విజయసాయిరెడ్డి క్రియేటివిటి, టిడిపిని అటాక్ చేసేందుకు మరో కొత్త కాన్సెప్ట్
అమరావతి: సార్వత్రిక ఎన్నికలకు ముందు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులు విజయ సాయి రెడ్డి తెలుగుదేశం పార్టీని సోషల్ మీడియా ద్వారా అదే పనిగా టార్గెట్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఇతరుల కంటే భిన్నంగా అతను టీడీపీపై విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రశ్నిస్తున్నారు. ట్విట్టర్ వేదికగా, యూట్యూబ్ ద్వారా అందరిని ఆకర్షించేలా పోస్టులు పెడుతున్నారు.
సెటైరికల్ పోస్టులు
తన ట్విట్టర్ అకౌంట్లో 'సైరాపంచ్' పేరుతో టీడీపీ ప్రభుత్వంపై తనదైన శైలిలో సెటైర్లు వేస్తున్నారు. కార్టూన్లు పోస్ట్ చేస్తున్నారు. చంద్రబాబు చెప్పిన మాటలను తీసుకొని, ఆ తర్వాత ఏం జరిగిందో ఎద్దేవా చేస్తున్నారు. గతంలో ఇచ్చిన హామీలు ఏవీ నెరవేరడం లేదని పిక్చర్స్తో సహా పోస్టులు పెడుతున్నారు. ఉదాహరణకు టీఆర్ఎస్, కాంగ్రెస్ 12 ఏళ్లలో హైదరాబాదు మెట్రో కలను నెరవేర్చలేకపోయిందని, తాము 2018కల్లా చేసి చూపిస్తామని మూడేళ్ల క్రితం లోకేష్ పెట్టిన పోస్టును పెట్టి... ఇప్పుడు విజయవాడలో కనిపిస్తున్న మెట్రో ఇది మాత్రమే అంటూ మెట్రో మార్కెట్, మెట్రో ఎక్స్ప్రెస్ బస్సు ఫోటో పెట్టారు.
బడ్జెట్లో స్టీల్ ప్లాంట్
మూడు నెలల క్రితం కడప స్టీల్ ప్లాంట్కు శంకుస్థాపన చేశారని, దీనికి రూ.18వేల కోట్లు ఖర్చవుతాయని, కానీ ఇటీవల ఏపీ బడ్జెట్లో కేటాయించింది సున్నా అని మరో పోస్టు పెట్టారు.
బాబూ.. నీకిది తెలుసా?
ఆ తర్వాత యూట్యూబ్ ఛానల్ ద్వారా 'బాబూ.. నీకిది తెలుసా..' ఈ రోజు ప్రశ్న అంటూ ప్రశ్నలు సంధిస్తున్నారు. మీలో ఎవరు కోటీశ్వరుడులా ఈ ప్రశ్నలు సంధిస్తున్నారు. హాట్ సీట్లో ఒకరిని కూర్చుండబెడుతున్నారు. హోస్ట్గా థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ వస్తున్నారు. 'చంద్రబాబు మాకన్నా గొప్ప నటుడు ఎవరు, మేక వన్నె పులి అని వ్యాఖ్యానించింది ఎవరు' అని హోస్ట్ పృథ్వీ అడుగుతారు. దానికి మూడు సమాధానాలు ఇస్తారు. దీనికి హాట్ సీట్లో కూర్చున్న వ్యక్తి సమాధానం చెబుతారు. అంతేకాదు, సమాధానం చెప్పాక.. హిందీలో అమితాబ్ బచ్చన్, హాట్ సీట్లో కూర్చున్న వ్యక్తితో, తెలుగులో నాగార్జున-ఎన్డీఆర్లు హాట్ సీట్లో కూర్చున్న వ్యక్తితో చర్చించినట్లుగానే.. ఆ ప్రశ్న, సమాధానం గురించి పూర్తిగా వివరిస్తారు. నారా లోకేష్ బాబును అమెరికాలో భారీగా పెట్టుబడులు పెట్టి చదివారని, ఆ పెట్టుబడులు పెట్టినవారు ఎవరని'ప్రశ్నతో మరోరోజు ముందుకు వచ్చారు. ఆప్షన్లుగా సత్యం రామలింగరాజు, మురళీ మోహన్, సుజనా చౌదరి, సీఎం రమేష్ అంటూ ఇస్తారు. దీనికి హాట్ సీటులో కూర్చున్న వ్యక్తి సత్యం రామలింగరాజు పేరు చెబుతారు. ఆ తర్వాత రామలింగరాజు పెట్టుబడుల గురించి కూడా పూర్తిగా వివరిస్తారు.