బరితెగించిన బాబు, ప్రతిపక్ష నేతపై విజయసాయి విసుర్లు
టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి ధ్వజమెత్తారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చంద్రబాబు బరితెగించారని విమర్శించారు. ఒకప్పుడు తిమ్మిని బమ్మిని చేస్తూ రాష్ట్రాన్ని శాసించిన చంద్రబాబు, ఇవాళ తనొక అనామకుడిలా మారడాన్ని జీర్ణించుకోలేకపోతున్నాడని వ్యాఖ్యానించారు. అందుకే సీఎం జగన్ ను దుర్భాషలాడాడని పేర్కొన్నారు. కానీ జగన్ హుందాగా వ్యవహరించి, తీర్పు చెప్పే అవకాశాన్ని ప్రజలకే వదిలేశారని పేర్కొన్నారు. జనం తీర్పు చూసి బాబుకు మైండ్ బ్లాంక్ అవుతోందని వివరించారు.
దీంతో ప్రజలు పచ్చ పార్టీని 10 మైళ్ల లోతున పాతిపెట్టారని విజయసాయి ఎద్దేవా చేశారు. అటు సీఎం జగన్పై విజయసాయిరెడ్డి ప్రశంసలు కురిపించారు. సేవ చేసేందుకే రాజకీయ పార్టీలు స్థాపిస్తుంటారనే విషయం ప్రస్తావించారు. ప్రజావిశ్వాసం చూరగొని అధికారంలోకి రాగలిగితేనే వారిని ఆదుకునే అవకాశం దొరుకుతుందని అభిప్రాయపడ్డారు. అలా జగన్కు అవకాశం వచ్చిందని.. దానిని ఆయన సద్వినియోగం చేసుకున్నారని తెలిపారు.
చాలా మంది నేతలు గెలిచాక చేద్దాం, చూద్దాం అనుకుంటుంటారని విజయసాయిరెడ్డి తెలిపారు. 20 నెలల్లో రూ.80 వేల కోట్లతో సంక్షేమ పథకాలు అమలు చేయడం కేవలం జగన్కు మాత్రమే సాధ్యమైందని కొనియాడారు. మరే లీడర్ ఇలా పనిచేయలేదని స్పష్టంచేశారు. జగన్ అంటే జనం.. జనం అంటే జగన్ అని తెలిపారు. ప్రజా సంక్షేమం కోసం ఆహోరాత్రులు శ్రమిస్తున్నారని తెలియజేశారు. ఈ విషయం ప్రతీ ఒక్కరికీ తెలుసు అని స్పష్టంచేశారు. బడుగు, బలహీనవర్గాల కోసం పలు పథకాలను ప్రవేశపెట్టారని గుర్తుచేశారు. దీంతో ఆ వర్గాలకు మేలు జరుగుతుందని వివరించారు.