టెన్త్ పేపర్ లీక్ కాలే.. అదీ ఎల్లో మీడియా సృష్టి: మంత్రి బొత్స సత్యనారాయణ
టెన్త్ పేపర్ లీకేజీ దుమారం ఏపీలో కొనసాగుతోంది. పేపర్ లీక్ అని కొన్ని వార్త సంస్థలు న్యూస్ ప్రసారం చేశాయి. అయితే అదీ మాల్ ప్రాక్టీస్ అని కొందరు అంటున్నారు. దీనిపై రకరకాల ఊహాగానాలు వస్తున్నాయి. అయితే మంత్రి బొత్స సత్యనారాయణ దీనికి సంబంధించి వివరణ ఇచ్చారు. పేపర్ లీక్ కాలేదని కుండబద్దలు కొట్టారు.
తాజాగా హిందీ ప్రశ్నాపత్రం కూడా లీకైందని వార్తలు వచ్చాయి. పదో తరగతి ప్రశ్నాపత్రాలు లీక్ అయ్యాయన్న వార్తల్లో నిజంలేదని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. ఇదంతా ఎల్లో మీడియా సృష్టి అని ఆయన ఆరోపించారు. విద్యార్థులు ఎల్లో మీడియా వార్తలను పట్టించుకోవద్దని కోరారు. పరీక్షలు జరుగుతున్న తరుణంలో విద్యార్థులను మనోవేదనకు గురిచేయడం తగదని హితవు పలికారు.
రాష్ట్రంలో నిన్నటి నుంచి పరీక్షలు జరుగుతున్నాయని, నంద్యాలలోని ఓ పాఠశాలలో పరీక్ష పేపరును ఓ క్లర్క్ ఫొటో తీశాడని వెల్లడించారు. పరీక్ష ప్రారంభమైన 15 నిమిషాల తర్వాత ఆ ఫొటో బయటికి వచ్చిందని, అది లీక్ ఎలా అవుతుందని బొత్స ప్రశ్నించారు. ఈ ఘటన జరగ్గానే తాము అప్రమత్తమై తగిన చర్యలు తీసుకున్నట్టు వెల్లడించారు.
ఇవాళ కూడా పేపర్ లీక్ అంటూ ఓ మీడియా చానల్లో వార్తలు వస్తే, వెంటనే ఆరా తీశామని బొత్స తెలిపారు. అయితే పేపర్ లీక్ కాలేదన్న విషయం స్పష్టమైందని అన్నారు. తప్పుడు ప్రచారం చేయడం వల్ల వచ్చే లాభమేంటో ఆయా పత్రికలు, చానళ్లు గ్రహించాలని హితవు పలికారు. ఇకనైనా సత్యాలే వల్లించాలన ఆయన కోరారు.