ఏపీలో తొలిసారి 10వేలు దాటిన కొత్త కరోనా కేసులు: 4 జిల్లాల్లో వెయ్యికిపైగా, 70వేల దిశగా యాక్టివ్ కేసులు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి ఉగ్రరూపం దాల్చుతోంది. సెకండ్ వేవ్లో తొలిసారి పది వేలకుపైగా కేసులు నమోదు కావడం మరింత ఆందోళనకు గురిచేస్తోంది. కరోనా మహమ్మారి బారినపడి ప్రాణాలు కోల్పోతున్నవారి సంఖ్య కూడా పెరుగుతోంది. గడిచిన 24 గంటల వ్యవధిలో 41,871 నమూనాలను పరీక్షించగా.. 10,759 మందికి కరోనా సోకినట్లు తేలింది. ఈ మేరకు వివరాలను రాష్ట్ర వైద్యారోగ్య శాఖ గురువారం సాయంత్రం వెల్లడించింది.
ఏపీలో కొత్తగా 10,759 కరోనా కేసులు, 31 మరణాలు
తాజాగా నమోదైన 10,759 కరోనా కేసులతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 9,97,462కి చేరింది. గత 24 గంటల్లో కరోనా బారినపడి 31 మంది మృతి చెందారు. చిత్తూరు, కృష్ణాలో ఐదుగురు చొప్పున, కర్నూలు, నెల్లూరు, ప్రకాశం, శ్రీకాకుళం జిల్లాల్లో ముగ్గురేసి, తూర్పుగోదావరి, గుంటూరు, విజయనగరంలో ఇద్దరు చొప్పున, అనంతపురం, కడప, విశాఖలో ఒక్కరు చొప్పున ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు కరోనాతో మరణించినవారి సంఖ్య 7541కి చేరింది.
ఏపీలో 70వేలకు చేరువలో యాక్టివ్ కేసులు
ఒక్క రోజు వ్యవధిలో రాష్ట్రంలో 3992 మంది పూర్తిగా కోలుకోగా, ఇప్పటి వరకు రాష్ట్రంలో ఆ మహమ్మారి నుంచి సురక్షితంగా బయటపడినవారి సంఖ్య 9,22,977కి చేరింది. కోలుకుంటున్నవారి కంటే కొత్తగా నమోదవుతున్న కరోనా కేసులు భారీగా ఉంటుండటంతో యాక్టివ్ కేసుల్లో అత్యధిక పెరుగుదల నమోదవుతువుతోంది. రాష్ట్రంలో ప్రస్తుతం 66,944 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో 1,58,35,169 కరోనా నమూనాలను పరీక్షించారు.
పశ్చిమగోదావరి మినహా అన్ని జిల్లాల్లోనూ కరోనా కల్లోలమే
రాష్ట్రంలో ఒక్క పశ్చిమగోదావరి జిల్లా మినహా అన్ని జిల్లాల్లోనూ కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. అత్యధికంగా చిత్తూరులో 1474, కర్నూలులో 1367, శ్రీకాకుళంలో 1336, గుంటూరులో 1186 కరోనా కేసులు నమోదు కాగా, అల్పంగా పశ్చిమగోదావరి జిల్లాలో 90 కేసులు నమోదుయ్యాయి. పశ్చిమగోదావరి మినహా అన్ని జిల్లాల్లోనూ 200కుపై కరోనా కేసులు నమోదయ్యాయి.
ఏపీలో జిల్లాల వారీగా భారీగా కొత్త కరోనా కేసులు
ఏపీలో జిల్లాల వారీగా కొత్త కరోనా కేసులు పరిశీలించినట్లయితే.. అనంతపురంలో 789, చిత్తూరులో 1474, తూర్పుగోదావరిలో 992, గుంటూరులో 1186, కడపలో 279, కృష్ణాలో 679, కర్నూలులో 1367, నెల్లూరులో 816, ప్రకాశంలో 345, శ్రీకాకుళంలో 1336, విశాఖపట్నంలో 844, విజయనగరంలో 562, పశ్చిమగోదావరిలో 90 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలంతా కరోనా నిబంధనలను పాటించాలని ప్రభుత్వం కోరుతోంది. బయటికి వెళ్లినప్పుడు మాస్కులు తప్పనిసరిగా ధరించాలని, భౌతిక దూరం పాటించాలని స్పష్టం చేసింది. మాస్కులు ధరించకుంటే రూ. 100 జరిమానా విధించాలని ఏపీ సర్కారు ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. కరోనా కేసులు పెరుగుతున్న క్రమంలో నిబంధనలను మరింత కఠినంగా అమలు చేయాలని, మరిన్ని ఆంక్షలను విధించాలనే యోచనలో సర్కారు ఉన్నట్లు సమాచారం.