బాహుబలి2 షాకింగ్: ఎంపీలు, ఎమ్మెల్యేల చేతిలో 3వేల టికెట్లు!
కృష్ణా: దర్శకుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన 'బాహుబలి-2' చిత్నాన్ని చూసేందుకు సామాన్యులు, సినీ అభిమానులేగాక రాజకీయ, క్రీడా ప్రముఖులు కూడా అమితాసక్తిని కనబరుస్తున్నారు. ఇప్పటికే పలువురు రాజకీయ నాయకులు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు కూడా బాహుబలి టికెట్లను బుక్ చేసుకోగా.. ఇప్పుడు మరో షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది.
వారి చేతిలోనే..
ఈ సినిమా టికెట్ల కోసం కృష్ణా జిల్లా ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు తీవ్ర ఒత్తిడి తీసుకొస్తున్నారనే వార్త సంచలనం రేపుతోంది. ఒక్కో ప్రజాప్రతినిధి వద్ద 2 వేల నుంచి 3 వేల వరకు టికెట్లు ఉన్నాయన్న వార్త సగటు సినీ అభిమానికి ఆగ్రహాన్ని తెప్పిస్తోంది.
అభిమానులకు అసంతృప్తి
కృష్ణా జిల్లా వ్యాప్తంగా 130 థియేటర్లలో ఈ సినిమాను విడుదల చేశారు. మరోవైపు ఆన్లైన్లో టికెట్లన్నీ బుక్ అయిపోయాయి. ఈ నేపథ్యంలో, థియేటర్ల వద్ద టికెట్లు దొరకడం గగనమైపోయింది. దీంతో, అభిమానులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.
ఘరానా మోసం
ఇది ఇలా ఉండగా, ప్రముఖ ఆన్లైన్ సినిమా టికెట్స్ బుకింగ్ సంస్థ 'బుక్ మై షో' తమిళనాడులో ఘరానా మోసానికి పాల్పడింది. చెన్నైలో 'బాహుబలి-2' సినిమాకు సంబంధించి అనుమతి లేని షోలకు కూడా ఒక్కో టికెట్ను రు. 500కు అమ్మింది. వాస్తవానికి ఈ టికెట్ ధర రూ. 125 మాత్రమే. టికెట్లు తీసుకుని సినిమా చూద్దామని థియేటర్లకు ఆతృతగి వెళ్లిన అభిమానులకు షాక్ తగిలింది. టికెట్లు చెల్లవని థియేటర్ యాజమాన్యాలు చెప్పడంతో వీరు అవాక్కయ్యారు. థియేటర్ల వద్దే ఆందోళనకు దిగారు.
ఆందోళన
ఈ విషయం గురించి బుక్ మై షోకు ఫోన్ చేసి అడిగితే... కేవలం రూ. 100 మాత్రమే వెనక్కి ఇస్తామని చెబుతున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. రూ. 500 వసూలు చేసి, ఇప్పుడేమో ఇంత తక్కువ మొత్తం ఇస్తామని చెబుతున్నారని మండిపడ్డారు. మరోవైపు, ఆందోళన చేస్తున్న బాధితులను చెన్నై పోలీసులు అదుపులోకి తీసుకుని, జీపుల్లో అక్కడ నుంచి తరలిస్తున్నారు.