విషాదం: అనంత ఆస్పత్రిలో 10మంది కోవిడ్ పేషెంట్ల మృతి.. ఆక్సిజన్ సమస్య కాదన్న కలెక్టర్...
అనంతపురంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. స్థానిక జనరల్ ఆస్పత్రిలో 10 మంది కరోనా పేషెంట్లు మృతి చెందారు.మృతుల కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తూ ఆందోళనకు దిగారు. ఆక్సిజన్ అందకే తమవాళ్లు చనిపోయారని మృతుల కుటుంబ సభ్యులు ఆరోపిస్తుంటే... అధికారులు మాత్రం సాధారణ మరణాలే అని చెబుతున్నారు. బాధితుల ఆందోళన నేపథ్యంలో ఆస్పత్రిలో జాయింట్ కలెక్టర్ నిశాంత్ కుమార్ ఆస్పత్రిలో తనిఖీలు చేశారు. రోగుల మరణాలపై వైద్యాధికారులను జాయింట్ కలెక్టర్ విచారిస్తున్నారు.
పైప్ లైన్ నిర్వహణలో లోపాలున్నాయా?
అనంతపురం జనరల్ ఆస్పత్రిలో ఆక్సిజన్ నిల్వలు ఉన్నప్పటికీ... ఆక్సిజన్ సపోర్ట్తో చికిత్స పొందుతున్నవారికి పైప్లైన్ ద్వారా దాన్ని సరఫరా చేయడంలో సాంకేతిక సమస్య తలెత్తిందని మృతుల కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.పైప్ లైన్ నిర్వహణలో లోపాలే తమవాళ్లను బలితీసుకున్నాయని ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం అనంతపురం సర్వజన ఆస్పత్రిలో 47 మంది వెంటిలేటరుపై చికిత్స పొందుతున్నారు. మరో 180 మంది పేషెంట్లు ఆక్సిజన్ బెడ్స్పై చికిత్స పొందుతున్నారు. ఆస్పత్రి అవసరాలకు ప్రత్యేకంగా 13 కిలో లీటర్ల లిక్విడ్ ఆక్సిజన్ ప్లాంటు కూడా ఉంది. ఈ ప్లాంటు నుంచి వార్డుల్లోని ఆక్సిజన్ బెడ్స్పై చికిత్స పొందుతున్న పేషెంట్లకు పైప్ లైన్ ద్వారా ఆక్సిజన్ సరఫరా జరుగుతుంది. అయితే ఆ పైప్ లైన్లో సాంకేతిక లోపాలతో 10 మంది కరోనా పేషెంట్లు మృతి చెందినట్లు చెబుతున్నారు.
సాయంత్రం 5గంటల సమయంలో...
గతేడాది కరోనా మొదటి వేవ్ సమయంలోనూ అనంతపురం జనరల్ ఆస్పత్రిలో ఇదే సమస్య తలెత్తింది. అప్పట్లో తాత్కాలికంగా ఆ సమస్య పరిష్కారమైనప్పటికీ ఇప్పుడు మళ్లీ అవే లోపాలు తలెత్తినట్లు తెలుస్తోంది. రోగి ఆక్సిజన్ బెడ్ వరకు నాలుగు పాయింట్ల ప్రెజర్ ఉండాల్సిన చోట 2.5 వరకే అందుతున్నట్లు రోగుల బంధువులు చెబుతున్నారు. ఈ సమస్యను సరిచేయడానికి చెన్నై నుంచి టెక్నీషియన్ని సైతం పిలిపించారు. లోపాలను గుర్తించి సరిచేసే క్రమంలో కొన్ని వార్డులకు ఆక్సిజన్ అందనట్లు మృతుల కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ కారణంగానే ఆక్సిజన్ అందక 10 మంది పేషెంట్లు చనిపోయారని చెబుతున్నారు. సాయంత్రం 5గంటల నుంచి 6.44గంటల మధ్యలో ఈ విషాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది.
Recommended Video
ప్రభుత్వం విఫలమైందన్న చంద్రబాబు...
