నోట్ల రద్దు ఎఫెక్ట్: నిరుపేద ఖాతాలో రూ.1.26కోట్లు జమ
చిత్తూరు: పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో నల్ల కుబేరులు తమ వద్ద ఉన్న పెద్ద మొత్తంలోని నల్లధనాన్ని ఎలాగైనా వదిలించేందుకు అనేక మార్గాలను ఎంచుకుంటున్నారు. కొందరు ఎవరికీ దక్కకుండా కాల్చివేస్తుండగా, మరికొందరు ఎవరికీ తెలియకుండా దానాలు చేస్తున్నారు. ఇంకొందరు ఎవరో ఒకరి ఖాతాలో ఒప్పందం ప్రకారమో లేక పోతో పోనీ అనుకుని డబ్బులు వేసేస్తున్నారు.
తాజాగా ఇలాంటి ఘటనే చిత్తూరు జిల్లాలో చోటు చేసుకుంది. దీంతో జిల్లా గుర్రంకొండ మండలం అమిలేపల్లె గ్రామ నివాసి నజీర్ రాత్రికిరాత్రే కోటీశ్వరుడయ్యాడు. నజీర్ 2 నెలల కిందట గుర్రంకొండలోని ఆంధ్రా బ్యాంకులో ఖాతా ప్రారంభించాడు. అతడు కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు.
కాగా, ఆయన ఖాతాలో నిన్నమొన్నటివరకూ కేవలం రూ.192 ఉంది. బుధవారం బ్యాంకుమిత్రకు రూ.250 ఇచ్చి తన ఖాతాలో జమ చేయాలని కోరి ఇంటికి వెళ్లాడు. ఆ తర్వాత రూ.250తోపాటు బుధవారం మధ్యాహ్నం ఖాతాలో రూ.1,26,76,436 జమ అయినట్లుగా సమాచారం అందడంతో నజీర్ ఆశ్చర్యానికి గురయ్యాడు.
బ్యాంకుమిత్ర వద్దకు వచ్చి రశీదు చూడగా 1.26 కోట్లు జమైనట్లుగా చూపింది. వెంటనే బ్యాంకు అధికారులను కలిసి ఈ విషయం చెప్పగా వారు తమకేమీ తెలియదని తెలిపారు. కాగా, ఆదాయ పన్నుశాఖ అధికారులు వచ్చి నగదు జమైన గంటలోపే ఖాతాను సీజ్ చేశారు.