అమరావతిపై సీమ టీడీపీ నేతల సవాళ్లు - బాబు కోసమా, జగన్ తో పోరు కోసమా ?
అమరావతి స్ధానంలో వికేంద్రీకరణ పేరుతో మూడు రాజధానులకు వైసీపీ ప్రభుత్వం తెరలేపిన నేపథ్యంలో ఎనిమిది నెలలుగా నోరు మెదపని రాయలసీమ్ టీడీపీ నేతలు ఇప్పుడు ఒక్కొక్కరుగా స్పందిస్తున్నారు. కొందరు కర్నూలుకు హైకోర్టు ఇచ్చి ఉపయోగమేంటి అమరావతిలోనే ఉంచమంటుంటే, మరికొందరు అమరావతిని రాజధానిగా ఉంటే వైసీపీలో చేరేందుకు సిద్ధమంటున్నారు, ఇంకొందరు అమరావతి ఉద్యమానికి సంఘీభావంగా రైతులతో కలిసి పోరాటాలకు దిగుతున్నారు. ఇదంతా చూస్తుంటే వీరి పోరాటం చంద్రబాబు ఒత్తిడితోనా లేక నిజంగానే జగన్ ప్రభుత్వంపై సమరమా అన్న సందేహాలు కలుగుతున్నాయి.

అమరావతి కోసం టీడీపీ...
వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానుల మంత్రం జపించడం మొదలుపెట్టాక అమరావతినే రాజధానిగా ఉంచాలని టీడీపీ అధినేత చంద్రబాబు ఆ పార్టీ నేతలతో రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమానికి పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా కొన్నిప్రాంతాల్లో ఆయన నేరుగా పర్యటించారు. మరికొన్ని ప్రాంతాలకు వెళ్లేందుకు సాహసించలేకపోయారు. అలాంటి వాటిలో ఉత్తరాంధ్ర, రాయలసీమ ఉన్నాయి. విశాఖ ప్రజలు రాజధానికి వ్యతిరేకంగా ఉన్నారని నిరూపించేందుకు ఎయిర్పోర్టుకు వెళ్లిన చంద్రబాబుకు చేదు అనుభవాలు తప్పలేదు. సీమలో అయితే పర్యటనకు కూడా చంద్రబాబు ఇష్టపడలేదు. కానీ ఇప్పటికీ మూడు రాజధానులకు వ్యతిరేకంగా పార్టీలో మద్దతు కూడగట్టేందుకు ఆయన తీవ్ర ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఈ మేరకు నేతలపై ఒత్తిడి పెంచుతున్నట్లు అర్ధమవుతోంది.

గళం విప్పుతున్న సీమ నేతలు...
అమరావతినే రాజధానిగా ఉంచాలని తాము మాట్లాడితే స్ధానికంగా ఎక్కడ వ్యతిరేకత ఎదుర్కొంటామన్న భయంతో ఇన్నాళ్లూ మౌనంగా ఉన్న రాయలసీమ టీడీపీ నేతలు ఇప్పుడు రాజధాని బిల్లులకు గవర్నర్ ఆమోదం పడటంతో ఒక్కొక్కరుగా స్పందిస్తున్నారు. బిల్లులు ఆమోదం పొందకుండా అడ్డంకులు సృష్టిస్తే స్ధానికంగా ఇబ్బందులు తప్పవన్న అంచనాకు వచ్చిన టీడీపీ నేతలు గవర్నర్ నిర్ణయం వరకూ ఎదురు చూశారు. ఆ తర్వాత ఇప్పుడు అమరావతికి అనుకూలంగా వైసీపీ నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నారు. భూమా అఖిలప్రియ వంటి మరికొందరు నేరుగా చెప్పలేక కర్నూల్లో హైకోర్టు వల్ల ఉపయోగం ఏంటంటూ పరోక్షంగా ప్రశ్నిస్తున్నారు. తాజాగా జేీ ప్రభాకర్ రెడ్డి అమరావతినే రాజధానిగా ఉంచితే రాజకీయ సన్యాసం చేస్తానని, లేదా వైసీపీలో చేరుతానంటూ మరో ప్రతిపాదన కూడా
తెరపైకి తెచ్చారు. బీటెక్ రవి వంటి నేతలు నేరుగా అమరావతి ఉద్యమంలోకి దిగిపోయారు.

బాబు కోసమా, జగన్ కోసమా ?
మూడు రాజధానుల ఏర్పాటుపై అభ్యంతరాలు ఉంటే గత డిసెంబర్ నుంచి ఇప్పటివరకూ వాటిని వ్యక్తం చేసే వీలుంది. జగన్ సర్కారును ఇరుకునపెట్టేందుకు రాయలసీమలో పాలనా రాజధాని కావాలని కోరే అవకాశం ఉంది. కానీ అలా చేయకుండా ఇన్నాళ్లూ మౌనంగా ఉండి ఇప్పుడు గవర్నర్ రాజధాని బిల్లులను ఆమోదించాక గళం ఎత్తడం వెనుక రాయలసీమ టీడీపీ నేతల వ్యూహం పలు అనుమానాలకు తావిస్తోంది. ముఖ్యంగా చంద్రబాబు ఒత్తిడితోనే సీమ నేతలు ఇప్పుడు స్పందిస్తున్నారనే ప్రచారం కూడా ఊపందుకుంది. మరోవైపు జగన్ సర్కారు రాజధానుల ప్రకటనకు వ్యతిరేకంగా ఇన్నాళ్లూ మౌనంగా ఉన్న నేతలు ఇప్పుడు ఒక్కసారిగా మాట్లాడటం వెనుక చంద్రబాబు ఒత్తిడే కారణమనే వాదన వినిపిస్తోంది.
Recommended Video

అమరావతి భజన లాభమా, నష్టమా ?
కర్నూల్లో న్యాయ రాజధానిని కాదని అమరావతి నినాదం ఎత్తుకోవడం ద్వారా సీమ టీడీపీ నేతలు ఆశిస్తున్న ప్రయోజనం ఏంటనే చర్చ కూడా జోరుగా సాగుతోంది. అమరావతి నినాదం వినిపించడం ద్వారా సీమ టీడీపీ నేతలు ఏం ఆశిస్తున్నారనే అనుమానాలు కూడా మొదలయ్యాయి. చంద్రబాబు అజెండాకు అనుకూలంగా పనిచేసి ఇప్పటికే గత ఎన్నికల్లో రాజకీయంగా నష్టపోయిన టీడీపీ నేతలు ఇప్పుడు అమరావతి నినాదంతో ఉన్న కాస్త పరువూ పోగొట్టుకోవడం మినహా చేసేది లేదని వైసీపీ విమర్శిస్తోంది. వాస్తవానికి అమరావతి నినాదంతో సీమ టీడీపీ నేతలకు ఒనగూరే ప్రయోజనాలు కూడా కనిపించడం లేదు. అదీ అంతా ముగిశాక ఇప్పుడు చివరి దశలో అమరావతి నినాదంతో రెంటికీ చెడ్డ రేవడిగా మారే ప్రమాదం ఉందన్న చర్చా సాగుతోంది.












Click it and Unblock the Notifications