కేజీ ఉల్లి 15 రూపాయలే ... కొత్త సంవత్సర కానుక ఇచ్చిన ఏపీ సర్కార్
గత సంవత్సరం సామాన్యులను ఏడిపించిన ఉల్లి ఈ ఏడాది తన ప్రభావాన్ని ఎలా చూపించబోతుందో తెలీదు కానీ కొత్త సంవత్సరం వేళ సామాన్యుల కోసం ఏపీలోని వైసీపీ ప్రభుత్వం మాత్రం ఊహించని గిఫ్ట్ ఇచ్చింది. రోజురోజుకీ పెరుగుతున్న ఉల్లిపాయల ధరలను నియంత్రించటం అటు కేంద్రానికి కూడా కష్టం కాగా ఏపీ సర్కార్ మాత్రం సంచలన నిర్ణయాలతో ముందుకు వెళుతూనే ఉంది. ఇక 2020లో కూడా న్యూ ఇయర్ సందర్భంగా సీఎం జగన్ సామాన్యుల కోసం ఓ గుడ్ న్యూస్ చెప్పారు .
2019 రౌండప్.. హిస్టరీలోనే తొలిసారి ... సామాన్యులను ఏడిపించిన ఉల్లి
ఏపీలో ఉల్లి గోస తీర్చే పనిలో ఏపీ సర్కార్
కొనలేని విధంగా కొండెక్కి కూర్చుని అంతకంతకూ పెరిగిపోతున్న ఉల్లి ధరలకు చెక్ చెప్పటమే కాకుండా దేశంలో మరే రాష్ట్రంలో లేని రీతిలో ఉల్లిపాయల కోసం రైతు బజార్లలో ప్రత్యేకమైన కౌంటర్లు ఏర్పాటు చేసి కేజీ ఉల్లి రూ.25 ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించి అందిస్తున్న విషయం తెలిసిందే . రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేకంగా ఉల్లి కౌంటర్లను ఏర్పాటు చేయటంతో సామాన్యులకు ఒకింత ఊరట లభించింది . బహిరంగ మార్కెట్లో రూ.150 నుంచి రూ.200 మధ్య ధరలు ఉన్న వేళలోనూ కేజీ రూ.25 లకు ప్రత్యేక కౌంటర్ల ద్వారా అందించింది ఏపీ సర్కార్..
కేజీ ఉల్లిని రూ.15లకే ఇవ్వాలని నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం
ఇక ఇప్పుడు న్యూఇయర్ వేళ నుంచి మరో నిర్ణయాన్ని తీసుకున్నారు. కేజీ ఉల్లిని రూ.15లకే ఇవ్వాలని నిర్ణయించారు. ఈ రోజు (జనవరి 1) నుంచి రైతుబజార్లలోని ప్రత్యేక ఉల్లి కౌంటర్లలో తగ్గింపు ధరలకు ఉల్లిని ప్రజలకు అందజేయాలని నిర్ణయం తీసుకున్నారు . రైతుల నుంచి కేజీ ఉల్లి రూ.50 నుంచి రూ.60 మధ్య తెప్పిస్తున్న ప్రభుత్వం ప్రజలకు మాత్రం వాటిని రూ.15లకే ఇవ్వాలని నిర్ణయం తీసుకుని అందించనుంది .
దేశంలోనే ఉల్లి సమస్య పరిష్కారానికి సత్వ నిర్ణయం తీసుకున్న రాష్ట్రం ఏపీ
ఏపీ వ్యాప్తంగా మొత్తం 130 రైతుబజార్లు ఉన్నాయి. వాటిలో 101 పెద్ద యార్డుల్లో ఉల్లి ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేస్తున్నారు. ఇక ఈ ఏడాది కూడా సామన్యులు ఉల్లిని కొనలేక ఆవేదన వ్యక్తం చేస్తారని భావించిన సర్కార్ కొత్త సంవత్సరం వేళ కేజీ ఉల్లిని ఊహించని ధరకు ప్రజలకు అందించాలన్న నిర్ణయం తీసుకుంది. దేశంలో మరి ఏ రాష్ట్రం ఉల్లి సమస్య పరిష్కారానికి తీసుకోని నిర్ణయాన్ని ఏపీ సర్కార్ తీసుకోవటం గమనార్హం