గ్యాస్ లీక్ ఘటన.. ఆర్.ఆర్ వెంకటాపురంలో 10 పడకల క్లినిక్.. మెడికల్ క్యాంపులలో 6 వైద్య బృందాలు
విశాఖ ఎల్జీ గ్యాస్ లీక్ బాధిత గ్రామాలలో మెడికల్ క్యాంపులు మొదలయ్యాయి. ఎల్జీ పాలిమర్స్ నుండి వెలువడిన విష వాయువు ప్రభావంతో సమీప గ్రామాల ప్రజలు అస్వస్థతకు గురయ్యారు. 12 మంది ఏకంగా ప్రాణాలే పోగొట్టుకున్నారు . ఇక స్టైరీన్ విషవాయువు ప్రభావం ప్రజల ఆరోగ్యాలపై దీర్ఘ కాలంపాటు ఉంటుందని వైద్యులు చెప్పిన పరిస్థితి. ఇక ఈ నేపధ్యంలో ప్రజలకు భరోసా ఇచ్చేందుకు, వారికి వైద్య సేవలు అందించేందుకు కంకణ బద్ధులైన ఏపీ ప్రభుత్వం వారికి మెరుగైన వైద్య సేవలు అందించటానికి యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టింది.
ఆర్. ఆర్ వెంకటాపురంలో 10 పడకలతో వైఎస్సార్ క్లినిక్
ఇక అందులో భాగంగా ఆర్. ఆర్ వెంకటాపురంలో 10 పడకలతో వైఎస్సార్ క్లినిక్ను ఏర్పాటు చేసినట్లు వైద్య నిపుణుల కమిటీ చైర్మన్ డాక్టర్ సుధాకర్ తెలిపారు. మొట్ట ఆరు వైద్య బృందాలు అక్కడ పని చేయనున్నట్టు పేర్కొన్నారు . ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సూచనల మేరకు బాధిత గ్రామాలలో 24 గంటల వైద్య సేవలు అందిస్తామని చెప్పారు . 3 షిఫ్టులలో 6 వైద్య బృందాలు పనిచేస్తున్నట్లు పేర్కొన్నారు.
అన్ని వైద్య విభాగాల నుండి స్పెషలిస్ట్ లతో వైద్య సేవలు
ఈ బృందం ప్రజల ఆరోగ్య సమస్యలపై దీర్ఘకాలికంగా పర్యవేక్షించడానికి, పని చెయ్యటానికి వారికి అక్కడి పరిస్థితులు అంచనా వెయ్యటానికి 10 మంది నిపుణులతో కూడిన ప్రత్యేక వైద్య బృందాన్ని నియమించామన్నారు. ఈ వైద్య నిపుణుల కమిటీ గ్యాస్ లీకేజీ బాధిత గ్రామాల్లో ప్రజల ఆరోగ్య సమస్యలను పరీక్షించడంలో దీర్ఘకాలికంగా పనిచేస్తుందని చెప్పారు. సహాయక చర్యల్లో భాగంగా గ్రామాలన్నీ ఇప్పటికే శానిటైజ్ చెయ్యటంతో పాటు వారికి కావాల్సిన మౌలిక వసతులు కల్పిస్తున్నామని పేర్కొన్నారు . అంతేకాదు అక్కడ ప్రజల ఆరోగ్యంపై స్టైరీన్ ప్రభావం ఎక్కువగా ఉన్న కారణంగా వారికి అన్ని వైద్య విభాగాల నుండి స్పెషలిస్ట్ లతో వైద్య సేవలు అందిస్తున్నారు.
ప్రజల ఆరోగ్య సమస్యలపై శాస్త్రీయమైన పద్దతిలో అధ్యయనం
ఇందులో జనరల్ మెడిసిన్, పాథాలజీ, న్యూరో, పల్మనాలజీ, గ్యాస్ట్రో ఎంట్రాలజీ, కంటి, చిన్న పిల్లల వైద్య నిపుణులు గ్యాస్ లీక్ ప్రభావిత గ్రామాలలో సేవలు అందిస్తున్నారు. బాధిత గ్రామాల ప్రజల ఆరోగ్య సమస్యలపై నెల రోజుల పాటు ముందు ఈ కమిటీ అధ్వర్యంలో ప్రజల ఆరోగ్య సమస్యలపై శాస్త్రీయమైన పద్దతిలో అధ్యయనం చెయ్యనున్నారు. వారు ఎలాంటి ఇబ్బందులకు గురవుతున్నారు. వారికి ఎలాంటి వైద్య చికిత్స అవసరం , స్వల్ప కాలం సరిపోతుందా లేకా దీర్ఘ కాలంలో ఆ సమస్య ఉండే అవకాశం ఉందా అని అన్ని కోణాల్లో వారు అధ్యయనం చేస్తారు . అంతే కాదు వారి ఆరోగ్యం విషయంలో నిరంతరాయంగా పర్యవేక్షణ చేయనున్నారు.
Recommended Video
కేంద్ర వైద్య ఆరోగ్యశాఖతో చర్చలు ... హెల్త్ కార్డులను జారీ చెయ్యనున్న ప్రభుత్వం
బాధిత గ్రామాల ప్రజల ఆరోగ్య సమస్యల బాధ్యత ప్రభుత్వమే తీసుకుంటుందని చెప్పిన నేపధ్యంలోనే ప్రభుత్వం ఈ ఏర్పాట్లు చేసింది . భవిష్యత్లో ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ బాధితుల ఆరోగ్యంపై ఇబ్బందులు రాకుండా ఈ నిపుణుల కమిటీ పనిచేస్తుందని తెలుస్తుంది. ఇప్పటికే స్టైరీన్ గ్యాస్ వ్యవహారం, బాధితుల పరిస్థితిపై , వారి వైద్య సమస్యలపై ఢిల్లీలోని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ డైరెక్టర్ రాజీవ్ గార్గ్, ఇన్సిట్యూట్ ఆప్ న్యూక్లియర్ మెడిసిన్ నిపుణులతోనూ చర్చిస్తున్న వైద్య నిపుణుల బృందం కేంద్రానికి కూడా ఎప్పటికప్పుడు బాధితుల పరిస్థితి వివరించనున్నారు. ఇక వీరందరికీ ప్రభుత్వం తరపు నుంచి హెల్త్ కార్డులను కూడా జారీ చేస్తున్నట్లు తెలుస్తుంది. భవిష్యత్ లో ఎలాంటి ఆనారోగ్య సూచన అయినా వారందరికీ ఉచిత వైద్యం అందించేలా నిర్ణయం తీసుకుంది ఏపీ ప్రభుత్వం .