కేఆర్ఎంబీలో జల జగడం...66:34 అంటోన్న ఏపీ.. 50:50కి కావాలంటోన్న తెలంగాణ
తెలుగు రాష్ట్రాల మధ్య నీటి వివాదం సమసిపోవడం లేదు. నీటి వాడకంపై ఎప్పుడూ పేచీ ఉండనే ఉంటుంది. తెలంగాణ, ఏపీ మధ్య నీటి వాటాల పంపిణీపై స్పష్టత కోసం ఉద్దేశించిన కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం ముగిసింది. సమావేశంలో 16 అంశాలపై విస్తృత చర్చ జరిగిందని ఏపీ జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ వెల్లడించారు. ఈ ఏడాది కృష్ణా జలాల పంపిణీలో 66:34 నిష్పత్తి ఉంటుందని స్పష్టం చేశారు.
శ్రీశైలం, సాగర్లో తెలంగాణ అక్రమంగా విద్యుత్ ఉత్పత్తి చేసిందని శశిభూషణ్ కుమార్ ఆరోపించారు. విద్యుత్ ఉత్పత్తితో కృష్ణా జలాలను వృథా చేసిందని తెలిపారు. నిర్వహణ లోపం వల్లే శ్రీశైలంలో 5 టీఎంసీలకు మించి నీరు లేకుండా పోయిందన్నారు. శ్రీశైలం నుంచి తాగునీటికి కూడా సమస్య ఉందన్నారు. విద్యుదుత్పత్తిపై ఆరుగురు సభ్యులతో కమిటీ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. కమిటీ 15 రోజుల్లో ప్రోటోకాల్స్ రూపొందించాల్సి ఉంటుందని వివరించారు.
డ్యామ్ భద్రత పై సమావేశంలో చర్చించామని శశిభూషణ్ కుమార్ వెల్లడించారు. 10 ప్రాజెక్టుల డీపీఆర్లను ఏపీ సమర్పించాల్సి ఉందని వివరణ ఇచ్చారు. 20 రోజుల్లో డీపీఆర్, ప్రాజెక్టుల స్టేటస్ ఇస్తామని చెప్పామన్నారు. ప్రాజెక్టులను బోర్డుకు ఇచ్చే ముందు రూల్ కర్వ్స్ పై చర్చించామన్నారు. నెలలోగా రూల్ కర్వ్స్ ఖరారుకు ఆరుగురు సభ్యులతో కమిటీ ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు.
ప్రతిపాదిత 66:34 నిష్పత్తిలో నీటి పంపిణీకి తాము అంగీకరించబోమని తెలంగాణ నీటి పారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రజత్ కుమార్ ఇదివరకు స్పష్టంచేశారు. 66:34 నిష్పత్తిని ఒక్క సంవత్సరానికే వర్తింప చేసేలా గతేడాది అంగీకరించామని చెప్పారు. ఈసారి 50:50 నిష్పత్తిలో నీటి పంపిణీ చేయాల్సిందేనని రజత్ కుమార్ స్పష్టం చేశారు. దీంతో వివాదం కొనసాగుతోంది. దానికి ఏఫీ అంగీకరించడం లేదు. అందుకే పలు మార్లు భేటీ కావాల్సి వస్తోంది.