సిఎంతో 13మంది మంత్రులు, 30మంది ఎమ్మెల్యేలు?
హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో జరిగిన సీమాంధ్ర ప్రాంత కాంగ్రెసు పార్టీ నేతల భేటీకి పలువురు మంత్రులు హాజరు కాలేదు. గురువారం మినిస్టర్స్ క్వార్టర్స్లో భేటీ అనంతరం నేతలు క్యాంపు కార్యాలయంలో కిరణ్ను కలిశారు. కిరణ్తో భేటీకి 13 మంది మంత్రులు, ముప్పై మంది ఎమ్మెల్యేలు హాజరయ్యారు. విభజన నిర్ణయం, సీమాంధ్ర కాంగ్రెసులో గ్రూపుల నేపథ్యంలో ఇప్పుడు హాజరైన వారు కిరణ్ వెంట ఉంటారనే ప్రచారం సాగుతోంది.
ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు, రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, మంత్రులు పితాని సత్యనారాయణ, శత్రుచర్ల విజయరామరావు, కన్నా లక్ష్మీ నారాయణ, బాలరాజు, మహీధర్ రెడ్డి, డొక్కా మాణిక్య వరప్రసాద్లు హాజరు కాలేదు.
మంత్రులు టిజి వెంకటేష్, ఏరాసు ప్రతాప్ రెడ్డి, కాసు వెంకట కృష్ణా రెడ్డిలు అంతకుముందే కిరణ్ను కలిశారు. పార్లమెంటు సభ్యులు లగడపాటి రాజగోపాల్, హర్షకుమార్లు కూడా ముఖ్యమంత్రిని కలిసిన వారిలో ఉన్నారు.
సచివాలయంలో సొమ్మసిల్లిన ఉద్యోగి
సమైక్యాంధ్ర ఉద్యమంలో పాల్గొంటున్న సచివాలయ ఉద్యోగి ఒకరు గురువారం సొమ్మసిల్లి పడిపోయారు. గత కొద్ది రోజులుగా జరుగుతున్న ఉద్యమంలో ఆయన పాల్గొంటున్నారు. ఈ రోజు ఆయన హఠాత్తుగా సొమ్మసిల్లి పడిపోయారు. వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. కాగా, సమైక్యవాదం వినిపించే వాళ్లకే తమ మద్దతు ఉంటుందని సచివాలయ ఉద్యోగులు చెప్పారు. వారు సి బ్లాక్ ముందు ఈ రోజు బైఠాయించారు.