దేశంలో భారీగా పెరిగిన కరోనా కేసులు - ఒక్కరోజే 27,553 కేసులు : 1,525 కి చేరిన ఒమిక్రాన్ కేసుల సంఖ్య..!!
దేశ వ్యాప్తంగా మరోసారి కరోనా కేసుల కలకలం కొనసాగుతోంది. అనూహ్యంగా పెరుగుదల కనిపిస్తోంది. గడిచిన 24 గంటల్లో ఒక్కరోజే 27,553 కేసులు నమోదయ్యాయి. 284 మంది మరణించారు. 9,249 మంది కోలుకున్నారు.శుక్రవారం 58,11,487 మందికి టీకాలు అందించారు. మరోవైపు ఒమిక్రాన్ కేసులు ఆందోళన పెంచుతున్నాయి. ఒమిక్రాన్ కేసుల సంఖ్య 1,525 కి చేరింది. పలు రాష్ట్రాల్లో కరోనా కేసులు ఆందోళనకర స్థాయిలో నమోదవుతున్నాయి. మహారాష్ట్రలో కొత్తగా 8,067 కరోనా కేసులు వెలుగుచూశాయి.

పెరిగిపోతున్న కరోనా కేసులు
ఇవి గురువారంతో పోలిస్తే... 2,669 కేసులు అధికం. మహారాష్ట్రలో మరో నలుగురికి ఒమిక్రాన్ సోకినట్లు నిర్ధరణ అయింది. వైరస్ కారణంగా.. మరో 8 మంది కన్నుమూశారు. బంగాల్లో కరోనా బీభత్సం సృష్టిస్తోంది. కొత్తగా 3,451 కేసులు వెలుగు చూశాయి. కొత్త కేసుల్లో 56శాతం కేసులు కోల్కతాలోనే నమోదు కావడం గమనార్హం. అక్కడ 1,954 కేసులు బయటపడ్డాయి. ఈ మేరకు ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ తెలిపింది. కరోనా ధాటికి మరో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారని అధికార వర్గాలు వెల్లడించాయి. ఇక, బంగాల్లో శుక్రవారం 1,150 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. కేరళలోనూ కరోనా వేగంగా వ్యాపిస్తోంది.

అటు కరోనా - ఇటు ఒమిక్రాన్
ఆ రాష్ట్రంలో కొత్తగా 2,676 కేసులు నమోదయ్యాయి. మరో 353 మరణాలు వెలుగు చూశాయి. మరోవైపు... కేరళలో కొత్తగా 44 మందికి ఒమిక్రాన్ వేరియంట్ సోకినట్లు తేలింది. ఫలితంగా... కేరళలో మొత్తం ఒమిక్రాన్ బాధితుల సంఖ్య 107కు చేరింది. కాగా, దేశం మొత్తం మీద ఇప్పటి వరకు మొత్తం కేసులు: 3,48,89,132 కాగా, మొత్తం మరణాలు: 4,81,770 గా నమోదయ్యాయి.
యాక్టివ్ కేసులు: 1,22,801ఎండగా...కోలుకున్నవారు: 3,42,84,561గా నిర్దారించారు. ఇదే సమయంలో వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేసారు. శనివారం మరో 25,75,225 మందికి వ్యాక్సిన్లు అందించారు. దీంతో ఇప్పటివరకు పంపిణీ చేసిన డోసుల సంఖ్య 1,45,44,13,005 కు చేరింది.ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు ఆందోళనకర రీతిలో నమోదవుతున్నాయి.

కేంద్రం అప్రమత్తం- రాష్ట్రాలకు లేఖ
ఒక్కరోజే 11 లక్షలకు పైగా కేసులు వెలుగులోకి వచ్చాయి. 3,875 మంది ప్రాణాలు కోల్పోయారు. ఫ్రాన్స్లో 2.19 లక్షల కరోనా కేసులు నమోదయ్యాయి. 110 మంది మరణించారు. మొత్తం మృతుల సంఖ్య 1,23,851కు చేరింది.బ్రిటన్లోనూ కరోనా విజృంభణ కొనసాగుతోంది. కొత్తగా లక్షా 62 వేల కేసులు నమోదయ్యాయి. 154 మంది ప్రాణాలు కోల్పోయారు. అమెరికాలో కొత్తగా 1.61 లక్షల కేసులు నమోదయ్యాయి. 257 మంది ప్రాణలు కోల్పోయారు. మొత్తం మరణాల సంఖ్య 8.46లక్షలకు చేరింది.

విదేశాల్లోనూ భారీగా కోవిడ్ కేసులు
ఇటలీలో 1.41 లక్షల కొవిడ్ కేసులు నమోదయ్యాయి. 111 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం కేసుల సంఖ్య 62,66,939 కు పెరిగింది. మరణాల సంఖ్య 1,37,513కు చేరుకుంది.టర్కీలో కొత్తగా 36 వేల కేసులు నమోదు అయ్యాయి. 145 మంది వైరస్ కారణంగా ప్రాణాలు కోల్పోయారు. ఈ పరిస్థితులతో కేంద్రం అప్రమత్తమైంది. రాష్ట్రాలకు లేఖ రాసింది. ఫీల్డ్ ఆస్పత్రిలతో పాటుగా కంట్రోల్ రూంలను వెంటనే ఏర్పాటు చేయాలని సూచించింది.












Click it and Unblock the Notifications