Amaravati: అమరావతి నిర్మాణంపై పార్లమెంట్ లో గొంతెత్తనున్న టీడీపీ: నోటీసు ఇచ్చిన కనకమేడల!
అమరావతి: రాజధాని అమరావతి నిర్మాణంలో తీవ్ర జాప్యం నెలకొన్న విషయాన్ని తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ సభ్యులు కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లబోతున్నారు. ఈ అంశంపై పార్లమెంట్ ఉభయ సభల్లో ప్రస్తావించనున్నారు. ఈ మేరకు తెలుగుదేశం రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్ర కుమార్ జీరో అవర్ నోటీసును ఛైర్మన్ ఎం వెంకయ్య నాయుడికి అందజేశారు. జీరో అవర్ లో ఆయన ఈ విషయాన్ని ప్రస్తావించనున్నారు. అదే సమయంలో లోక్ సభలో గల్లా జయదేవ్ ఈ అంశాన్ని లేవనెత్తనున్నారు.

నిర్మాణ పనులను నిలిపివేసిన జగన్ సర్కార్..
రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత రాజధాని అమరావతి నిర్మాణ పనులు దాదాపు స్తంభించిపోయాయి. ఇదివరకు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో కాంట్రాక్ట్ వ్యవస్థలో చోటు చేసుకున్న అవినీతిని నిర్మూలించడంలో భాగంగా దాదాపు అన్ని రకాల ప్రభుత్వపరమైన నిర్మాణ పనులను నిలిపి వేసింది జగన్ సర్కార్. దీని ప్రభావం రాజధాని అమరావతి నిర్మాణం సహా పలు ప్రాజెక్టులు, రోడ్ల నిర్మాణం, ఇతర మౌలిక సదుపాయాల రంగంపైనా తీవ్రంగా పడింది.

టార్గెట్ వైఎస్ఆర్సీపీ..
ప్రత్యేకించి- కాాంట్రాక్ట్ పనులను నిలిపివేయడం వల్ల రాజధాని అమరావతి నిర్మాణంలో జాప్యం చోటు చేసుకుంది. మొన్నటి సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన తరువాత ఎలాంటి వాతవరణం రాజధాని ప్రాంత అభివృద్ధి మండలి (సీఆర్డీఏ) పరిధిలో ఏర్పడిందో.. అలాంటి పరిస్థితే ఇప్పుడూ కొనసాగుతోంది. ఇదే విషయాన్ని పార్లమెంట్ లో ప్రస్తావించనున్నారు తెలుగుదేశం పార్టీ సభ్యులు. అధికార వైఎస్ఆర్సీపీని టార్గెట్ గా చేసుకుని వారు ఈ అంశాన్ని పార్లమెంట్ ద్వారా కేంద్రం దృష్టికి తీసుకెళ్లనున్నారు.

జీరో అవర్ లో ప్రస్తావించనున్న కనకమేడల
రాజధాని అమరావతి నిర్మాణంలో జాప్యం చోటు చేసకుందనే అంశాన్ని టీడీపీ రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్ర కుమార్ జీరో అవర్ లో ప్రస్తావించనున్నారు. దీనికోసం ఆయన రాజ్యసభ ఛైర్మన్ ఎం వెంకయ్య నాయుడికి నోటీసులను అందజేశారు. ఈ నోటీసులను రాజ్యసభ కార్యకలాపాల జాబితాలో లిస్టింగ్ చేసినట్లు తెలుస్తోంది. గురువారమే ఈ విషయం ప్రస్తావనకు రానున్నట్లు సమాచారం. రాజధాని నిర్మాణ అంశాన్ని అడ్డుగా పెట్టుకుని అన్ని అంశాలనూ రాజ్యసభ జీరో అవర్ లో ప్రస్తావించనున్నారు కనకమేడల. దీనికోసం ఆయన సమాయాత్తమయ్యారు.
Recommended Video

వైఎస్ఆర్సీపీ విధానాలపై ఘాటుగా..
అధికారంలోకి వచ్చిన ఈ అయిదు నెలల కాలంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం తీసకున్న నిర్ణయాలు, అమరావతి నిర్మాణాన్ని పెడచెవిన పెట్టడం, రాజధానిని వేరే ప్రాంతానికి తరలిస్తామంటూ ఇదివరకు మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలు, ఇసుక కొరత, భవన నిర్మాణ కార్మికుల ఆత్మహత్యల విషయాన్ని సైతం జీరో అవర్ లో ప్రస్తావనకు తీసుకుని రానున్నారు. ఇసుక కొరత కోసం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు చేపట్టిన దీక్షను కూడా ఆయన తన ప్రసంగంలో స్పృశించే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు.












Click it and Unblock the Notifications