ఏపీలో మరోసారి భారీగా పెరిగిన కరోనా పాజిటివ్ కేసులు: 5636కు చేరిక
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. గత 24 గంటల్లో 11,775 మంది నమూనాలు పరీక్షించగా 207 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయినట్లు వైద్యారోగ్య శాఖ బులిటెన్ తెలిపింది. వీటిలో విదేశాలు, పొరుగు రాష్ట్రాలకు వారివే 66 ఉండగా, రాష్ట్రంలో 141 పాజిటివ్ కేసులు వచ్చాయి.
పొరుగు దేశాలు, రాష్ట్రాల నుంచి వచ్చిన వారితో కలిపి రాష్ట్రంలో ఇప్పటి వరకు మొత్తం 5636 కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా గత 24 గంటల్లో ఎలాంటి మరణాలు సంభవించలేదు.
రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనా కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 80, ఇప్పటి వరకు వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొంది కోలుకుని డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 2559కి చేరింది. ప్రస్తుతం వివిధ కరోనా ఆస్పత్రుల్లో 1723 మంది చికిత్స పొందుతున్నారు.
కాగా, దేశంలో 2,98,141 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, 1,42,445 యాక్టివ్ కేసులున్నాయి. 1,47,173 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దేశంలో ఇప్పటి వరకు 8,508 మంది కరోనా బారినపడి మరణించారు. కాగా, మహారాష్ట్రలో అత్యధికంగా 97,648 మంది కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, 3590 మంది మరణించారు.