ఆ రెండు జిల్లాల్లో పసుపు జెండా ఎగరాల్సిందే - చంద్రబాబు దిమ్మతిరిగే స్ట్రాటజీ..!!
అనంతపురం: రాష్ట్ర రాజకీయాలు రసకందాయంగా మారుతున్నాయి. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ - ప్రతిపక్ష తెలుగుదేశం మధ్య ఎత్తులు పైఎత్తులు అప్పుడే మొదలైపోయాయి. ఈ రెండు పార్టీలు కూడా భవిష్యత్ ప్రణాళికలను రూపొందించుకోవడంలో తలమునకలై ఉన్నాయి. వరుసగా రెండోసారి అధికారంలోకి రావడానికి వైఎస్ఆర్సీపీ కసరత్తు చేస్తోండగా.. ఈ సారి గట్టిగా కొట్టాలనే పట్టుదలను ప్రదర్శిస్తోంది టీడీపీ.
క్లీన్ స్వీప్ కోసం..
వైఎస్ఆర్సీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్దేశించుకున్న లక్ష్యం- క్లీన్ స్వీప్. రాష్ట్రంలో ఉన్న 175 స్థానాలను గెలవాలని ఆయన టార్గెట్గా పెట్టుకున్నారు. అదే విషయాన్ని పార్టీ నాయకులకూ బోధిస్తోన్నారు. ఇప్పటికే వరుసగా పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతో వర్క్షాప్లను నిర్వహిస్తోన్నారు. టార్గెట్ 175ను పదేపదే ప్రస్తావిస్తోన్నారు. 85 నుంచి 90 శాతం వరకు ప్రజలు ప్రభుత్వం పనితీరు పట్ల సంతృప్తిని వ్యక్తం చేస్తోన్న ప్రస్తుత పరిస్థితుల్లో క్లీన్ స్వీప్ ఎందుకు సాధ్యం కాదనేది జగన్ వాదన.
టీడీపీ కూడా..
అటు తెలుగుదేశం కూడా అదే స్థాయిలో వ్యూహాలను రూపొందించుకుంటోంది. జిల్లాలవారీగా రిపోర్టులను తెప్పించుకుంటోందా పార్టీ అగ్ర నాయకత్వం. దీనికోసం ప్రత్యేక యంత్రాంగాన్ని మోహరింపజేసింది. క్షేత్రస్థాయిలో పార్టీ బలబలాల గురించి ఆరా తీస్తోంది. బలహీనంగా ఉన్న చోట్ల పార్టీని పటిష్ఠపర్చడంపై ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు దృష్టి సారించారు. 2019 నాటి ఎన్నికల్లో పెద్దసంఖ్యలో సీట్లను కోల్పోయిన జిల్లాలపై ఆయన ప్రధానంగా దృష్టి సారించారు.
ఉమ్మడి అనంతపురంపై..
2019 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ దాదాపుగా క్లీన్ స్వీప్ చేసిన జిల్లాల్లో ఉమ్మడి అనంతపురం కూడా ఒకటి. ఉమ్మడి అనంతపురంలో మొత్తం 13 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా.. టీడీపీకి దక్కింది- రెండే. ఉరవకొండ నుంచి పయ్యావుల కేశవ్, హిందూపురం నుంచి నందమూరి బాలకృష్ణ విజయం సాధించారంతే. కొత్త జిల్లాల ఏర్పాటు తరువాత ఈ రెండు నియోజకవర్గాలు అటొకటి ఇటొకటి అయ్యాయి. ఉరవకొండ అనంతలో కొనసాగుతుండగా.. హిందూపురం శ్రీసత్యసాయి పుట్టపర్తి జిల్లా పరిధిలోకి వచ్చింది.
అనంతపురం జిల్లాపై..
ఈ రెండు జిల్లాల్లో కూడా పసుపుజెండా ఎగరడానికి తీవ్రంగా ప్రయత్నిస్తోన్నారు చంద్రబాబు. ఇందులో భాగంగా తానే స్వయంగా ఎన్నికల బరిలో దిగే అవకాశాన్ని కూడా పరిశీలిస్తోన్నారు. చిత్తూరు జిల్లా కుప్పంతో పాటు అనంతపురం జిల్లాలోని కల్యాణదుర్గం నుంచి పోటీ చేయాలని ఆయన భావిస్తోన్నారు. కమ్మ సామాజిక వర్గం ఓటు బ్యాంకు పెద్ద సంఖ్యలో ఉన్న ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేయడం ద్వారా దాని ప్రభావం- రెండు జిల్లాలపైనా పడుతుందని అంచనా వేస్తోన్నారు.
పుట్టపర్తి జిల్లాపై..
శ్రీసత్యసాయి పుట్టపర్తి జిల్లాలోని హిందూపురం నుంచి నందమూరి బాలకృష్ణ ఎలాగూ పోటీలో పోటీ చేసే అవకాశం ఉన్నందున రెండు జిల్లాల్లోనూ మెజారిటీ స్థానాలను దక్కించుకోవడానికి వీలు ఉంటుందని చంద్రబాబు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సారి అభ్యర్థుల సీట్ల మార్పులోనూ కొన్ని కీలక నిర్ణయాలను ఆయన తీసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఓడిపోయిన అభ్యర్థులకు టికెట్లివ్వకుండా కొత్త వారిని ప్రోత్సహించేలా చంద్రబాబు కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకున్నట్లు సమాచారం.