బీసీ మంత్రం జపిస్తున్న జగన్ ప్రభుత్వం.. సంక్షేమానికి పెద్దపీట..!

అమరావతి : ఇచ్చిన మాటకు కట్టుబడి బీసీల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఎన్నికల హామీల్లో భాగంగా బీసీల ఆత్మగౌరవం కాపాడతామని చెప్పిన జగన్.. ఆ మేరకు క‌ృషి చేస్తున్నారు. బీసీలంటే వెనుకబడిన తరగతుల వారు కాదని.. ప్రభుత్వాలకు వెన్నుదన్నుగా నిలిచేవారని కొత్త భాష్యం చెబుతూ తొలి బడ్జెట్‌లోనే ఊహించని రీతిలో నిధులు కేటాయించారు.

ఎన్నికలు వస్తాయి, పోతాయి. ముఖ్యమంత్రులు మారుతూనే ఉంటారు. హామీలు మాత్రం గాల్లో కలిసిపోతాయి. అయితే బీసీల విషయంలో ఎన్నికల మెనిఫెస్టో ప్రకారం.. ఏవైతే హామీలు ఇచ్చారో వాటిని నెరవేర్చేందుకు సన్నద్ధమవుతున్నారు జగన్. ఆ క్రమంలో బీసీలకు ఏటా 15 వేల కోట్ల చొప్పున ఐదేళ్లకు గాను 75వేల కోట్ల రూపాయలు బీసీ ఉప ప్రణాళికకు కేటాయిస్తామని స్పష్టం చేశారు.

ఆనాటి హామీలు.. ఈనాటి కసరత్తు

ఆనాటి హామీలు.. ఈనాటి కసరత్తు

ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా కొలువుదీరిన వైసీపీ ప్రభుత్వం సంచలనాత్మక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకెళుతోంది. ఆ క్రమంలో ఎన్నికల నాటి మెనిఫెస్టోను మరిచిపోకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది. అందులోభాగంగా బీసీ ఉప ప్రణాళికకు 15 వేల 61 కోట్ల రూపాయలు కేటాయించింది. ఆ నిధులతో వెనుకబడిన వర్గాలు వ్యక్తిగతంగా ప్రయోజనాలు పొందడమే గాకుండా.. ఆర్థికంగా ఎదిగేందుకు ఉపయోగించనుంది. బీసీ కమిషన్‌ను మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దేలా కసరత్తు చేస్తోంది.

 బీసీల ఆర్థికాభివృద్ధికి.. వైఎస్‌ఆర్ చేయూత..!

బీసీల ఆర్థికాభివృద్ధికి.. వైఎస్‌ఆర్ చేయూత..!


ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం 29 బీసీ కార్పొరేషన్లు ఉన్నాయి. అయితే మెనిఫేస్టో హామీ ప్రకారం 139 కార్పొరేషన్లు ఏర్పాటు చేయనున్నట్లు బడ్జెట్‌లో ప్రకటించారు. వాటి ద్వారా బీసీ ఉప సామాజిక వర్గాల అభివృద్ధికి దోహదపడేలా కార్యక్రమాలు తీర్చిదిద్దనున్నారు. జవాబుదారీతనం, పారదర్శకతకు పెద్దపీట వేస్తూ ప్రస్తుతమున్న కార్పొరేషన్లను సంస్కరించాక వచ్చే ఏడాది నుంచి వైఎస్‌ఆర్ చేయూత పథకం ప్రారంభించనున్నారు. అదలావుంటే
ప్రస్తుతం అమల్లో ఉన్న బీసీ కులాలకు చెందిన 29 కార్పొరేషన్లకు 3 వేల 964 కోట్ల రూపాయలు కేటాయించారు. ఆ 29 కులాల వారిని ఆర్థికంగా బలోపేతం చేసేందుకు, వారి జీవనోపాధి కోసం వివిధ పథకాల కింద సబ్సిడీలతో కూడిన ఆర్థిక సాయం అందించనున్నారు.

 కులవృత్తులకు న్యాయం.. ఆర్థిక భరోసా

కులవృత్తులకు న్యాయం.. ఆర్థిక భరోసా

ఇక వివిధ కులవృత్తుల వారికి ఆసరాగా ఉండేలా భరోసా కల్పించనున్నారు. చేనేత కార్మికుల కుటుంబాలకు ఆర్థిక సాయం అందించేలా బడ్జెట్‌లో తగిన కేటాయింపులు చేశారు. ప్రతి చేనేతకారుడి కుటుంబానికి 24 వేల రూపాయల చొప్పున వైఎస్సార్‌ చేయూత పేరుతో ఆర్థిక సాయం చేయనున్నారు. దానికోసం బడ్జెట్‌లో 200 కోట్ల రూపాయలు కేటాయించారు.