అనంతపురం జనరల్ ఆస్పత్రిలో ఆక్సిజన్ అందక 10 మంది రోగుల మృతి దురదృష్టకరమని చంద్రబాబు అన్నారు. వైసీపీ నాయకుల అవినీతికి ఆక్సిజన్ అందుతుంది కానీ ప్రజల ప్రాణాలు కాపాడటానికి ప్రభుత్వం ఆక్సిజన్ అందించడం లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనా బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. విజయనగరం, కర్నూలు ఘటనలపై శ్రద్ధ వహించి ఉంటే అనంతపురంలో ఈ ఘోరం జరిగేదికాదని చెప్పారు. ఆస్పత్రిలో మౌలిక వసతులపై ముఖ్యమంత్రి ఒక్కసారైనా సమీక్ష చేశారా అని ప్రశ్నించారు. మంత్రులు,ఎంపీలు పొరుగు రాష్ట్రాల్లో చికిత్స తీసుకుంటూ.. ఇక్కడి అమాయక ప్రజలను గాలికి వదిలేశారని ఆరోపించారు.
కలెక్టర్ వివరణ ఇది...
పేషెంట్ల మృతి గురించి తెలియగానే కలెక్టర్ గంధం చంద్రుడు, జాయింట్ కలెక్టర్ నిశాంత్కుమార్, ఎమ్మెల్యే వెంకటరామిరెడ్డి ఆస్పత్రిని సందర్శించారు. అనంతరం జేసీ నిశాంత్ మాట్లాడుతూ.. ఆస్పత్రిలో సరిపడా ఆక్సిజన్ ఉందన్నారు.ఆక్సిజన్ సరఫరాలోనూ ఎటువంటి సమస్య లేదన్నారు. పూర్తి సామర్థ్యంతోనే ఆక్సిజన్ అన్ని వార్డులకు అందుతోందన్నారు. ఆరోగ్య పరిస్థితి విషమించడం వల్లే పేషెంట్లు చనిపోయారని.. అంతే తప్ప ఆక్సిజన్ కొరత అన్న ప్రచారంలో నిజం లేదని అన్నారు. కలెక్టర్ గంధం చంద్రుడు కూడా ఇదే విషయాన్ని వెల్లడించారు.ఘటనకు సంబంధించి పూర్తి స్థాయి విచారణ చేస్తున్నట్లు చెప్పారు. వైద్యారోగ్య శాఖ కార్యదర్శి అనిల్ సింఘాల్ కూడా ఆక్సిజన్ కొరత ప్రచారాన్ని ఖండించారు. రాష్ట్రంలో ఆక్సిజన్ కొరత లేదన్నారు.
కర్నూలులోనూ ఇదే తరహా ఘటన...
కర్నూలు జిల్లాలోని కేఎస్ కేర్ ఆస్పత్రిలోనూ ఆక్సిజన్ కొరతతో నలుగురు కోవిడ్ బాధితులు మృతి చెందినట్లు కథనాలు వచ్చాయి. తమకు ఆక్సిజన్ అందడం లేదని రోగులు ఎంత మొత్తుకున్నా ఆస్పత్రి సిబ్బంది ఏమాత్రం పట్టించుకోలేదని రోగుల కుటుంబ సభ్యులు ఆరోపించారు. అయితే వైద్యారోగ్య శాఖ కార్యదర్శి అనిల్ సింఘాల్ ఈ ఆరోపణలను ఖండించారు. కర్నూలు ఆస్పత్రిలో మరణాలకు ఆక్సిజన్ కొరతకు సంబంధం లేదన్నారు.కేఎస్ కేఆర్ ఆస్పత్రిలో సరిపడా ఆక్సిజన్ సిలిండర్లు ఉన్నాయని చెప్పారు. కోవిడ్,ఇతరత్రా అనారోగ్య సమస్యలతోనే వారు మృతి చెందినట్లు చెప్పారు.కేఎస్ కేర్ ఆస్పత్రి ఘటనపై కలెక్టర్ ఆదేశాల మేరకు డీఎంహెచ్వో గిడ్డయ్య విచారణ చేపట్టారు.