అమరావతి మహిళా రైతులకు అవమానం
అమరావతినే రాజధానిగా కొనసాగించాలని కోరుతూ దాదాపు వెయ్యిరోజుల నుంచి దీక్షలు చేస్తున్న రైతులు వచ్చే నెల నుంచి 60 రోజులపాటు అసెంబ్లీ టు అరసవెల్లి పేరుతో మహాపాదయాత్ర నిర్వహించబోతున్నారు. ఈ యాత్ర విజయవంతమవ్వాలని కోరుతూ రాజధాని పరిధిలోని సీడ్ యాక్సెస్ రోడ్లపై పాదయాత్ర నిర్వహించారు.
అనంతవరం కొండపై వేంచేసియున్న శ్రీ వెంకటేశ్వరస్వామివారిని ముందుగా రైతులు దర్శించుకున్నారు. అనంతరం వెంకటపాలెంలోని తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆధ్వర్యంలో నిర్మిస్తున్న శ్రీ వెంకటేశ్వరస్వామివారి దేవాలయానికి చేరుకొని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
పూజలు నిర్వహించే సమయంలో తిరుమల తిరుపతి దేవస్థానంకు చెందిన భద్రతా సిబ్బంది ఒకరు అత్యుత్సాహం చూపించారు. మెడలోని ఆకుపచ్చ కండువాలను తీసేయాలంటూ ఒత్తిడి చేశారు. భద్రతా సిబ్బంది ఒకరు వచ్చి స్వయంగా మహిళా రైతు మెడలోని కండువాను తొలగించారు. దీనిపై రైతులు ప్రశ్నించగా ఆకుపచ్చ కండువా ఉండకూడదంటూ సదరు వ్యక్తి సమాధానమిచ్చారు.
టీటీడీ భద్రతా సిబ్బంది చేతిలో అవమానానికి గురైన రైతు విషయం రాజధాని ప్రాంతంలో వ్యాపించడంతో పలు గ్రామాల నుంచి రైతులు వెంకటపాలెంలోని స్వామివారి దేవాలయానికి చేరుకున్నారు. దీనిపై తిరుమల తిరుపతి దేవస్థానం ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని రైతులు వెల్లడించారు.