చంద్రబాబుకు కాపు చిక్కులు: 25 బీసీ సంఘాల హెచ్చరిక
విజయవాడ: కాపులకు రిజర్వేషన్ల కోసం ఉద్యమం ఎగిసిపడుతున్న నేపథ్యంలో బీసీ కులాల పెద్దలు ఏకమయ్యారు. కాపులను బీసీల్లో చేరిస్తే సహించబోమని, ప్రభుత్వాన్ని పడగొట్టడానికి కూడా వెనకాడబోమని విజయవాడలో బుధవారం సమావేశమైన 25 బీసీ సంఘాల నాయకులు హెచ్చరించారు.
బీసీ మహాజన సభ పేరు మీద వారంతా సమావేశమయ్యారు. కాపుల వెనకబాటుతనాన్ని నిర్ధారించడానికి కమిషన్ వేయడాన్ని కూడా వారు తప్పు పట్టారు. కమిషన్ ఏర్పాటు చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని, అది కేంద్ర ప్రభుత్వ పరిధిలోనిదని వారన్నారు. కుల పెద్దలు డిమాండ్ చేశారు కాబట్టి ఒక కులాన్ని బీసీల్లో చేర్చే అర్హతను నిర్ణయించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని వారన్నారు.
Photos: Kapu Protests Turn Violent
రిజర్వేషన్లు అనేవి సమాజంలోని పేదలకు సాయపడే ఆర్థిక కార్యక్రమం కాదని, సామాజిక హోదా కరువై శతాబ్దాలుగా అణచివేతకు గురైన కులాల అభివృద్ధికి తీసుకుని వచ్చిన సాంఘిక సంస్కరణ ఉద్యమమని వారు అభిప్రాయపడ్డారు.
ప్రతి కులంలోనూ పేదలున్న మాట వాస్తవమేనని, వారిని పైకి తేవడానికి పేదరిక నిర్మూల కార్యక్రమాలు చేపట్టాలని, కాపుల్లోని పేదల అభివృద్ధికి అటువంటి కార్యక్రమం తీసుకుంటే తాము స్వాగతిస్తామని వారు చెప్పారు.
కాపులను బీసిల్లో చేరిస్తే రిజర్వేషన్లలో బీసీ కెటగరీ కల్పన ప్రయోజనమే దెబ్బ తింటుందని వారు చెప్పారు. కాపులు ఆర్థికంగా ముందంజలో ఉన్నారని, రాజకీయాల్లోనూ సినిమాల్లోనూ ప్రతి పారిశ్రామిక రంగంలోనూ వారు కనిపిస్తారని, అందువల్ల వారిని బీసీల్లో చేరిస్తే తాము అంగీకరించబోమని సమావేశంలో పాల్గొన్న బీసీ ప్రజా సంక్షేమ సంఘం గూడూరి వెంకటేశ్వర రావు అన్నారు.
బీసీలు ఇప్పటికే అభద్రతకు గురయ్యారని, కాపు గర్జన దాన్ని మరింత పెంచిందని బీసీ నాయకులు అన్నారు. కాపులను బీసీల్లో చేరిస్తే తాము దానికి వ్యతిరేకంగా పోరాడక తప్పదని చెప్పారు. కాపులను బీసీల్లో చేర్చకూడదని ప్రభుత్వాన్ని కోరుతూ సమావేశం ఓ తీర్మానం చేసింది.
తాము మంజునాథ కమిషన్ నివేదిక వచ్చే వరకు వేచి చూద్దామని భావించామని, అయితే కాపు ఐక్య గర్జన కారణంగా ముందుగానే ఆందోళనకు దిగాల్సిన పరిస్థితి వచ్చిందని వారన్నారు.