Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

కీలక మావో నేతలు హతం, ఆర్కే కొడుకు కూడా: అదే వ్యూహంతో దెబ్బకొట్టిన పోలీస్

విజయవాడ: ఆంధ్రా - ఒడిశా సరిహద్దుల్లో మావోయిస్టులకు గట్టి దెబ్బ తగిలింది. సోమవారం తెల్లవారుజామున జరిగిన ఎన్‌కౌంటర్‌లో 24 మంది మృతి చెందారు. మృతుల్లో 17 మంది పురుషులు, ఏడుగురు మహిళలు ఉన్నారు. చనిపోయిన మావోయిస్టుల్లో కొందరిని గుర్తించారు.

మృతుల్లో మావో అగ్రనేత ఆర్కే తనయుడు మున్నా, అగ్రనేత డాకూరీ వెంకటరమణ, చత్తీస్‌గఢ్ సెక్రటరీ కేశవ రావు, కోరాపుట్ మల్గన్ గిరి సెక్రటరి దయా అలియాక్ కిష్టయ్య,దుబాసి శంకర్ భార్య లత, గమ్మెల్ల కేశవ రావు, శ్వేత, బుద్రి, స్వరూప అలియాస్ రికీ, బొడ్డు కుందనాల, రాజేష్ తదితరులు ఉన్నారు.

మావోల హతం

మావోల హతం

ఏవోబీ ప్రాంతానికి పది కిలో మీటర్ల దూరంలోని ఒడిశా రాష్ట్రం మల్కాన్‌గిరి జిల్లాలోని రామ్‌గఢ్‌-పనస్‌పుట్‌ మధ్య రామగుర్హ అటవీ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. రామగుర్హ అటవీ ప్రాంతంలో మావోయిస్టులు సమావేశం నిర్వహిస్తున్నారన్న సమాచారం అందుకున్న గ్రేహౌండ్స్‌ దళాలు ఆదివారం నుంచీ ఈ ప్రాంతంలో కూంబింగ్‌ నిర్వహించాయి.

అగ్రనేతలు కూడా

అగ్రనేతలు కూడా

ఈ నేపథ్యంలో సోమవారం తెల్లవారుజామున రామగుర్హ అటవీ ప్రాంతంలో గ్రేహౌండ్స్‌ దళాలకు మావోయిస్టులు తారసపడ్డారు. దీంతో వీరిపై మావోయిస్టులు కాల్పులు జరపగా, స్పందించిన భద్రతా బలగాలు ఎదురుకాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో 24 మంది మావోయిస్టులు హతమయ్యారు. ఇద్దరు పోలీసులు గాయపడ్డారు. వీరిని హెలికాప్టర్‌లో హుటాహుటిన విశాఖలోని కేజీహెచ్‌కు తరలించారు.

ఆయుధాలు స్వాధీనం

ఆయుధాలు స్వాధీనం

వీరిలో విశాఖ‌లోని గాజువాక ప్రాంతానికి చెందిన‌ అబూబాక‌ర్ అనే సీనియ‌ర్ క‌మాండో చికిత్స‌పొందుతూ మృతి చెందారు. ఘటనా స్థలంలో నాలుగు ఏకే 47 తుపాకులు, భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. ఎన్‌కౌంటర్‌ జరిగిన ప్రదేశానికి సమీపంలోనే మావోయిస్టుల డెన్‌ ఉన్నట్లు గుర్తించారు.

ఇది పెద్ద దెబ్బ

ఇది పెద్ద దెబ్బ


ఇటీవల కాలంలో ఇంత పెద్ద సంఖ్యలో మావోయిస్టులు మృతిచెందడం ఇదే తొలిసారి. మృతుల్లో మావోయిస్టు అగ్రనేత రామకృష్ణ కుమారుడు మున్నాతో పాటు మరో అగ్రనేత ఉదయ్‌ కూడా కూడా ఉన్నారు. మున్నా ఇటీవలే మావోయిస్టు దళంలో చేరినట్లు తెలుస్తోంది. మృతదేహాలను హెలికాప్టర్‌లో మల్కన్‌గిరి తరలిస్తున్నారు.

డిజిపి ప్రకటన

డిజిపి ప్రకటన


కాగా, సరిహద్దుల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో 24 మావోయిస్టులు మృతిచెందినట్లు ఆంధ్రప్రదేశ్‌ డీజీపీ సాంబశివ రావు తెలిపారు. సంఘటనా స్థలం నుంచి నాలుగు ఏకే47 తుపాకులు స్వాధీనం చేసుకున్నామన్నారు.

కాల్పులు

కాల్పులు

సంఘటనాస్థలంలో ఎదురుకాల్పులు ఇంకా కొనసాగుతున్నట్లు డీజీపీ సాంబశివ రావు తెలిపారు. కాల్పుల విరమణ పాటించాలని కోరుతున్నప్పటికీ మావోయిస్టులు పట్టించుకోవడం లేదన్నారు. కాల్పులు ఈరోజు సాయంత్రం వరకు కొనసాగే అవకాశముందన్నారు.

కోర్టుకు

కోర్టుకు


ఇదిలా ఉండగా, అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము వరకు ఆంధ్ర-ఒడిశా బోర్డర్ లో కొనసాగిన ఎన్‌కౌంటర్ లో 24 మంది మావోలు హతమయ్యారు. ఈ ఎన్‌కౌంటర్‌ను సవాల్ చేస్తూ పౌరహక్కుల నేతలు హైకోర్టులో అత్యవసర పిటిషన్ వేశారు.

