సంక్రాంతి స్పెషల్ సర్వీస్: తెలుగు రాష్ట్రాల మధ్య ప్రత్యేక రైళ్లు.. 22వ తేదీ వరకు
సంక్రాంతి.. తెలుగువారి మరో పెద్ద పండుగ. ఇక ఏపీలో అయితే పండగ హడావిడి మాములుగా ఉండదు. కొత్త అల్లుళ్లు, కోడిపందాలు.. ఇంటి బయట గొబ్బెమ్మలతో పండగకళ వస్తోంది. దీంతో సుదూర ప్రాంతాల్లో ఉన్నవారు కూడా స్వస్థలాలకు వస్తారు. కానీ ఈ సారి ఒమిక్రాన్ వేరియంట్ దడ పుట్టిస్తోంది. అయినప్పటికీ లెక్క చేయకుండా వచ్చేస్తున్నారు. ప్రయాణికుల కోసం ఆర్టీసీ స్పెషల్ బస్సులు నడుపుతుండగా.. రైల్వే కూడా స్పెషల్ ట్రైన్స్ నడుపుతుంది.
పండుగ వేళ తెలుగు రాష్ట్రాల్లో రద్దీని అర్థం చేసుకుని ప్రయాణానికి ఇబ్బంది లేకుండా ఉండేందుకు ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకుని వచ్చామని దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. మొత్తం 10 ప్రత్యేక రైళ్లు.. జనవరి 7వ తేదీ నుంచి 22వ తేదీల మధ్య నడవనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. జనవరి 7, 14వ తేదీల్లో కాచిగూడ-విశాఖపట్నం, 8, 16న విశాఖపట్నం-కాచిగూడ, 11వ తేదీన కాచిగూడ-నర్సాపూర్, 12న నర్సాపూర్- కాచిగూడ, 19, 21న కాకినాడ టౌన్- లింగంపల్లి, 20, 22న లింగంపల్లి - కాకినాడ టౌన్ మధ్య స్పెషల్ ట్రైన్లు నడవబోదున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ట్విట్టర్ ద్వారా వెల్లడించింది.
కాచిగూడ -విశాఖ స్పెషల్ ట్రైన్ మల్కాజ్గిరి, చర్లపల్లి, కాజీపేట్, వరంగల్, ఖమ్మం, రాయనపాడు, ఏలూరు, తాడేపల్లిగూడెం, రాజమహేంద్రవరం, సామర్లకోట, దువ్వాడ స్టేషన్లలో ఆగుతుంది. కాచిగూడ- నర్సాపూర్ ట్రైన్ మల్కాజ్గిరి, నల్గొండ, మిర్యాలగూడ, పిడుగురాళ్ల, గుంటూరు, విజయవాడ, గుడివాడ, కైకలూరు, ఆకివీడు, భీమవరం టౌన్, భీమవరం జంక్షన్, పాలకొల్లు స్టేషన్లలో ఆగనుంది.
కాకినాడ టౌన్- లింగంపల్లి రైలు సామర్లకోట, రాజమంత్రి, నిడదవోలు, తణుకు, భీమవరం టౌన్, ఆకివీడు, కైకలూరు, గుడివాడ, విజయవాడ, గుంటూరు, మిర్యాలగూడ, నల్గొండ, సికింద్రాబాద్ స్టేషన్లలో ఆగుతుందని రైల్వే అధికారులు తెలిపారు. రద్దీ ఎక్కువగా ఉండే గోదావరి జిల్లాలకు ప్రత్యేకంగా 14 రైళ్లు నడవనున్నట్లు ప్రకటించింది దక్షిణ మధ్య రైల్వే. కాకినాడ టౌన్-లింగంపల్లి మధ్య ఈ ప్రత్యేక రైళ్లు తిరుగుతాయి. పండగ పూర్తయిన తర్వాత కూడా తిరిగి వర్క్ ప్లేస్ చేరుకునేందుకు రైళ్లను నడుపుతుంది.