మరో గ్యాస్ లీకేజీ... పాల డెయిరీలో అమ్మోనియం లీక్... 14 మందికి అస్వస్థత...
చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం బండపల్లి సమీపంలోని హట్సన్ పాల డెయిరీలో అమ్మోనియం గ్యాస్ లీకైంది. ఈ ఘటనలో 14 మంది వరకు అస్వస్థతకు గురైనట్లు సమాచారం. బాధితులందరినీ చికిత్స నిమిత్తం చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే ఎవరికీ ఎలాంటి ప్రాణాపాయం లేదని కలెక్టర్ వెల్లడించారు. ప్రమాద ఘటనపై విచారణకు ఆదేశించారు. డెయిరీ యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగానే గ్యాస్ లీకైందా... లేక ప్రమాదవశాత్తు జరిగిందా.. అన్నది తేలాల్సి ఉంది.
హుటాహుటిన ఆస్పత్రికి కలెక్టర్
ప్రమాద విషయం తెలియగానే జిల్లా కలెక్టర్ నారాయణ భరత్ గుప్తా హట్సన్ పాల డెయిరీ వద్దకు చేరుకుని సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఘటనపై విచారణకు ఆదేశించారు. అనంతరం బాధితులు చికిత్స పొందుతున్న ఆస్పత్రికి చేరుకుని వారిని పరామర్శించారు. కలెక్టర్తో పాటు ఎస్పీ సెంథిల్ కుమార్ కూడా బాధితులను పరామర్శించారు. ఎవరికీ ఎలాంటి ప్రాణాపాయం లేదని వైద్యులు చెప్పినట్లుగా కలెక్టర్ వెల్లడించారు.
ప్రమాదం ఎలా జరిగింది...
డెయిరీలో ఉపయోగించే రిఫ్రిజిరేటర్ల కూలింగ్ ప్రక్రియ కోసం అమ్మోనియం వినియోగిస్తారని తెలుస్తోంది. గురువారం సాయంత్రం రిఫ్రిజిరేటర్లకు వెల్డింగ్ చేస్తున్న సమయంలో ఒక్కసారిగా గ్యాస్ లీకైనట్లు చెప్తున్నారు. ప్రమాద సమయంలో ప్రొడక్షన్ యూనిట్లో 22 మంది మహిళా కార్మికులు ఉన్నట్లు సమాచారం. వీరిలో 14 మంది అస్వస్థతకు గురయ్యారని కలెక్టర్ తెలిపారు. డెయిరీ యాజమాన్యం నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమా... లేక ప్రమాదవశాత్తు జరిగిందా అన్నది విచారణ తర్వాతే చెప్పగలుగుతామన్నారు. పరిసర ప్రాంతాల ప్రజలు భయాందోళనకు గురికావాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని అధికారులను ఆదేశించారు.
Recommended Video
వరుస గ్యాస్ లీకేజీ ఘటనలు...
ఈ ఏడాది మే నెలలో విశాఖలోని ఎల్జీ పాలిమర్స్లో గ్యాస్ లీకేజీ ఘటన తర్వాత ఇలాంటి వరుస ఘటనలు చోటు చేసుకున్నాయి. ఎల్జీ పాలిమర్స్ ఘటనలో 12 మంది మృతి చెందగా... దాదాపు 1000 మంది అస్వస్థతకు గురయ్యారు. కృష్ణా జిల్లా కైకలూరులోని శ్రీకాంత్ ఇంటర్నేషనల్ రొయ్యల కంపెనీలోనూ అదే మే నెలలో అమ్మోనియం గ్యాస్ లీకై ఆరుగురు అస్వస్థకు గురైన సంగతి తెలిసిందే. జూన్లో కర్నూలు జిల్లా నంద్యాలలోని కుందూ నది తీరం దగ్గర ఉన్న ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్లోనూ అమ్మోనియం గ్యాస్ లీకై అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఫ్యాక్టరీ జీఎం శ్రీనివాస్ మృతి చెందగా... మరో ముగ్గురు అస్వస్థతకు గురయ్యారు.