వరవర రావు ఖండన

వరవర రావు ఖండన


మావో ఎన్ కౌంటర్ పైన విరసం నేత వరవరరావు మాట్లాడారు. ఏవోబీలో జరిగింది బూటకపు ఎన్‌కౌంటర్ అన్నారు. ఎన్ కౌంటర్లో చనిపోయిన వారి మృతదేహాలను భద్రపరచాలని డిమాండ్ చేశారు. వారి బంధువులు వచ్చేంత వరకు పోస్ట్ మార్టం నిర్వహించకూడదన్నారు. జాతీయ మానవ హక్కుల సంస్థ నిబంధనల మేరకే పోస్టుమార్టం నిర్వహించాలని కోరారు.

బలిమెలకు ప్రతీకారం

బలిమెలకు ప్రతీకారం

మావోయిస్టు పార్టీకి పట్టున్న బలిమెల రిజర్వాయర్ పరిసర ప్రాంతాల్లో ఎనిమిదేళ్ల క్రితం బెజ్జింగ్ ఎన్‌కౌంటరుతో గ్రేహౌండ్స్ కమాండోలు ప్రతీకారం తీర్చుకున్నాయి. 2008 జూన్ 29న బెజ్జింగ్, జంత్రి కటాఫ్ ఏరియాలో కూంబింగ్ నిర్వహించి లాంచీలో తిరుగు పయనం అవుతున్న గ్రేహౌండ్స్ బలగాలబై మావోలు దాడి చేశారు.

వారం కూంబింగ్

వారం కూంబింగ్

వారం రోజులు కూంబింగ్ నిర్వహించి అలిసిన గ్రేహౌండ్స్ కమాండోలు 60 మంది ఒకే లాంచీలో మల్గన్ గిరి పయనమయ్యారు. లాంచీలో గ్రేహౌండ్స్ బలగాలు ప్రయాణిస్తున్న సమాచారం తెలుసుకొని మావోలు అల్లంపాక వద్ద మాటువేసి దాడి చేసారు. అల్లంపాక వద్ద రెండు కొండల మధ్య నుంచి లాంచీ ప్రయాణించాలి.

బయటకు వచ్చే మార్గం లేక

బయటకు వచ్చే మార్గం లేక

దీనిని అదునుగా తీసుకున్న మావోలు కాల్పులు జరపడంతో గ్రేహౌండ్స్ బలగాలు బయటకు వచ్చే మార్గం లేక అంతా ఒకేవైపుకు వెళ్లిపోవడంతో లాంచీ మునిగింది. ఈ ఘనటలో ఓ సివిల్ ఎస్సై, 34 మంది గ్రేహౌండ్స్ కమాండోలు, ఇద్దరు హోంగార్డులు, లాంచీ డ్రైవర్ మృతి చెందారు. 22 మంది సురక్షితంగా బయటపడ్డారు. 38 మంది ఒకేసారి జలసమాధి కావడం అప్పట్లో బలిమెల ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.

అదే వ్యూహంతో..

అదే వ్యూహంతో..

బలిమెల ఘటన తర్వాత గ్రేహౌండ్స్‌ బలగాలు ప్రతీకారంతో రగిలిపోతున్నాయనే చెప్పాలి. ఈ నేపథ్యంలో 2008లో తమను దెబ్బతీసేందుకు మావోయిస్టులు పన్నిన వ్యూహాన్నే, తాజాగా వారిని మట్టుబెట్టేందుకు పోలీసులు అనుసరించారని తెలుస్తోందంటున్నారు.

ఎవరూ రారనుకొని

ఎవరూ రారనుకొని

ఆంధ్రా, ఒడిశా సరిహద్దు ప్రాంతంలోని బెజ్జింగ్‌ అటవీ ప్రాంతంలో మావోయిస్టు అగ్రనేతలు ప్లీనరీ నిర్వహిస్తారని తెలుసుకున్న పోలీసులు, గ్రేహౌండ్స్‌ కమాండోలు పథకం ప్రకారం మావోయిస్టులపై దాడి చేయాలని నిర్ణయించారు. ప్లీనరీకి ఎంపిక చేసిన ప్రాంతం ఆంధ్రా, ఒడిశా రాష్ట్రాలకు సరిహద్దులో అటవీ ప్రాంతం కావడంతో ఎవరూరారనే ధీమాతో మావోయిస్టులు ఏమరపాటుతో ఉన్నారు.

ముందుగానే పసిగట్టి

ముందుగానే పసిగట్టి

అయితే మావోయిస్టులు ఎక్కడ ప్లీనరీ నిర్వహిస్తారో ముందుగానే పసిగట్టిన పోలీసులు, గుట్టుగా ఆదివారం ముంచంగిపుట్టు, రూడకోట కేంద్రాలుగా మావోయిస్టులున్న ప్రాంతానికి సాయుధ బలగాలను తరలించారు. అదను చూసి ఆదివారం అర్ధరాత్రి దాటిన తరువాత మావోయిస్టులపై ఇరువైపుల నుంచి కాల్పులు జరిపారని, ఈ కాల్పుల్లో 24 మంది మావోయిస్టులు మృతి చెందారని తెలుస్తుంది. గతంలో పోలీసులను మట్టుబెట్టేందుకు మావోలు అనుసరించిన వ్యూహాన్నే పోలీసులు అనుసరించి, విజయం సాధించారని అంటున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+