కచ్చులూరు గ్రామస్తులకు నగదు ప్రోత్సాహకం, సాహసం చేసినవారికి గుర్తింపు
గోదావరి పడవ ప్రమాదంలో చిక్కుకున్న వారిని 26 మంది టూరిస్టులను కాపాడిన కచ్చులూరు గ్రామస్తులను రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. ప్రాణాలకు తెగించి టూరిస్టుల ప్రాణాలను కాపాడిన వారికి నగదు ప్రోత్సహక బహుమతిని ప్రకటించారు. సాహాసంతో ప్రమాద బాధితులను కాపాడిన ఒక్కొక్కరికి రూ. 25వేలను ఇవ్వాలని సీఎం జగన్మోహన్ రెడ్డి జిల్లా అధికారులను ఆదేశించినట్టు వ్యవసాయశాఖ మంత్రి కన్నబాబు చెప్పారు. ఈ సందర్భంగా బోటును వెలికి తీయడానికి అన్ని ప్రయత్నాలను చిత్తశుద్దితో చేస్తున్నామని చెప్పారు.
అచూకి లభించని వారి డెత్సర్టిఫికెట్స్ అడుగుతున్నారు
కాగా మొత్తం బోటు ప్రమాదం జరిగినప్పుడు పిల్లలు, బోటు సిబ్బంది కలిసి 77 మంది ఉన్నట్టు కన్నబాబు తెలిపారు. గోదావరి ఉదృతి వల్లే ఈ ప్రమాదానికి గురైందనే అంచనాకు వచ్చినట్టు మంత్రి తెలిపారు. ఇందులో డ్రైవర్ ఆచూకి కూడ లభించలేదని చెప్పారు. డ్రైవర్తో సహ ఇంకా పద్నాలుగు మంది ఆచూకి లభించాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఆరుగురు తెలంగాణకు చెందిన వారు కాగా, మిగిలిన ఎనిమిది మంది ఆంధ్రప్రదేశ్కు చెందిన వారని చెప్పారు. కాగా ఆచూకి లభించని వారి కుటుంభ సభ్యులు మరణదృవీకరణ సర్టిఫికెట్స్ను అడుగుతున్నారని తెలిపారు. వారికి ఎలా ఇవ్వాలనే దానిపై చర్చిస్తున్నామని చెప్పారు.
బోటు ప్రమాదంపై రాజకీయం చేస్తున్నారు
కాగా బోటు ప్రమాదంలో రాజకీయం చేసేందుకు చంద్రబాబు నాయుడు లాంటీవారు ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. ఇక దేశంలో ఇంత లోతులో బోటు మునిగిపోయిన చరిత్ర లేదని తెలిపారు. బోటును వెలికి తీసేందుకు ఇప్పటికే ముంబాయి, చత్తీస్గఢ్, కాకినాడ ప్రాంతాలకు చెందిన అనుభవజ్ఞులైన వారిని తీసుకువచ్చామని చెప్పారు. కాని ప్రతికూల పరిస్థితుల వల్ల బోటును బయటకు తీయలేక పోతున్నామని తెలిపారు. అయితే ఇంకా బోటును తీసేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయని ఆయన చెప్పారు. అయితే బోటును తాము వెలికి తీస్తామంటూ కొంతమంది ప్రైవేట్ వ్యక్తుల వస్తున్నారని, అలాంటీ వారు జిల్లా అధికారులను కలిస్తే వారికి కావాల్సిన సదుపాయాలు ఏర్పాటు చేస్తామని చెప్పారు.
నివేదిక తర్వాత పూర్తి స్థాయి చర్యలు
నీటి ప్రమాదాలపై ఇప్పటి వరకు సరైన గైడ్లైన్స్ లేవని చెప్పిన కన్నబాబు.. భవిష్యత్లో ఇలాంటి సంఘటనలు పునారావృతం కాకుండా నివేదిక తాయారు చేసేందుకు ముఖ్యమంత్రి జగన్ మోహన్రెడ్డి ఆదేశాలతో కమిటిని నియమించారని తెలిపారు. కమిటి నివేదిక రాగానే పూర్తి స్థాయి చర్యలు చేపడతామని ఆయన ప్రకటించారు. పోలీసుల నుండి ఇతర జిల్లా అధికారులను ఇందులో భాగస్వామ్యులను చేసే ప్రక్రియ కొనసాగుతుందని చెప్పారు. ప్రమాదం తర్వాత సీఎం జగన్ మోహన్ రెడ్డి తీసుకున్న పలు అంశాలను ఈ సంధర్భంగా కన్నబాబు వివరించారు.