అది టిడిపి పనేనా : చంద్రబాబుకు మద్దతుగా : నేను మాత్రం నీవైపే!
ఏపిలో ఎన్నికల వాతావరణం అప్పుడే కనిపిస్తోంది. రాజకీయ పార్టీలు ప్రజలను ఆకట్టుకోవటానికి కొత్త నినాదాలతో వారి ముందుకు వెళ్తున్నారు. ప్రచారం ప్రారంభం కాకుండానే.. ఏపిలో అనేక ప్రాంతాల్లో వైసిపి..టిడిపి కు మద్దతుగా అనేక ఫ్లెక్సీలు కనిపిస్తున్నాయి. వైసిపి నేరుగా జగన్ బొమ్మతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తుంటే..టిడిపి ఈ విషయంలో కొంత వినూత్నంగా ముందుకు వెళ్తోంది.
ఫ్లెక్సీ తో ఆకర్షించే ప్రయత్నం..
ఏపిలో రాజకీయ పార్టీలకు మద్దతుగా ప్రచార హోర్డింగ్లు..ఫ్లెక్సీలు దర్శనమిస్తున్నాయి. తాజాగా, విజయవాడ లోని ఇందిరాగాంధీ కాంప్లెక్స్ సమీపంలో ఏర్పాటైన ఓ ఫ్లెక్సీ ఇప్పుడు అందరి దృష్టి ఆకర్షిస్తోంది. భావిశెట్టి భాను అనే వ్యక్తి ఈ ఫ్లెక్సీ ఏర్పాటు చేసారు.
అందులో ముఖ్యమంత్రి పదేపదే చెప్పే అంశాలనే ప్రస్తావిస్తూ..నా రాష్ట్రానికి నువ్వు కావాలి అంటూ ఆ ఫ్లెక్సీలో రాసుకొచ్చారు. ఇక..మొత్తంగా ఆ ఫ్లెక్సీని చూస్తే.. కేంద్రం నీపై కక్ష గట్టింది. పక్కరాష్ట్ర నాయకు లతోపాటు స్వరాష్ట్ర ప్రతిపక్ష నాయకులూ ఒక్కటయ్యారు. అవినీతిపరులకు, నేరగాళ్లకు నువ్వంటే పడదు. ఇప్పుడు నువ్వు ఒంటరివి, కానీ నేను మాత్రం నీవైపే ఉన్నాను. నా పిల్లలకు బంగారు భవిష్యత్తు కావాలి. నేను గర్వంగా తలె త్తుకు తిరగాలి. నా రాష్ట్రానికి నువ్వు కావాలి' అంటూ ఆ ఫ్లెక్సీలో ఆకట్టుకొనే ప్రయత్నం చేసారు. ఇది వ్యక్తగతంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీగా కనిపిస్తున్నా..టిడిపి మద్దతు దారుల ద్వారా పార్టీయే ఇలా ప్రచారం చేయిస్తూ...సాధారణ ప్రజానీకాన్ని ఆకట్టుకొనే ప్రయత్నం చేస్తుందనే వాదన ఇప్పుడు విజయవాడలో వినిపిస్తోంది.
ఇప్పటికే పోటీ పోటీ నినాదాలు..
ముఖ్యమంత్రి చంద్రబాబుకు మద్దతుగా ప్రభుత్వం సంక్షేమ- అభివృద్ది కార్యక్రమాల పై పెద్ద ఎత్తున ప్రచారం చేస్తోంది. ఇదే సమయంలో టిడిపి నేతలు రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో చంద్రబాబు ఫొటో తే ఏపికి నువ్వే కావాలి .. మళ్లీ నువ్వే రావాలి అనే నినాదంలో భారీ ఫ్లెక్సీలను ఏర్పాటు చేసారు. అందులో ప్రధానంగా అమరావతి-గుంటూరు - విజయవాడ ప్రాంతాల్లోనూ..జాతీయ రహదారుల వెంట వీటిని పెద్ద సంఖ్యలో ఏర్పాటు చేసారు. ఇదే సమయంలో పాదయాత్ర చేస్తున్న జగన్ కు మద్దతుగా వైసిపి అభిమానులు జగన్ కావాలి..జగన్ రావాలి అనే నినాదం తో ఫ్లెక్సీలను ఏర్పాటు చేస్తున్నారు. టిడిపి తో పోటీ పడుతూ వైసిపి నేతలు ఈ నినాదంతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు. ఇక, ఇద్దరి లక్ష్యంగా తమ నినాదాలు...హామీలతో సాధారణ..న్యూట్రల్ ప్రజలను తమ వైపు తిప్పుకోవటం కోసం ఇటువంటి ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు.