ఈ నెల 19 నుంచి రాజధాని అమరావతిలో..: చకచకా ఏర్పాట్లు
ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. మంగళవారం నాడు 77,596 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వారిలో 31,565 మంది తలనీలాలు సమర్పించారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆ ఒక్క రోజే హుండీ ద్వారా 3.73 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది.
వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో 25 కంపార్టుమెంట్లు నిండిపోయాయి. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 15 నుంచి 17 గంటల సమయం పట్టింది. కంపార్ట్మెంట్లల్లో వేచి ఉన్న భక్తులకు టీటీడీ సిబ్బంది, శ్రీవారి సేవకులు అన్నప్రసాదాలు, పాలు, మంచినీరు, అల్పాహారాన్ని పంపిణీ చేశారు.

కాగా- రాజధాని అమరావతిలో గల శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో ఈ నెల 19 నుంచి 21వ తేదీ వరకు పవిత్రోత్సవాలను ఘనంగా నిర్వహించడానికి టీటీడీ ఏర్పాట్లు చేపట్టింది. చకచకా పూర్తి చేస్తోంది. వేంకటపాలెంలో ఉందీ ఆలయం. ఆలయం నిర్మితమైన తరువాత ఇక్కడ పవిత్రోత్సవాలను నిర్వహించడం ఇదే తొలిసారి కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
ఈ నెల 18వ తేదీ సాయంత్రం ఈ పవిత్రోత్సవాలకు వైభవంగా అంకురార్పణ కార్యక్రమాన్ని నిర్వహించనుంది టీటీడీ. వేదపండితులు, అర్చకుల మంత్రోచ్ఛారణల మధ్య శాస్త్రోక్తంగా అంకురార్పణను చేపడతారు. తెల్లవారు జామున విశ్వక్సేనుల వారి ఆరాధన, పుణ్యాహవచనం, ఆచార్యుల ఋత్విక్ వరణం, సేనాధిపతి ఉత్సవం, మృతస్సంగ్రహణం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు.
19వ తేదీన ఉదయం పంచగవ్యారాధన, అకల్మష హోమం, వాస్తు పూజ, వాస్తు హోమం, స్నపన తిరుమంజనం క్రతువులను నిర్వహిస్తారు. సాయంత్రం యాగశాల వైదిక కార్యక్రమాలు, పవిత్ర ప్రతిష్టాధివాసం, సర్వదైవత్య హోమం చేపడతారు.
20వ తేదీన ఉదయం పుణ్యాహవాచనం, కుంభ ఆరాధన, ప్రధాన హోమాలు, స్నపన తిరుమంజనం, పవిత్రాభిమంత్రణ, పవిత్ర సమర్పణ చేపడతారు. సాయంత్రం యాగశాలలో వైదిక కార్యక్రమాలు, మహా శాంతి హోమం, తిరువీధి ఉత్సవం నిర్వహిస్తారు.
21వ తేదీన ఉదయం పుణ్యాహవచనం, యాగశాల వైదిక కార్యక్రమాలు, స్నపన తిరుమంజనం కార్యక్రమాలను జరుపుతారు. సాయంత్రం యాగశాల వైదిక కార్యక్రమాలు, పూర్ణాహుతి, కుంభ ప్రదక్షిణ, కుంభ సమర్పణం, విశేష ఆరాధన, ఆచార్య- ఆగమ సలహాదారు, ఋత్విక్కులకు బహుమానం, యాజమాన ఆశీర్వచనం చేపడతారు.












Click it and Unblock the Notifications