2019వరకు ఏపీని అడిగేలా: ఈసీకి ఖమ్మం ఎమ్మెల్యేలు
హైదరాబాద్: ఖమ్మం జిల్లా భద్రాచలం, అశ్వారావుపేట, పినపాక ఎమ్మెల్యేలు మంగళవారం నాడు ఎన్నికల అధికారి భన్వర్ లాల్ను కలిశారు. తమ నియోజవర్గాలలోని కొన్ని మండలాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి వెళ్లాయని ఆయన దృష్టికి చెప్పారు. 2019 వరకు ఆ మండలాల సమస్యలను ఆ రాష్ట్రం దృష్టికి తీసుకు వెళ్లేలా చూడాలని ఎమ్మెల్యేలు ఆయనను కోరారు. కాగా, ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను ఏపీలో కలిపిన విషయం తెలిసిందే.
గవర్నర్ను కలిసిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు
తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ శాసన సభ్యులు మంగళవారం సాయంత్రం రాష్ట్ర గవర్నర్ నరసింహన్ను కలిశారు. పార్టీ ఫిరాయింపుల పైన ఫిర్యాదు చేశారు. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారని ఆయన దృష్టికి తెచ్చారు. గవర్నర్తో భేటీ అనంతరం ఎమ్మేల్యే జీవన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. అసెంబ్లీలో తమ గొంతు నొక్కాలని అధికార పార్టీ చూస్తోందన్నారు. తెరాసలో చేరిన వారితో రాజీనామా చేయించి, ఎన్నికల్లో నిలబెట్టి గెలవాలని, ప్రజాక్షేత్రంలో వారు నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు.

మంత్రులకు బుల్లెట్ ప్రూఫ్ కార్లు
తెలంగాణ మంత్రులకు బుల్లెట్ ప్రూఫ్ కార్లు అందించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. మావోయిస్టుల కదలికలు ఉన్నాయంటూ నిఘా వర్గాలు హెచ్చరించడంతో కొంతమంది మంత్రులకు బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు సమకూర్చనున్నారని సమాచారం.
హైదారాబాద్ నగరంతో పాటు జిల్లాల పర్యటనలలో కూడా తప్పనిసరిగా బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు మాత్రమే వాడనున్నారని తెలుస్తోంది. ఉప ముఖ్యమంత్రి రాజయ్య, హోంశాఖ మంత్రి నాయిని నర్సింహా రెడ్డి, ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్, భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు, ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కేటీ రామారావు తదితర మంత్రులకు స్కార్పియో వాహనాలు సమకూర్చనున్నారు.
లోకేష్ పైన కేసు నమోదుకు ఆదేశం
తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ పైన ట్విట్టర్లో వ్యాఖ్యలు చేసిన తెలుగుదేశం పార్టీ యువనేత నారా లోకేష్ పైన రంగారెడ్డి కోర్టులో న్యాయవాదులు రవికుమార్, అభిలాష్ పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ విచారించిన కోర్టు లోకేష్ పైన కేసు నమోదు చేయాలని ఎల్బీ నగర్ పోలీసులను ఆదేశించింది.












Click it and Unblock the Notifications