5 సంవత్సరాలు బ్లాక్ ఐనట్టుగా కూడా చర్చ జరుగుతోంది. ఇక 2019లో వైసీపికి అధికారం వచ్చింది. ఇప్పటికే ఆలస్యం ఐనట్టు, దొనకొండను తెరమీదకు తెస్తోంది వైసీపీ ప్రభుత్వం.
రాజధాని కాకపోయినా పారిశ్రామిక ప్రాంతం..! ఏదైనా ఓకే అంటున్న దొనకొండ వాసులు..!!
తమ పార్టీ వారికి జరిగిన నష్టాన్ని భారీ స్థాయిలో పూడ్చుకోవడానికి ప్రయత్నం చేస్తోందనే చర్చ కూడా వినిపిస్తోంది. ఏదో కొన్ని కారణాలను చూపి దొనకొండను రాజధాని లేదా కనీసం రెండో రాజధానిగా చేయడానికి విశ్వప్రయత్నాలు చేస్తోంది ఏపీ ప్రభుత్వం. ఈ మేరకు రాజధాని మార్పుకు సంకేతాలు ఇచ్చారు ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ. అయితే, గెజిట్ ప్రకారం రాజధాని మార్పు అన్నది అంత సులువైన పని కాదు. అందుకే గుజరాత్ రాజధాని గాంధీనగర్ లో జరిగినట్టే, అమరావతిని అలా ఉంచి, అభివృద్ధిని మొత్తం దొనకొండకు తరలించే ప్రయత్నం జరుగుతోందనే చర్చజరుగుతోంది.
రాజధాని మార్పుపై స్పష్టత ఇవ్వని వైసీపి..! కొనసాగుతున్న ఉత్కంఠ..!!
రాజధాని మార్పు, అమరావతిపై అసంతృప్తి నేపథ్యంలో, ఇప్పటికే ప్రచారంలో ఉన్న దొనకండలో రియల్ ఎస్టేట్ పరుగులు తీస్తోంది. వేలాది మంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు అక్కడ వాలిపోయారు. దీనికి సోషల్ మీడియా ప్రచారం కూడా తోడవడంతో ఒక్కసారిగా ప్రకాశం జిల్లాలోని దొనకొండ ప్రాంతం పట్ల వాడి వేడి చర్చ జరుగుతోంది. ఇప్పటికే వైసీపీలో కొందరు ప్రభుత్వ అంతర్గత సమాచారం తెలిసిన నేతలు తాజా కొనుగోళ్లు కూడా జరిపారని సమాచారం. ఈ నేపథ్యంలో ముందే దొనకొండ చుట్టుపక్కల ప్రాంతాల్లో భూముల ధరలు కొండెక్కి కూర్చున్నాయి. 100 గజాల సైటు నుంచి వంద ఎకరాల బిట్టు వరకు అన్నిటికీ పట్టరాని డిమాండ్ ఏర్పడినట్టు తెలుస్తోంది.
భూముల ధరలు పెంచుతున్న దొనకొండ రైతులు..! భవిష్యత్తు బంగారుమయమంటున్న ఆసాములు..!!
అమరావతిలో ల్యాండ్ కొనలేకపోయామన్న బాధలో ఉన్న వారు కూడా హమ్మయ్య మరో ఛాన్సు వచ్చిందన్నట్టు పరుగెడుతున్నారు. ప్రస్తుతం దొనకొండలో ఎకరం భూమి 15 లక్షల రూపాయల నుంచి 20 లక్షల రూపాయల వరకు పలుకుతోంది. అయితే నిన్నటి రేటు ఈరోజు లేదు. ఈరోజు రేటు రేపు ఉండదు. ఇక ప్రభుత్వ ప్రకటన వచ్చేలోపు ఎకరా 50 లక్షలు పలికినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. పైగా దొనకండ కాకుండా వేరే ఆప్షన్ కూడా ఏం లేకపోవడంతో కచ్చితంగా అది ఒక వెలుగు వెలుగుతుందన్నది మాత్రం ఖాయంగా కనిపిస్తోంది. అంటే, ఏపీ పారిశ్రామిక రాజధానిగా మారినా చాలు, భూములు కోట్లలోకి చేరుకుంటాయి. ఇక స్థానికులు, భూస్వాములు మాత్రం నిద్రలో కూడా బంగారు కలలు కంటున్నట్టు చర్చ జరుగుతోంది.