టిడిపి వైపు జగన్ ఎమ్మెల్యేల చూపు, 30మంది వరకు!
తాము టిడిపిలో చేరుతామని వారు స్థానిక నేతలకు చెబుతున్నారట. ఇదే విషయాన్ని పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకు వెళ్లారని సమాచారం. అయితే ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అన్నీ మాట్లాడుతామని, ఇప్పుడు వద్దని తెలుగు తమ్ముళ్లకు సూచించినట్లుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
ఇరవై నుండి ముప్పై మంది వరకు...!
ఆంధ్రప్రదేశ్లో దాదాపు ఇరవై నుండి ముప్పై మంది ఎమ్మెల్యేల వరకు టిడిపిలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని చంద్రబాబు భావిస్తున్నారని సమాచారం. కాబట్టి ఒక్కరొక్కరిని కాకుండా.. ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అందర్నీ ఒకేసారి చేర్పించుకుంటే బాగుంటుందని ఆయన అభిప్రాయపడుతున్నారట.
గతంలో కర్నూలు జిల్లాకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారని ప్రచారం జరిగింది. టిడిపిలో చేరాలని చూస్తున్న వారిలో భూమా నాగిరెడ్డి కూడా ఉన్నట్లు చెప్పారు. అయితే వారు ఆ వార్తలను ఖండించారు. తెలంగాణలోను జగన్ పార్టీ నుండి గెలిచిన వారు తెరాస వైపు చూస్తున్నారని ప్రచారం జరిగింది. దీనిని కూడా వారు ఖండించారు.