నాయీ బ్రాహ్మణులకు, రజకులకు ప్రతి సంవత్సరం 10 వేల రూపాయల వరకు ఆదాయ మద్ధతును ఇవ్వాలని బడ్జెట్‌లో స్పష్టం చేశారు. దాదాపు 200 కోట్ల రూపాయల వ్యయంతో 23 వేల మంది నాయీ బ్రాహ్మణులకు, లక్షా 92 వేల మంది రజకులకు ప్రయోజనం చేకూరనుంది. ఇక దర్జీలకు ఈ ఏడాది 100 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు.

 యువతులకు పెళ్లి కానుక.. 45 ఏళ్లు దాటిన మహిళలకు ఆర్థిక సాయం..!

యువతులకు పెళ్లి కానుక.. 45 ఏళ్లు దాటిన మహిళలకు ఆర్థిక సాయం..!


ఎన్నికలకు ముందు ఏలూరులో భారీ ఎత్తున బీసీ గర్జన నిర్వహించారు వైసీపీ నేతలు. ఆ వేదికపై ఇచ్చిన హామీలతో పాటు మెనిఫెస్టోలో పొందుపరిచిన అంశాల ప్రాతిపదికన తొలి బడ్జెట్‌లోనే బీసీ వర్గాలకు పెళ్లి కానుక ప్రకటించారు. వైఎస్‌ఆర్ పెళ్లి కానుక కింద 300 కోట్ల రూపాయలు కేటాయించారు. ఈ స్కీమ్ కింద బీసీ కులాలకు చెందిన నవ వధువులకు 50 వేల రూపాయల చొప్పున పెళ్లి కానుక ఇవ్వనున్నారు. అలాగే 45 ఏళ్లు దాటిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలకు వచ్చే ఏడాది నుంచి వైఎస్సార్‌ చేయూత కింద లబ్ధి చేకూరనుంది. వారికి నాలుగేళ్లలో నాలుగు విడతలుగా 75 వేల రూపాయలు ఇవ్వనున్నారు.

7 లక్షల 82 వేల మంది బీసీ విద్యార్థుల చదువుల కోసం ఫీజు రీయింబర్స్ చెల్లించడానికి బడ్జెట్‌లో 2 వేల 218 కోట్ల రూపాయలు కేటాయించారు. అంతేకాదు బీసీ పిల్లలను బడికి పంపిస్తే వారి తల్లులకు ప్రతి సంవత్సరం 15 వేల రూపాయలు చెల్లించేలా ఉప ప్రణాళికలో 12 వందల 94 కోట్ల రూపాయలు కేటాయించారు. అలాగే ప్రమాదవశాత్తు ఎవరైనా చనిపోతే ఆయా బీసీ కులాల కుటుంబాలకు వైఎస్‌ఆర్ బీమా ద్వారా 5 లక్షల రూపాయల సాయం అందించనున్నారు.

రాజకీయ ఉన్నతికి దోహదం.. నామినేటెడ్ పోస్టుల్లో 50 శాతం

రాజకీయ ఉన్నతికి దోహదం.. నామినేటెడ్ పోస్టుల్లో 50 శాతం

అప్పట్లో జగన్ పాదయాత్ర సందర్భంగా ఆటో డ్రైవర్లు వారి ఇబ్బందులను ఆయన దృష్టికి తీసుకొచ్చారు. సొంతంగా ఆటో కలిగి ఉండి ఇబ్బందులు పడుతున్న డ్రైవర్లకు 10 వేల రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందిస్తామని ప్రకటించారు. ఆ మేరకు తొలి బడ్జెట్‌లో 400 కోట్ల రూపాయలు కేటాయించారు.

సంక్షేమ పథకాలే కాదు బీసీల రాజకీయ ఉన్నతికి పెద్దపీట వేయనున్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడి నామినేటెడ్‌ పోస్టుల విషయంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు సన్నద్ధమవుతున్నారు. అలాగే ప్రభుత్వం నామినేటేడ్, కాంట్రాక్ట్ పనుల్లో ఈ వర్గాలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ చట్టం తీసుకురానున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+