నేడు మూడో దశ పోలింగ్, ఏర్పాట్ల పూర్తి.. 5 వేల మంది సిబ్బందితో భద్రత
ఏపీలో పంచాయతీ ఎన్నికల మూడో దశ పోలింగ్ ఇవాళ జరగనుంది. ఎన్నికల కోసం సర్వం సిద్ధం చేశారు. అనంతపురం రెవెన్యూ డివిజన్లో 19 మండలాల్లోని 379 సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉండగా.. 23 మంది సర్పంచ్ అభ్యర్థులు నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. 23 స్థానాలు ఏకగ్రీవం కాగా.. మిగిలిన 356 సర్పంచ్ స్థానాలు, 2620 వార్డులకు పోలింగ్ నిర్వహించనున్నారు. ఉదయం 6.30 నుంచి మధ్యాహ్నం 3.30 గంటల వరకూ పోలింగ్ ఉంటుంది. ఇందుకు సంబంధించి అన్ని రకాల ఏర్పాట్లను జిల్లా యంత్రాంగం పూర్తి చేసింది. మొత్తం 3737 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మూడు రకాల సైజుల్లో 5071 బ్యాలెట్ బాక్సులను సిద్ధం చేశారు.
ఏర్పాట్లు పూర్తి
పోలింగ్ సామగ్రిని ఎన్నికల విధులు నిర్వర్తిస్తున్న సిబ్బందికి మంగళవారం అప్పగించారు. ఆ అధికారులు, సిబ్బంది వారికి కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు తరలివెళ్లారు. ఉదయమే పోలింగ్ నిర్వహిస్తున్న నేపథ్యంలో రాత్రికే కేంద్రాలకు ఎన్నికల సిబ్బంది చేరుకున్నారు. ఆ మేరకు ఆయా పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాట్లు పూర్తి చేశారు. 356 సర్పంచ్ స్థానాలకు 919 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. 2620 వార్డులకు 5679 మంది ఎన్నికల బరిలో నిలిచారు. పోలింగ్ ముగిసిన తరువాత గంటకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభంకానుంది. దీంతో ఓటింగ్ శాతాన్నిబట్టి తొలి ఫలితం గంటలోపే వచ్చే అవకాశం ఉంది.
అధికారులు వీరే
116 మంది స్టేజ్-1, 438 మంది స్టేజ్-2 రిటర్నింగ్ అధికారులు, 98 అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులను నియమించారు. 9795 మంది పీఓలు, 2315 మంది సిబ్బందిని ఎన్నికల విధులకు నియమించారు. వీరితోపాటు 52 మంది జోనల్ అధికారులు, 186 మంది రూట్ ఆఫీసర్లు, 428 మంది మైక్రో అబ్జర్వర్లను ఏర్పాటు చేశారు. పోలింగ్ పూర్తయిన తరువాత నిర్వహించే కౌంటింగ్కు ప్రత్యేకంగా అధికారులు, ఉద్యోగులను నియమించారు. 435 మంది సూపర్వైజర్లతోపాటు 12110 మంది కౌంటింగ్ వ్యక్తిగత సిబ్బందిని నియమించారు.
భద్రత ఏర్పాటు
రాజకీయంగా ప్రభావితంగా గుర్తుంపు పొందిన తాడిపత్రి, ఉరవకొండ నియోజకవర్గాలతో పాటు ఫ్యాక్షన్ ప్రభావిత ప్రాంతాలైన యల్లనూరు, పుట్లూరు మండలాల్లో పోలింగ్ నేపథ్యంలో పోలీసులు ఆ మేరకు భద్రతా చర్యలతోపాటు నిఘాను పెంచారు. ఇప్పటికే 282 సమస్యాత్మక, 168 అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించారు. ఆ మేరకు భద్రత విషయంలో ఎక్కడా రాజీలేకుండా పెద్ద ఎత్తున పోలీసు బలగాలను మోహరించారు. పోలింగ్ సందర్భంగా ఎక్కడా అవాంఛనీయ ఘటనలకు తావివ్వకుండా భారీ బలగాలను ఏర్పాటు చేసింది.
5 వేల మంది సిబ్బంది
పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్, 34 పోలీస్ యాక్ట్ అమలు చేయటంతోపాటు 5 వేల మందితో 19 మండలాల్లోని 3737 పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్ట నిఘా ఉంచారు. జిల్లా ఎస్పీ సత్యయేసుబాబు పర్యవేక్షణలో ముగ్గురు ఏఎస్పీలు, 13 మంది డీఎస్పీలు, 44 మంది సీఐలు, 114 మంది ఎస్ఐలు, 541 మంది ఏఎస్ఐలు, హెడ్ కానిస్టేబుళ్లు, 1043 మంది కానిస్టేబుళ్లు, 95 ఏఆర్ఎస్ఐలు, హెడ్ కానిస్టేబుళ్లు, 152 మంది ఏఆర్ కానిస్టేబుళ్లు, 150 మంది స్పెషల్ పార్టీ బృందాలు, 532 మంది హోంగార్డులు, 971 మంది మహిళా పోలీసులు, 09 ప్లటూన్ల ఏపీఎస్పీ బృందాలతోపాటు ఎస్పీఓలు, ఎన్ఎస్ఎస్ వలంటీర్లతో కలిపి సుమారు 5 వేల మంది ఎన్నికల బందోబస్తులో నిమగ్నమయ్యారు. ఓటర్లను ప్రలోభపెట్టే వారిపై చర్యలు తీసుకునేందుకు షాడో బృందాలను నియమించారు. ఓటర్లు స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకునేందుకు అవసరమైన అన్ని చర్యలను జిల్లా పోలీసు యంత్రాంగం చేపట్టింది.