అన్నం కూడా పెట్టలేదు : ఈడీ పై కోర్టుకు సుజనా ఫిర్యాదు..
రోజంతా తనను విచారించి కనీస్ తనకు ఆహారం కూడా ఇవ్వలేదని రాజ్యసభ సభ్యుడు..టిడిపి నేత సుజనా చౌదరి ఢిల్లీ హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. తనకు ఈడీ సమన్లు ఇవ్వటంతో సుజనా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఇదే కేసుకు సం బంధించి విచారణలో భాగంగా..సుజనా చౌదరి న్యాయమూర్తి కి విచారణ సమయంలో జరిగిన విషయాలను నివేదించారు.
బ్యాంకులకు రుణాల చెల్లింపుకు సంబంధించి అభియోగాలు ఎదుర్కొంటున్న సుజనా చౌదరి కొద్ది రోజుల క్రితం ఈడి విచారణ కు హాజరయ్యారు. ఆ సమయంలో ఉదయం నుండి సాయంత్రం వరకు తనను విచారించారని..ఆ సమయం లో కనీసం తనకు ఆహారం కూడా ఇవ్వలేదని సుజనా చౌదరి ఢిల్లీ హైకోర్టు కు నివేదించారు. విచారణ విరామ సమయంలో భోజనం ఇవ్వటానికి కూడా అధికారులు ముందుకు రాలేదని ఆరోపించారు. ఉదయం పదకొండన్నర గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు తనను అధికారులు విచారించారని, ఇలా వరుసగా రెండు రోజుల పాటు సాగిందని పేర్కొన్నారు. దీనిపై న్యాయమూర్తి స్పందిస్తూ అది నిజమే అయితే మానవహక్కుల ఉల్లంఘనే అవుతుందని వ్యాఖ్యానించారు. దీని పై వాదనలు కొనసాగాయి.

ఇదే సమయంలో..సుజనా చౌదరి ఆరోపణలను ఈడీ తరపు న్యాయవాది తోసి పుచ్చారు. ఈడీ సిబ్బంది చౌదరికి ఆహారం అందచేయబోతే ఆయనే తిరస్కరించారని..అరటిపండు మాత్రం స్వీకరించారని కోర్టుకు వివరించారు. కానీ, చౌదరి తరపు న్యాయవాది తాము చేసిన ఆరోపణలకు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేసారు. వీటి పై కోర్టుకు అఫిడవిట్ సైతం దాఖలు చేస్తామని వెల్లడించారు. ఇందుకు అంగీకరించిన న్యాయమూర్తి సుజనా చౌదరి దాఖలు చేసే అఫిడవిట్ కు స్పందించాలని ఈడీ తరపు న్యాయవాదికి సూచించారు. విచారణను కోర్టు వాయిదా వేసింది.












Click it and Unblock the Notifications