ఏపీలో కొనసాగుతున్న కరోనా : 24 గంటల్లో 1,145 పాజిటివ్ కేసులు - 17 మరణాలు..!!
ఏపీలో కరోనా మహమ్మారి పూర్తిగా తగ్గలేదు. ఇంకా కేసుల సంఖ్య వెయ్యికి పైగా నమోదవుతోంది. ఏపీలో వినాయక చవితి ఉత్సవాలకు సైతం ఇళ్లల్లో మినహా బహిరంగ ప్రదేశాల్లో కరోనా కారణంగా నిర్వహించుకొనేందుకు ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. దీని పైన కోర్టుకు వెళ్లినా..న్యాయస్థానం సైతం ప్రయివేటు స్థలాల్లో మినహా.. పబ్లిక్ ప్లేసుల్లో వేడుకలు వద్దని స్పష్టం చేసింది. ఇక, గడచిన 24 గంటల్లో ఏపీలో మొత్తం 13 జిల్లాల్లో 1,145 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
అత్యధిక కేసులు తూర్పు గోదావరి జిల్లాలో 216 నమోదు కాగా, అత్యధిక మరణాలు చిత్తూరులో 4 చోటు చేసుకున్నాయి. కాగా, పాజిటివ్ రేటు రాష్ట్రంలో 2.3 శాతంగా ఉంది. 24 గంటల్లో రాష్ట్రంలో మొత్తంగా 49,581 శాంపిల్స్ పరీక్షలు నిర్వహించారు. ప్రస్తుతం కరోనా యాక్టివ్ కేసులు 15,157 ఉన్నట్లుగా అధికారులు ప్రకటించారు. 24 గంటల్లో 1090 మంది రికవర్ అయ్యారు. ఇప్పటి వరకు ఏపీలో మొత్తంగా 13,987 మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు. 20.28 లక్షల మందిలో 19.99 లక్షల మంది మొత్తంగా రికవరీ అయినట్లు అధికారిక లెక్కలు స్పష్టం చేస్తున్నాయి.
తాజాగా చోటు చేసుకున్న మరణాల్లో చిత్తూరు జిల్లాలో నలుగురు, కడప..నెల్లూరులో ముగ్గురు, క్రిష్ణా..ప్రకాశంలో ఇద్దరు చొప్పున, తూర్పు గోదావరి..గుంటూరు..శ్రీకాకుళంలో ఒక్కక్కరు చొప్పున ప్రాణాలు కోల్పోయారు. అదే విధంగా కేసుల పరంగా చూస్తే.. అనంతపురంలో 18, చిత్తూరులో 132, తూర్పు గోదావరిలో 216, గుంటూరులో 85, కడపలో 111, క్రిష్ణాలో 128, కర్నూలులో 6, నెల్లూరు లో 173, ప్రకాశంలో 117, శ్రీకాకుళంలో 12, విశాఖలో 62, విజయనగరంలో 7, పశ్చిమ గోదావరిలో 78 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
ఇప్పటికే ఏపీలో ప్రారంభమైన స్కూళ్లలో పలు జిల్లాల్లో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. అదే విధంగా 18 ఏళ్లు పైబడిన వారికి వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతోంది. రాత్రి సమయంలో కర్ఫ్యూ అమలు చేస్తున్నారు. థర్డ్ వేవ్ కు సంబంధించి వచ్చినా..రాకున్న అధికారులు పూర్తిగా సంసిద్దులై ఉండాలని ప్రభుత్వం జిల్లా అధికారులను అదేశించింది.