గడువు ఇచ్చినా డోన్ట్కేర్: సంక్రాంతి వేళ.. ఏపీ సర్కార్ మళ్లీ కొరడా: థియేటర్లకు మళ్లీ తాళం
చిత్తూరు: ఏపీలో కొద్ది రోజుల కిందట సంచలనం సృష్టించిన సినిమా థియేటర్లపై రెవెన్యూ శాఖ అధికారుల దాడులు.. మళ్లీ మొదలయ్యాయి. సంక్రాంతి పండగ వేళ ఈ దాడులు చేపట్టడం కలకలం రేపుతోంది. ప్రభుత్వం గడువు ఇచ్చినప్పటికీ.. లైసెన్స్ను పునరుద్ధరించుకోకపోవడం, భద్రతా ప్రమాణాలను పాటించని థియేటర్లపై అధికారులు కొరడా ఝుళిపించడం షురూ చేశారు. ఈ తనిఖీలు, దాడులను మరింత ముమ్మరం చేయనున్నారు.
చిత్తూరు జిల్లాలో..
తాజాగా- చిత్తూరు జిల్లా శ్రీకాకుళంలో మూడు సినిమా థియేటర్లను స్థానిక రెవెన్యూ అధికారులు సీజ్ చేశారు. వాటికి తాళాలు వేశారు. థియేటర్ లైసెన్సులను పునరుద్ధరించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నందున ఈ మూడు థియేటర్లను సీజ్ చేయాల్సి వచ్చిందని అధికారులు చెబుతున్నారు. సంవత్సర కాలంగా ఆయా థియేటర్ల యజమానులు తమ లైసెన్సులను రెన్యూవల్ చేయించుకోలేదని అధికారుల తనిఖీల్లో తేలింది.
మంత్రి వార్నింగ్..
థియేటర్ల లైసెన్సులను పునరుద్ధరించుకోవడానికి ప్రభుత్వం వాటి యజమానులకు గడువు ఇచ్చిన విషయం తెలిసిందే. నెల రోజుల్లో థియేటర్ల యజమానులందరూ లైసెన్సులను రెన్యూవల్ చేయించుకోవాల్సి ఉంటుందని, లేదంటే మళ్లీ దాడులు తప్పవంటూ కొద్ది రోజుల కిందటే సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి పేర్ని నాని హెచ్చరించిన విషయం తెలిసిందే. అంతకుముందు నిర్వహించిన దాడుల సందర్భంగా సీజ్ చేసిన 200లకు పైగా థియేటర్లను తెరచుకోవడానికి అనుమతి ఇచ్చారు అధికారులు.
గడువు ఇచ్చినా..
గడువు ఇచ్చినప్పటికీ యజమానులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోన్నారనే విషయం మరోసారి నిర్ధారణ అయింది. దీనితో అధికారులు మళ్లీ దాడులకు దిగారు. తమ పరిధిలో లైసెన్సులను రెన్యూవల్ చేయించుకోని థియేటర్లపై అధికారులు దాడులు పునఃప్రారంభించారు. తొలివిడతలో శ్రీకాళహస్తిలో మూడింటిని సీజ్ చేశారు. మిగిలిన వాటిల్లో తనిఖీలు కొనసాగుతున్నాయి. చిత్తూరు జిల్లా వ్యాప్తంగా థియేటర్లల్లో తనిఖీలను మొదలు పెట్టినట్లు చెబుతున్నారు.
కనీస ప్రమాణాలను పాటించకుండా..
థియేటర్లల్లో కనీస భద్రత ప్రమాణాలు పాటించడం, పార్కింగ్ వంటి స్థలాల్లో సీసీటీవీ కెమెరాలను అమర్చుకోవడం, టికెట్లను విక్రయించినప్పుడు వాటికి సంబంధించిన రికార్డులను సక్రమంగా నిర్వహించడం వంటి కనీస చర్యలను కూడా థియేటర్ల యజమానులు పాటించట్లేదంటూ ఈ దాడుల్లో ఇదివరకే స్పష్టమైంది. సంక్రాంతి సీజన్ సమీపించిన ఈ సమయంలో థియేటర్లు మూత పడటం పట్ల అటు యజమానుల్లో ఆందోళన వ్యక్తమౌతోంది.
సంక్రాంతి వేళ..
జూనియర్ ఎన్టీఆర్-రామ్చరణ్-ఎస్ఎస్ రాజమౌళి కాంబినేషన్లో తెరకెక్కిన ట్రిపుల్ ఆర్, ప్రభాస్-పూజా హెగ్డె రాధేశ్యామ్ ఈ సంక్రాంతి బరి నుంచి తప్పుకొన్నాయి. అక్కినేని నాగార్జున-నాగచైతన్య కలిసి నటించిన బంగార్రాజు 14వ తేదీన విడుదల కానుంది. అదే రోజు కల్యాణ్ దేవ్-రచిత రామ్ జంటగా నటించిన సూపర్ మచ్చి ప్రేక్షకుల ముందుకు రానుంది. థియేటర్లన్నీ సంక్రాంతి పండగ కళను సంతరించుకోనున్నాయి.
గడువు ఇచ్చినా.. నిర్లక్ష్యమా..
ఈ పరిస్థితుల్లో సినిమా థియేటర్లు మూతపడటం పట్ల గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. లైసెన్సులను రెన్యూవల్ చేయించుకోవడం, కనీస ప్రమాణాలను పాటించే విషయంలో ప్రభుత్వం ఏ మాత్రం రాజీధోరణిని కనపర్చట్లేదు. థియేటర్ల యాజమాన్యం పట్ల కఠినంగా వ్యవహరిస్తోంది. గడువు ఇచ్చినప్పటికీ..థియేటర్ల యాజమాన్యం నిర్లక్ష్యంగా ఉండటాన్ని తీవ్రంగా పరిగణిస్తోంది. భారీ జరిమానాలను సైతం వడ్డించడానికి వెనుకాడట్లేదు.