ఏపీలో కరోనా విజృంభణ: 3వేలకు చేరువలో కొత్త కేసులు, 2 జిల్లాల్లో 400కుపైగా, ఆ ఒక్క జిల్లాలోనే అత్యల్పం
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనావైరస్ మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. ఒక్క రోజు వ్యవధిలోనే 3వేలకు చేరువలో పాజిటివ్ కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. గడిచిన 24 గంటల వ్యవధిలో 31,892 నమూనాలను పరీక్షించగా.. 2765 మందికి కరోనా సోకినట్లు తేలింది. ఈ మేరకు వివరాలను రాష్ట్ర వైద్యారోగ్య శాఖ శుక్రవారం సాయంత్రం వెల్లడించింది.
ఏపీలో కొత్తగా 3వేలకు చేరువలో కరోనా కేసులు
తాజాగా నమోదైన 2765 కరోనా కేసులతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 9,18,597కి చేరింది. గత 24 గంటల్లో కరోనా బారినపడి 11 మంది మృతి చెందారు.
అనంతపురం, చిత్తూరు, నెల్లూరు, విశాఖపట్నం జిల్లాల్లో ఇద్దరేసి, గుంటూరు, కృష్ణా, ప్రకాశం జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మరణించారు. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో కరోనా కారణంగా మరణించినవారి సంఖ్య 7,279కి చేరింది.
ఏపీలో భారీగా పెరిగిన యాక్టివ్ కేసులు
ఒక్క రోజు వ్యవధిలో రాష్ట్రంలో 1245 మంది పూర్తిగా కోలుకోగా, ఇప్పటి వరకు రాష్ట్రంలో కోలుకున్నవారి సంఖ్య 8,94,896కి చేరింది. కోలుకున్నవారి కంటే కొత్తగా నమోదవుతున్న కరోనా కేసులు భారీగా పెరుగుతుండటంతో యాక్టివ్ కేసుల్లో పెరుగుదల నమోదవుతువుతోంది. రాష్ట్రంలో ప్రస్తుతం 16,422 యాక్టివ్ కేసులున్నాయి.
ఆ రెండు జిల్లాల్లో 400కుపై కరోనా కేసులు
ఇప్పటి వరకు రాష్ట్రంలో 1,53,65,743 కరోనా నమూనాలను పరీక్షించారు. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 496, గుంటూరు జిల్లాలో 490 కరోనా కేసులు నమోదు కాగా, అత్యల్పంగా పశ్చిమగోదావరి జిల్లాలో 6 కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజు వ్యవధిలోనే 9 జిల్లాల్లో 100కిపైగా కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది.
ఏపీలో జిల్లాల వారీగా కొత్తగా పెరిగిన కరోనా కేసులు
ఏపీలో జిల్లాల వారీగా కొత్త కరోనా కేసులు ఇలా ఉన్నాయి.. అనంతపురంలో 167, చిత్తూరులో 496, తూర్పుగోదావరిలో 78, గుంటూరులో 490, కడపలో 171, కృష్ణాలో 341, కర్నూలులో 79, నెల్లూరులో 292, ప్రకాశంలో 161, శ్రీకాకుళంలో 100, విశాఖపట్నంలో 335, విజయనగరంలో 49, పశ్చిమగోదావరిలో 6 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలంతా కరోనా నిబంధనలను పాటించాలని ప్రభుత్వం కోరుతోంది. బయటికి వెళ్లినప్పుడు మాస్కులు తప్పనిసరిగా ధరించాలని, భౌతిక దూరం పాటించాలని స్పష్టం చేసింది. కాగా, రాష్ట్రంలో ప్రతి రోజు 6 లక్షల మందికి కరోనా టీకా వేయాలని సీఎం వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు.
Recommended Video