ఏపీలో జోరుగా మూడో విడత సర్వే- 12 వేల అనుమానితులు- 26 మందికి టెస్టులు..
ఏపీలో కరోనా బాధితుల గుర్తింపు కోసం ప్రభుత్వం చేపట్టిన మూడో విడత సర్వే రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతోంది. ఇందులో భాగంగా కరోనా వైరస్ సోకిన వారిని తాకిన వారిని, రోగ లక్షణాలు కలిగిన వారిని గుర్తించే ప్రక్రియ కొనసాగుతోంది. ఇది పూర్తయితే ఏపీలో దాదాపుగా కరోనా బాధితుల గుర్తింపు పూర్తవుతుందని భావిస్తున్నారు. మిగిలిన వారిని ర్యాండమ్ సర్వే ద్వారా గుర్తిస్తారు.

మూడో విడత సర్వే...
ఏపీలో కరోనా బాధితుల గుర్తింపు తుది దశకు చేరుకుంటోంది. ఇప్పటికే ఢిల్లీతో పాటు విదేశాల నుంచి వచ్చిన వారితో పాటు వారి ప్రాథమిక కాంటాక్టులను గుర్తించి పరీక్షలు పూర్తి చేసిన ప్రభుత్వం.. వీరి నుంచి కరోనా వైరస్ సోకిన వారిని పూర్తిస్ధాయిలో గుర్తించేందుకు వీలుగా మూడో విడత సర్వే నిర్వహిస్తోంది. గ్రామ,వార్డు వాలంటీర్లు, ఆశా వర్కర్ల సాయంతో నిర్వహిస్తున్న ఈ సర్వేలో రెండు రోజుల్లోనే లక్షల కుటుంబాలను వాలంటీర్లు కలిసి వివరాలు సేకరించినట్లు తెలుస్తోంది. ఇందులో 12 వేల 300 మందికి కరోనా అనుమానితులుగా గుర్తించారు. అయితే కరోనా లక్షణాలు కలిగిన 1754 మందిని హోం క్వారంటైన్లో ఉండాలని సూచించారు. అలాగే 26 మంది శాంపిల్స్ ను పరీక్షల కోసం పంపారు,

సర్వే పూర్తయితే క్లారిటీ...
ఏపీలో మూడో విడత కరోనా ఇంటింటి సర్వే పూర్తయితే వాస్తవ పరిస్ధితి మీద ప్రభుత్వానికి క్లారిటీ వస్తుందని భావిస్తున్నారు. ప్రస్తుతం చేపడుతున్న సర్వేలోనూ బాధితుల సంఖ్య తక్కువగానే కనిపిస్తోంది. అయితే ఎలాంటి రిస్క్ తీసుకోకూడదన్న ఉద్దేశంతోనే ప్రభుత్వం మూడోసారి సర్వే నిర్వహిస్తోంది. ఈ రెండు రోజుల్లో లక్షల కుటుంబాలను సర్వే చేసినా కేవలం 26 శాంపిల్స్ మాత్రమే పరీక్షలకు పంపారంటే పరిస్ధితిలో మార్పు వచ్చినట్లు కనిపిస్తోంది.

ర్యాండమ్ సర్వేకు సన్నాహాలు..
మూడో విడత సర్వే పూర్తయ్యే నాటికి దాదాపుగా రాష్ట్రంలో కోవిడ్ 19 లక్షణాలు కలిగిన వారు, రోగులను గుర్తించినట్లవుతుంది. అయితే చివరిగా రెడ్ జోన్ల పరిధిలో ర్యాండమ్ సర్వే కూడా నిర్వహిస్తే సరిపోతుందని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే విశాఖలో నిర్వహించిన ర్యాండమ్ సర్వేలో శాంపిళ్లన్నీ నెగెటివ్ గా వచ్చాయి. దీంతో మిగతా రెడ్ జోన్ల పరిధిలోనూ ర్యాండమ్ సర్వే నిర్వహిస్తే లాక్ డౌన్ ముగిసే నాటికి ఏపీలో పరిస్ధితి పూర్తిగా అదుపులోకి తీసుకురావచ్చని ప్రభుత్వం అంచనా వేస్తోంది.












Click it and Unblock the Notifications