ఏపీని భయపెడుతున్న కోయంబేడు లింకులు.. కొత్తగా 20 కేసుల్లో బయటపడ్డ మూలాలు
చెన్నైలోని కోయంబేడు మార్కెట్ కరోనా వైరస్కు బిగ్ హాట్ స్పాట్గా మారింది. అక్కడి నుంచి ఏపీకి కూడా వైరస్ వ్యాప్తి చెందుతోంది. మంగళవారం రాష్ట్రంలో నమోదయిన 33 కొత్త కేసుల్లో 20 కేసులకు కోయంబేడుతో లింకులు బయటపడ్డాయి. ఈ 20 మంది కోయంబేడు మార్కెటకు వెళ్లడం వల్లే కరోనా సోకిందని అధికారులు నిర్దారించారు. చిత్తూరులో కొత్తగా నమోదైన 10 కేసులు,నెల్లూరులో కొత్తగా నమోదైన 9 కేసులు,తూర్పుగోదావరిలో ఒక కేసుకు కోయంబేడు లింకులే కారణమని తేల్చారు.
క్వారంటైన్ పీరియడ్ ముగించుకున్న వారు ఏమౌతున్నారు? ఎటు వెళ్తున్నారు?
తాడిపత్రిలో 250 మంది.. కోయంబేడుతో లింకులు..
కొత్తగా గుర్తించిన పాజిటివ్ కేసుల ద్వారా ఇంకెంతమందికి కరోనా సోకిందోనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అసలు ఏపీ నుంచి కోయంబేడు మార్కెట్కు మొత్తం ఎంతమంది రాకపోకలు సాగించి ఉంటారని అధికారులు ఆరా తీస్తున్నారు. ఈ నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం నుంచి అనంతపురం జిల్లా కలెక్టర్కు ఒక జాబితా అందింది. ఇందులో తాడిపత్రి పరిసర ప్రాంతాలకు చెందిన దాదాపు 250 పైచిలుకు మంది కోయంబేడుకు రాకపోకలు సాగించినట్టు తెలిపారు. చీనీ,జామ,కరివేపాకు తదితర పంటల అమ్మకానికి ఇక్కడి రైతులు కోయంబేడు మార్కెట్కు వచ్చినట్టు పేర్కొన్నారు.
160 మంది క్వారెంటైన్..
తమిళనాడు ప్రభుత్వం ఇచ్చిన సమాచారంతో గత నెల రోజుల్లో జిల్లా నుంచి కోయంబేడుకు వెళ్లిన వాహనాల డ్రైవర్లు, క్లీనర్ల లిస్టును అధికారులు తయారుచేశారు. ఇందులో ఉన్నవారిని గుర్తించి క్వారెంటైన్ కేంద్రాలకు తరలిస్తున్నారు. ఇప్పటివరకూ తాడిపత్రితో పాటు పుట్లూరు, యల్లనూరు, పెద్దపప్పూరు, యాడికి మండలాల్లోని 160 మందిని క్వారంటైన్కు తరలించారు. మరో 100 మందిని ఇంకా గుర్తించే పనిలో ఉన్నట్టు తెలుస్తోంది. వీరి కోసం వివిధ శాఖల అధికారులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు.
కోయంబేడు హాట్ స్పాట్..
ఏప్రిల్ 14న తమిళ కొత్త సంవత్సరం సందర్భంగా ఆసియాలోనే అతి పెద్దదైన కోయంబేడు మార్కెట్కు భారీగా జనం తరలివచ్చారు. రద్దీ పెరగడంతో భౌతిక దూరం నిబంధనలు పాటించలేదు.ఫలితంగామార్కెట్లో 50 మందికి పైగా కరోనా వైరస్ భారిన పడ్డారు. తమిళనాడులో బయటపడ్డ దాదాపు 2వేల కరోనా పాజిటివ్ కేసులకు కోయంబేడు లింకులే కారణమని భావిస్తున్నారు. ఇటు ఏపీలో చిత్తూరు,నెల్లూరు,తూర్పు గోదావరి జిల్లాలపై ఆ ప్రభావం పడింది. గుంటూరు జిల్లా తెనాలిలోనూ కోయంబేడు లింకుతో ఒక పాజిటివ్ కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో వీరందరి కాంటాక్టులను అధికారులు గుర్తించి క్వారెంటైన్ చేసే పనిలో నిమగ్నమయ్యారు.